కాపులకు కాపులే శత్రువులా? .. కాపు సంక్షేమ సేన, పవన్ ల కథేంటి?

ఏపీలో రాజకీయాలను శాసించే స్థాయిలో కాపులు ఉన్నారు. కానీ వారు ఎప్పుడు రాజకీయ అధికారం పొందరు.. రెడ్లు, కమ్మలు సీఎంలుగా అయితే డిప్యూటీ సీఎం పోస్టులతో సంతృప్తి పడుతారు. పోనీ చిరంజీవి, పవన్, ముద్రగడ, సోము వీర్రాజు లాంటి వారు వచ్చినా వారిని ఎదగనివ్వరు.. కుట్రలు కుతంత్రాలతో తొక్కిపడేస్తారు. మరి నిజంగా కాపులు ఎదగపోవడానికి కారకులు ఎవ్వరు? కాపులను తొక్కేస్తున్నది ఎవరు? కాపులు ఇంతగా వెనుకబడిపోవడానికి ఏపీలో అసలు ఏం జరుగుతోంది? ఏపీలో ప్రబలంగా ఉన్న కాపులకు ఎవరో శత్రువులు కారు.. […]

Written By: NARESH, Updated On : January 26, 2021 11:17 am
Follow us on

ఏపీలో రాజకీయాలను శాసించే స్థాయిలో కాపులు ఉన్నారు. కానీ వారు ఎప్పుడు రాజకీయ అధికారం పొందరు.. రెడ్లు, కమ్మలు సీఎంలుగా అయితే డిప్యూటీ సీఎం పోస్టులతో సంతృప్తి పడుతారు. పోనీ చిరంజీవి, పవన్, ముద్రగడ, సోము వీర్రాజు లాంటి వారు వచ్చినా వారిని ఎదగనివ్వరు.. కుట్రలు కుతంత్రాలతో తొక్కిపడేస్తారు. మరి నిజంగా కాపులు ఎదగపోవడానికి కారకులు ఎవ్వరు? కాపులను తొక్కేస్తున్నది ఎవరు? కాపులు ఇంతగా వెనుకబడిపోవడానికి ఏపీలో అసలు ఏం జరుగుతోంది?

ఏపీలో ప్రబలంగా ఉన్న కాపులకు ఎవరో శత్రువులు కారు.. కాపులకు కాపులే శత్రువులు.. కాపులను ఎవరో తొక్కేయాల్సిన పనిలేదు.. వారిని వారే తొక్కేసుకుంటారు. ఆధిపత్యం కోసం.. కమ్మలు, రెడ్ల  చెప్పుచేతుల్లో సొంత సామాజికవర్గాన్ని నీరుగారుస్తూ కాపులను రాజకీయంగా ఎదగనీయకుండా చేస్తుంది కొందరు కాపునాయకులే అనడంలో ఎలాంటి సందేహం లేదు. వీరి తెరవెనుక ఉండి కమ్మలు, రెడ్లు చోద్యం చూస్తున్న వైనం ఏపీలో కనిపిస్తోంది. ఇతర సామాజికవర్గాలకు మేలు చేయడం కోసం సొంత సామాజికవర్గాన్నే తుదిముట్టించేలా చేస్తున్న చర్యలు  తాజా పరిణామాలు హాట్ టాపిక్ గా మారాయి..

జగన్, చంద్రబాబుల లాగా బలమైన నేతలు కాపు సామాజిక వర్గానికి లేరన్నది ఆ సమాజం అంగీకరించాల్సిన వాస్తవం.. పవన్ కళ్యాణ్ తెరమీదకు వచ్చినా ఆయన కాపులకు నాయకుడిని అని ఎక్కడా చెప్పుకోడు. పార్ట్ టైం పాలిటిక్స్ తో పవన్ కాపుల కోసం చేసింది ఇప్పటివరకు ఏమి లేదంటారు కొద్దిమంది కాపు నాయకులు. ఇక కాపుల రిజర్వేషన్ల కోసం చాలా ఏళ్లుగా ఉద్యమిస్తున్నారు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం. ఆయన ఏ పార్టీలోనూ లేరు. అలాంటి నేత అప్పుడో ఇప్పుడో కాపుల కోసం వయసు మీద పడ్డ తరుణంలోనూ ఉద్యమిస్తున్నారు. కానీ కాపుల్లో అనైక్యత.. కాపు నేతలకు టీడీపీ, వైసీపీ పదవుల పందేరంతో ఆయనకు మద్దతు కరువవుతోంది. కాపు రాజకీయనాయకులు కొద్ది మంది వివిధ పార్టీలలో సీనియర్లు వున్నా వారు తమ పార్టీ అధిష్టానానికి సేవలు చేస్తూ ఎవరు ఏరోజు కాపు కులం గురించి గాని రిజర్వేషన్స్ గురుంచి గాని పోరాడిన చరిత్ర లేదు.

తాజాగా ఏపీలో పంచాయితీ ఎన్నికల చుట్టూ పరిణామాలు వేగంగా సాగాయి. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వర్సెస్ ఏపీ సీఎం జగన్ మధ్య పెద్ద యుద్ధమే సాగింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ ఒక లేఖ రాశారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ తీరును ఎండగట్టారు. నిమ్మగడ్డ రమేశ్ తీసుకుంటున్న నిర్ణయాలను చూస్తుంటే ఆయన వెనక అదృశ్యశక్తి నడిపిస్తుందని అనుమానం కలుగుతోందని ముద్రగడ సంచలన ఆరోపణలు చేశారు. ఏపీ ప్రభుత్వంపై నిమ్మగడ్డ  చేస్తున్న దాడిని చూస్తుంటే అలానే అనిపిస్తోందన్నారు. ఏపీలోని పరిస్థితిని అర్థం చేసుకోకుండా రాజకీయ నాయకుల్లా పట్టుదలకు పోయి పంచాయితీ ఎన్నికలను నిర్వహించి తీరుతాం అంటూ పట్టుదలకు పోరాదని హితవు పలికారు. ఇప్పటికైనా పట్టింపులకు, ఇగో లకు  పోయి రచ్చ చేయడం మానేసి ఎస్ఈసీ ప్రభుత్వము ఒకరికొకరు  సహకరిస్తూ ముందుకు పోవాలని ముద్రగడ విజ్ఞప్తి చేశారు.  ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి రాజకీయాలు చేయడం మంచిది కాదని ముద్రగడ లేఖలో ఎస్ఈసీ నిమ్మగడ్డకు హితవు పలికారు. ఇటువంటి పరిస్థితి ఒక్క భారత దేశంలోనే తొలిసారిగా చూస్తున్నామని విమర్శించారు. మీకు వీలైతే ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేయండని.. వీలైతే ప్రభుత్వానికి మంచి సలహాలు ఇవ్వండని లెటర్ లో పేర్కొన్నారు.

అయితే ముద్రగడ దృష్టిలో  ఆ అదృశ్యశక్తి ఎవరన్నది అందరికీ తెలిసిన విషయమే. అందులో ప్రధాన ప్రతిపక్ష నేత పేరు ఉండొచ్చని ముద్రగడ లేఖను బట్టి కొందరు ఊహిస్తున్నారు. ఇక ఆయనతో సన్నిహితంగా ఎవరెవరు, ఏపార్టీ నేత సన్నిహితంగా వుంటారు అనేది  బహిరంగ రహస్యమే.. గత సారి సపోర్టు చేసి మరీ ఆయనను అధికారంలోకి తీసుకొచ్చిన  పార్టీ నేత ఈసారి బీజేపీతో పొత్తుతో ముందుకెళుతూ   జగన్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. సో ముద్రగడ రాసిన లేఖ కాపు పార్టీ నేతకు.. ఆయన వెనుకుండి నడిపించే ప్రధాన ప్రతిపక్ష నేతకు తగిలి ఉంటుందని ప్రచారం సాగుతోంది. దీనికి రెండు కారణాలు ఉండవచ్చు అనే బలమైన వాదనలు వున్నాయి. ముద్రగడ కాపు ఉద్యమం చేస్తున్నప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి గా ఉన్న వ్యక్తి చాలా ఇబ్బందులకు గురిచేయటం తీవ్రంగా అవమానించటం జరిగింది. ఆ రోజు ఆ ముఖ్యమంత్రితో సన్నిహితంగా ఉండి కాపు ఉద్యమానికి మద్దతు ఇవ్వకపోగా వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తి జనసేనాని. ముద్రగడ రాసిన లేఖ వెనుక ఆ అదృశ్య శక్తికి వ్యతిరేఖంగా రాసినదానిగానే చూడాలి అనేది కొందరి  కాపు నాయకుల వాదన.

కాపు ఉద్యమకారుడు ముద్రగడ పద్మనాభం తాజాగా రాసిన లేఖ దరిమిలా లేదా టైమింగ్ అలా వచ్చిందా అనేది పక్కన పెడితే కాపు   సామాజికవర్గం  గురుంచి ఏనాడు మాట్లాడని ముద్రగడ.. కాపు ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో అసలు పట్టించుకోని జనసేన పార్టీ అధ్యక్షుడు  పవన్ కళ్యాణ్  కొద్ది కాలం క్రితం రూపుదిద్దుకున్న కాపు సంక్షేమ సేన ప్రతినిధులను కలుస్తానని కాపు రిజర్వేషన్స్  మరియు కాపు కార్పొరేషన్ నిధుల గురించి చర్చిస్తానని ఒక లేఖని విడుదల చేయటం సంచలనంగా మారింది. కాపు సంక్షేమ సేన కొద్ది కాలం క్రితమే ఏర్పడింది. సుదీర్గకాలం తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్ నాయకుడు గోదావరి జిల్లాలకే చెందిన కాపు నేత చేగొండి హరిరామ జోగయ్య అధ్యక్షుడు గా ప్రారంభించ బడింది. దీనిలో ఉన్న ప్రముఖులు అందరు కుడా జనసేన పార్టీకి చెందిన నాయకులు. కాపుల సమస్యలు, కాపు రిజర్వేషన్ల అంశాలపై కాపు సంక్షేమ సేన ప్రతినిధులు కాపుల పార్టీ నాయకుడైన పవన్ కళ్యాన్ కు సీనియర్ అయిన హరిరామ జోగయ్య ద్వారా లేఖ రాయించేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై పవన్ తో చర్చిస్తామని.. సమయం ఇవ్వాలని లేఖలో కోరటం దాని బదులుగా ముద్రగడ లేఖ సమయం లోనే పవన్ కళ్యాణ్ లేఖ విడుదల అవటంతో చాలా అంశాలు చర్చకు వస్తున్నాయి.

కొద్దిమంది కాపు నాయకుల వాదన ఏమిటంటే ఏరోజు కాపుల గురించి కాపు ఉద్యమం గురుంచి మాట్లాడని జోగయ్య గారు సంక్షేమ సేనని నెలకొల్పటం దానిని గుర్తిస్తూ వారితో చర్చకు నేను సిద్దం అని పవన్ కళ్యాణ్ అనటం అనేది పూర్తిగా ముద్రగడ కి వ్యతిరేఖం గా చేస్తున్న ప్రయత్నమే.  ఇన్నాళ్లుగా పోరాటం చేసిన వ్యక్తి అయిన ముద్రగడకి వ్యతిరేఖంగా కాపులలో చీలికి తీసుకు రావటం మంచిది కాదు అని వీరి వాదన. ఏరోజు కాపు సమస్యల గురించి మాట్లాడని  జోగయ్యని   తెరపైకి తెచ్చి  కాపు రిజర్వేషన్, కాపు కార్పొరేషన్ నిధుల వినియోగం.. కాపు సామాజికవర్గానికి ఇబ్బందులు, రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు కాకపోవడం సమస్యలను పవన్ కళ్యాణ్ తో చర్చిస్తాననటం ఎంతవరకు సబబు అనేది వీరి వాదన.

కాపు సంక్షేమ సేన ప్రతినిధులు.. దానివెనుక హరిరామ జోగయ్యను తెరపైకి రావడం వెనుక జనసేన పార్టీలోని కొందరు నేతల ప్రమేయం ఉందని కొందరు కాపు నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా లేఖ రాసి యాక్టివ్ అయిన ముద్రగడకు వ్యతిరేకంగా జనసేన ఏర్పాటు  చేసుకున్న వర్గమేనా? ఇది అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముద్రగడ వ్యతిరేకులనే అందులో ఏర్పాటు చేశారని ఇది ఖచ్చితంగా జనసేన కాపులను చీల్చడానికి వేసిన ఎత్తుగడ అని కాపు వర్గంలోని కొందరు నేతలు ఆరోపిస్తున్నారు.

ఈ కాపు సంక్షేమ సేన వెనకుండి  పవన్ కళ్యాణ్ ఇదంతా చేస్తున్నారా? అన్న అనుమానాలు లేకపోలేదు. ముద్రగడను సైడ్ చేయడానికి కాపు సంక్షేమ సేనను తెరమీదకు తెచ్చాడా? అని కూడా కొందరు అనుమానిస్తున్నారు. ఈ రోజు కాపు సంక్షేమ సేనతో కలుస్తానని పవన్  ప్రకటించడం.. ముద్రగడను తొక్కేయడానికి.. కాపులను మొత్తం తన చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి వేస్తున్న ప్లాన్ అని కూడా ఆరోపిస్తున్నారు. ఇందులో  ఒక అదృశ్య శక్తీ  పాత్ర కూడా   ఉందంటున్నారు.. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కాపుల పేరుతో గత సారి చంద్రబాబు, బీజేపీకి మద్దతిచ్చి సైడ్ అయిపోయారన్న విమర్శ ఉంది.. ఈసారి ముద్రగడ మళ్లీ యాక్టివ్ కాగానే కాపులను ఓన్ చేసుకుంటున్న తీరుపై అందరిలోనూ సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.

అప్పట్లోనే కాపులను చీల్చే ప్రయత్నం ఒకటి జరిగింది.  టీడీపీకి అనుకూలంగా.. జగన్ కు వ్యతిరేకంగా ఒక గ్రూపు అప్పట్లో ఏర్పాటై నానా హంగామా చేసింది. పవన్  వద్ద పనిచేసే ఒక ఆడిటర్ దీనివెనుక ఉన్నారన్న ఆరోపణలు వచ్చాయి. నాడు కూడా ముద్రగడపై తీవ్ర విమర్శలు చేసి ఆయన ఉద్యమం నుంచి తప్పుకునేలా పురిగొల్పాయి.  కొద్దిరోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ బి జె పి అద్యక్షుడు సోమువీర్రాజు ముద్రగడని  కలవటం పార్టీలోకి రమ్మని ఆహ్వానించటం తదనంతరం ముద్రగడ నిమ్మగడ్డ కు వ్యతిరేఖం గా లేఖ రాసేసరికి ‘కాపు సంక్షేమ సేన’తో హల్ చల్ చేస్తుండడం అందరిలోనూ అనుమానాలు రేకెత్తేలా చేస్తోంది.  టీడీపీకి అనుకూలంగా ఉండే వారితోనే కాపు సంక్షేమసేన ఏర్పాటు కావడం.. ఇందులో జనసేన నాయకులే కీలక పాత్రధారులుగా ఉండడంతో ఇది ఖచ్చితంగా ముద్రగడను తొక్కేసి కాపులను హైజాక్ చేసే ప్రయత్నం అన్న అనుమానాలు కలుగుతున్నాయి. చంద్రబాబుకు అనుకూలంగా జగన్ కు వ్యతిరేకంగా ఈ బ్యాచ్ ఏర్పాటైందని ఆరోపణలు వస్తున్నాయి.

కాపుల కోసం  సడెన్ గా తెరపైకి వచ్చిన హరిరామ జోగయ్య కానీ.., పవన్ కళ్యాణ్ కానీ పెద్దగా చేసింది పోరాడింది ఏమీ లేదన్న విమర్శలున్నాయి. కాపు రిజర్వేషన్స్  సాధించటానికి కీలకమైన 9వ షెడ్యూల్ లో ఈ అంశం  చేర్చించాలని కేంద్రాన్ని పవన్ ఇప్పటిదాకా కోరింది లేదు. కేంద్రంతో అంత సయోధ్యగా ఉండే పవన్ ఈ పని ఎప్పుడో చేయవచ్చు. కానీ ఆయన కాపుల గురించి ఆలోచించిన పాపాన పోలేదన్న ఆవేదన ఆ వర్గం నేతల్లో ఉంది. మరి ఇప్పుడు కాపుసంక్షేమ సేనతో మరోసారి కాపుసమస్యలపై దృష్టిసారించిన పవన్..  కాపులకు మేలు చేసే ప్రాసెస్ లో 9వ షెడ్యూల్ లో కాపులను చేర్పించి న్యాయం చేస్తాడా? ఈ ఇద్దరు నేతలు కాపుల తరుఫున బరిగీసి నిలబడుతారా? బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్ ఈ విషయాన్ని హైలెట్ చేస్తాడా? కాపులను ఇప్పటికైనా రాజకీయంగా నిలబెడుతాడా? సాము వీర్రాజు లాంటి కాపు నేతతో కలిసి అధికారాన్ని అందుకునే స్థాయికి వస్తాడా? ఈ ప్రాసెస్ లో అందరు కాపు నేతలను.. ముద్రగడతో సహా కలుపుకుపోతాడా? అంటే కష్టమే అంటున్నారు. కాపుల్లోని అనైక్యతే వారిని రాజకీయ అధికారానికి దూరం చేస్తోందని.. వారిలోని టీడీపీ, వైసీపీ అనుకూల వర్గాలతో వారిని  వారే తొక్కేసుకుంటారన్న ఆవేదన అందరిలో వ్యక్తమవుతోంది..