Allu Arjun: గత కొంతకాలంగా సోషల్ మీడియా లో అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రాబోతున్నారా అనే ఊహాగానాలు ఏ రేంజ్ లో ప్రచారం అయ్యాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తన మామయ్య చంద్ర శేఖర్ అల్లు అర్జున్ రాజకీయ అరంగేట్రానికి చాలా సపోర్టు చేస్తున్నారని , రీసెంట్ గా ముంబై లో అల్లు అర్జున్ ప్రశాంత్ కిషోర్ వంటి వారితో కూడా చర్చలు జరిపారని , ఇలా ఒక్కటా రెండా ఎన్నో రకాల వార్తలు ప్రచారం అయ్యాయి. దీనిపై ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా స్పందించిన అల్లు అర్జున్ టీం , అందులో ఎలాంటి నిజం లేదని చెప్పుకొచ్చారు. ఇక లేటెస్ట్ గా అల్లు అర్జున్ వ్యక్తిగత మ్యానేజర్ శరత్ చంద్ర కూడా ఈ అంశంపై మరోసారి స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. అది పూర్తిగా ఫేక్ న్యూస్ అంటూ తేల్చి చెప్పారు.
ఆయన మాట్లాడుతూ ‘అల్లు అర్జున్ ప్రస్తుత ఫోకస్ మొత్తం సినిమాల మీదనే ఉంది. ఇండియా లో మోస్ట్ బిజీ గా ఉండే హీరోల్లో ఆయన ఒకరు. ఎంతో గొప్ప స్థాయిలో ఉన్నారు , ఇలాంటి పీక్ సినిమా కెరీర్ ని వదిలి ఆయనేందుకు రాజకీయాల్లోకి వస్తారు?, అంత అవసరం ఏముంది? , ఈమధ్య విచిత్రంగా కొన్ని వార్తలు కూడా చూశాను. చిరంజీవి గారు రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారని , ఆయనతో పాటు అల్లు అర్జున్ కూడా ఒక కొత్త పార్టీ తో రాబోతున్నారని పుకార్లు పుట్టించారు. అది చూసిన తర్వాత నాకు నవ్వొచ్చింది. ఇలాంటి కథనాలు క్రియేట్ చేసేవాళ్లకు ఎక్కడి నుండి ఇలాంటి ఆలోచనలు వస్తాయో అర్థం అవ్వడం లేదు. సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు’ అంటూ స్పష్టం చేశారు శరత్ చంద్ర. కనీసం ఇప్పటి నుండి అయినా ఈ ఊహాగానాలకు చెక్ పడుతుందో లేదో చూడాలి.
ఇకపోతే అల్లు అర్జున్ ప్రస్తుతం ‘రాకా’ మూవీ షూటింగ్ తో ఫుల్ బిజీ గా ఉన్నారు. ముంబై లోనే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రధానంగా జరుగుతూ వస్తోంది . ఈ ఏడాది డిసెంబర్ లోపు షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చెయ్యాలనే టార్గెట్ పెట్టుకున్నారు. ఈ చిత్రం తర్వాత వెంటనే ఆయన లోకేష్ కనకరాజ్ తో ఒక సినిమా చేయబోతున్నారు. రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన కాన్సెప్ట్ వీడియో ని కూడా ముంబై లో షూట్ చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ఫోకస్ ఈ రెండు సినిమాల పైనే ఉంది. ఆ తర్వాత ఆయన మలయాళం టాప్ డైరెక్టర్ బసిల్ జోసెఫ్ తో ఒక సినిమా చేయనున్నారు.








