Silk Smitha: నోట్ల కట్టల మీద పడుకున్న హీరోయిన్, మరణం మాత్రం అనాథలా… దేశాన్ని ఊపేసిన తెలుగు అమ్మాయి!

విపరీతంగా డబ్బులు సంపాదించిన ఆ హీరోయిన్, నోట్ల కట్టల మీద పడుకునేదట. ఆమెకున్న డిమాండ్ రీత్యా నిర్మాతలు ఎగబడేవారు. ప్రేక్షకుల్లో ఎక్కడలేని క్రేజ్. కానీ మరణం మాత్రం ఒక విషాదం. అనాధ శవంలా ఆమె అంత్యక్రియలు ముగిశాయి.

Written By: Raj Shekar, Updated On : October 16, 2024 11:15 am

Silk Smitha(1)

Follow us on

Silk Smitha: ఎవరి జీవితం ఎలా ముగుస్తుందో తెలియదు. నటిగా ఒక వెలుగు వెలిగిన ఆమె ఆత్మహత్య చేసుకుని తనవు చాలించింది. ఇక్కడ ప్రస్తావించిన హీరోయిన్ ఎవరో కాదు… సిల్క్ స్మిత. ఏలూరుకు సమీపంలో గల ఒక చిన్న గ్రామంలో సిల్క్ స్మిత పుట్టింది. కఠిక పేదరికం కావడంతో పెద్దగా చదువుకోలేదు. చిన్న వయసులోనే తల్లిదండ్రులు వివాహం చేశారు. అత్తింటివారి వేధింపులు తట్టుకోలేకపోయింది. తెగించి చెన్నై కి పారిపోయింది.

విజయలక్ష్మి ఆమె అసలు పేరు కాగా.. స్క్రీన్ నేమ్ గా సిల్క్ స్మిత అని మార్చుకుంది. శృంగార తారగా ఆమె ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. మంచి డాన్సర్. దానికి తోడు మత్తెక్కించే అందం సిల్క్ స్మితను ప్రత్యేకంగా మార్చాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రెండు వందలకు పైగా చిత్రాల్లో నటించింది. చిరంజీవి, కమల్ హాసన్, రజినీకాంత్, బాలకృష్ణ వంటి టాప్ స్టార్స్ తో ఆమె కాలు కదిపింది.

వ్యాంప్, ఐటెం భామగా అనేక చిత్రాలు చేసింది. విలన్, సపోర్టింగ్ రోల్స్ కూడా చేయడం విశేషం. ఆమె కొన్ని ఎమోషనల్ రోల్స్ సైతం చేశారు. సిల్క్ స్మిత ప్రేమలో మోసపోయింది. నమ్మినవాళ్లు కూడా ఆర్థికంగా దెబ్బ తీశారు. ఒంటరితనం భరించలేక సిల్క్ స్మిత ఆత్మహత్య చేసుకుంది. సిల్క్ స్మితతో అనుబంధం ఉన్న డిస్కో శాంతి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కీలక కామెంట్స్ చేశారు.

డిస్కో శాంతి మాట్లాడుతూ.. సిల్క్ స్మిత చాల మంచి వ్యక్తి. నాతో చనువుగా ఉండేది. నేను అక్క అని పిలిచేదాన్ని. ప్రతి విషయం నాతో పంచుకునేది. తన ఒకప్పటి భర్త, అతని పిల్లల గురించి కూడా చెప్పేది. సిల్క్ స్మితకు లక్షల్లో పారితోషికం ఇచ్చేవారు. ఆమె రోజుకు రూ. 1 లక్ష నుండి 3 లక్షల వరకు తీసుకునేది. మేము ఆ స్థాయికి రావడానికి పదేళ్ల సమయం పట్టింది.

సిల్క్ స్మితది లగ్జరీ లైఫ్. ఆమె నెలకు రూ. 5 లక్షలు చెల్లించి అద్దె ఇంట్లో ఉండేది. సొంత ఇల్లు కొనుక్కోవచ్చుగా అంటే వినేది కాదు. సిల్క్ స్మిత నోట్ల కట్టల మీద పడుకునేది. ఒకప్పుడు అవకాశాల కోసం ప్రయత్నం చేస్తే ఒక్కరూ ఛాన్స్ ఇవ్వలేదు. అందుకే ఇప్పుడు నేను నోట్ల కట్టల మీద పడుకుంటున్నాను అనేది. షూటింగ్ సెట్స్ లో సిల్క్ స్మితకు బాగా గౌరవం ఇచ్చేవారు. సిల్క్ స్మిత ఆత్మహత్య చేసుకుంటుందని అనుకోలేదు, అన్నారు.

సిల్క్ స్మిత శవాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె అంత్యక్రియలకు ఎవరూ హాజరు కాలేదు. కుటుంబ సభ్యులు సైతం పట్టించుకోలేదు. చెన్నైలో ఒక అనాథకు జరిగినట్లు అంత్యక్రియలు జరిగాయి. గతంలో ఇచ్చిన మాట ప్రకారం అర్జున్ హాజరైనట్లు పుకార్లు ఉన్నాయి. సిల్క్ స్మిత బయోపిక్ డర్టీ పిక్చర్ టైటిల్ తో 2011లో విడుదలైంది. విద్యాబాలన్ హీరోయిన్ గా నటించిన ఈ హిందీ చిత్రం మంచి విజయం అందుకుంది.