Nandi Awards: ఒకప్పుడు మన టాలీవుడ్ లో నంది అవార్డ్స్ వేడుకలను ఎంత వైభవంగా జరిపేవారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రభుత్వంచే ఇవ్వబడే ఈ అవార్డ్స్ ని నటీనటులు ఎంతో పవిత్రం గా భావిస్తారు. ఒక గొప్ప గౌరవం లాగా స్వీకరిస్తారు. సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) హయాం లో 2017వ సంవత్సరంలో ఈ నంది అవార్డ్స్ వేడుకని చేశారు. ఆ తర్వాత జగన్ హయాం లో నంది అవార్డ్స్ ని పూర్తిగా మర్చిపోయారు. జెన్ Z ఆడియన్స్ కి అసలు ఈ నంది అవార్డ్స్ ప్రత్యేకత కూడా తెలిసి ఉండదు. అలా తయారైంది పరిస్థితి. సుమారుగా దశాబ్దం కాలం నుండి ఆగిపోయిన నంది అవార్డ్స్ సంస్కృతి ని తిరిగి ప్రారంభించడానికి సిద్ధం అవుతుంది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం. ఈ మేరకు సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
ఆయన మాట్లాడుతూ ‘త్వరలోనే నంది అవార్డ్స్ పునః ప్రారంభించబోతున్నాం. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నంది అవార్డు అనేది ఒక ప్రత్యేకమైన గౌరవం. ఎన్నో దశాబ్దాల నుండి ఆనవాయితీగా వస్తుంది. చివరిసారిగా చంద్రబాబు నాయుడు గారి హయాం 2017 వ సంవత్సరం లో ఈ వేడుక జరిగింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఈ నంది అవార్డ్స్ ని అసలు పట్టించుకోలేదు. ఇప్పుడు మేము గ్రాండ్ గా ‘నంది అవార్డ్స్’ వేడుకని మొదలు పెట్టబోతున్నాం. సీఎం చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. రాబోయే మూడు నెలల్లోనే ఈ ఈవెంట్ ని ఏర్పాటు చేయబోతున్నాం. ఈ ఈవెంట్ ని ఎలా నిర్వహించాలి అనే దానిపై పవన్ కళ్యాణ్, బాలకృష్ణ గార్ల సూచనలు తీసుకుంటాం’ అంటూ చెప్పుకొచ్చాడు కందుల దుర్గేష్. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
తెలంగాణ లో గత ఏడాది ఘనంగా ‘గద్దర్ అవార్డ్స్’ ని మొదలు పెట్టింది అక్కడి ప్రభుత్వం. ఈ ఈవెంట్ కి నేషనల్ వైడ్ గా వచ్చిన గుర్తింపు మామూలుది కాదు. అంతకు మించే రేంజ్ లో ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ‘నంది అవార్డ్స్’ వేడుక జరగనుంది. ఈ ఈవెంట్ లో సినీ ఇండస్ట్రీ కి చెందిన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉండడం తో, ఆయన చేతుల మీద కూడా కొన్ని కీలకమైన అవార్డ్స్ స్టార్ హీరోలకు అందబోతున్నాయి అట. ఇక ఆయన హీరో గా నటించిన ‘ఓజీ’ గత ఏడాది సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలవడం తో ఆయనకు కూడా నంది అవార్డు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. చూడాలి మరి ఈ ఈవెంట్ ఏ రేంజ్ లో ఉండబోతుంది అనేది. ఇక మీదట ఒక్క సంవత్సరం కూడా మిస్ అవ్వకుండా, ఈ నంది అవార్డ్స్ వేడుకని నిర్వహించాలని కందుల దుర్గేష్ భావిస్తున్నాడట.