పవర్ స్టార్ పవర్ ఫుల్ కటౌట్ ను.. డాషింగ్ డైరెక్టర్ పూరీ డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందీ..? ‘బద్రి’ లాంటి సెన్సేషన్ అవుతుంది. ఈ బ్లాక్ బస్టర్ చిత్రంతోనే దర్శకుడిగా పరిచయం అయ్యాడు పూరీ జగన్నాథ్. మొదటి చిత్రంతోనే తాను ‘అదోరకం’ అని చాటి చెప్పిన పూరీ.. ఆ తర్వాత అదే తీరును కంటిన్యూ చేశాడు. ఆ విధంగా స్టార్ హీరోలతో సమానమైన పాపులారిటీ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ‘లైగర్’తో బిజీగా ఉన్న పూరీ.. తర్వాత పవన్ తో సినిమా చేయబోతున్నాడన్న వార్త కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ఈ క్యూరియాసిటీకి కారణం ఉంది. పవన్ – పూరీది క్రేజీ కాంబో కావడం ఒక రీజనైతే.. గతంలో పూరీ చేసిన వ్యాఖ్యలు కూడా మరోకారణం. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రం తర్వాత.. ఇక, తాను పవన్ తో సినిమాలు తీయనంటూ పూరీ ప్రకటించాడని వార్తలు వచ్చాయి. అప్పట్లో ఈ కామెంట్స్ సంచలనం రేకెత్తించాయి. అలాంటిది.. ఇప్పుడు పవన్ తో పూరీ సినిమా అనే వార్తలు రావడంతో ఆసక్తి పెరుగుతోంది.
పవన్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత శరవేగంగా ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. కుటుంబాన్ని, పార్టీని నడపడానికి తనకు తెలిసిన విద్య నటించడమేనని స్పష్టం చేసిన పవన్.. వీలైనన్ని సినిమాలు వేగంగా కంప్లీట్ చేసి వచ్చే ఎన్నికలకు ప్రిపేర్ కావాలని చూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆయనకు వేగంగా సినిమాలు పూర్తిచేసే దర్శకుడు కావాలి. అలా చూసినప్పుడు తెలుగు ఇండస్ట్రీలో పూరీ కన్నా వేగంగా సినిమా తీసేవారు లేరని చెప్పొచ్చు కూడా. ఈ కారణం కూడా వీరిద్దరినీ కలిపే ఛాన్స్ ఉందని అంటున్నారు.
వీళ్లిద్దరినీ బండ్ల గణేష్ కలపబోతున్నారని టాక్. పవన్ తో సినిమా చేయాలని బండ్ల చాలా కాలంగా చూస్తున్నారు. మరోసారి గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ కొట్టాలని ఆశపడుతున్నాడు. దీనికి పవన్ కూడా ఓకే అన్నారని తెలుస్తోంది. ఇటు పూరీతోనూ గతంలో సినిమా చేశాడు బండ్ల. ఈ విధంగా ఈ ముగ్గురి కాంబోలో సినిమా రాబోతోందని టాక్. అది కూడా మహేష్ కోసం రాసిన ‘జనగణమన’ కథతో ఈ మూవీ వస్తుందని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుంది..? పవన్-పూరీ కాంబోలో సినిమా వస్తుందా? లేదా? అన్నది చూడాలి.