అగ్ర కథానాయకుడు, నందమూరి బాలకృష్ణ తన సుదీర్ఘ కెరీర్లో ఎన్నో సినిమాలు చేశాడు. ఫ్యామిలీ, ఫ్యాక్షన్, యాక్షన్ చిత్రాలతో పాటు చారిత్రక, పౌరానిక సినిమాల్లో నటించారు. అవన్నీ ఒకెత్తయితే ‘ఆదిత్య 369’ మరో ఎత్తు. మూడు దశాబ్దాల క్రితం వచ్చిన ఈ సైన్ ఫిక్షన్ చిత్రం బాలయ్య కెరీర్లో ఓ మైలురాయి. టైమ్ మెషీన్ నేపథ్యంలో సింగీతం శ్రీనివాస రావు తెరకెక్కించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను అబ్బుర పరిచింది. దీనికి సీక్వెల్ తీయాలని బాలకృష్ణ చాలా ఏళ్ల నుంచి కోరుకుంటున్నారు. మరో ‘ఆదిత్య 369’ చూడాలని బాలయ్య ఫ్యాన్స్ కూడా ఉబలాటపడుతున్నారు.
బాలయ్య ఆశ, అభిమానుల కోరిక నెరవేరనుంది. ఆదిత్య 369 సీక్వెల్పై బాలకృష్ణ దృష్టి పెట్టాడు. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో కూడా సీక్వెల్ త్వరలో వస్తుందని చెప్పిన బాలయ్య దీనికి ‘ఆదిత్య 999’ అనే టైటిల్ ఖరారు చేశారట. ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్లో ఓ భారీ చిత్రం చేస్తున్నాడు బాలకృష్ణ. లాక్డౌన్కు ముందు ఐదు రోజుల పాటు జరిగిన షూటింగ్లో ఓ ఫైట్ను చిత్రీకరించారు. ఈ సినిమాకు ‘మోనార్క్’ అనే టైటిల్ను చిత్ర బృందం పరిశీలిస్తున్నట్టు సమాచారం.
ఈ మూవీ షూటింగ్ పూర్తయిన వెంటనే… ‘ఆదిత్య 999’ను పట్టాలెక్కించాలని బాలయ్య ప్లాన్ చేస్తున్నాట. దీన్ని కూడా సింగీతం శ్రీనివాసరావే తెరకెక్కిస్తారన్న ప్రచారం జరుగుతోంది. స్క్రిప్ట్ కూడా సిద్ధం చేశారట. అయితే, ఆయన వయసు ఇప్పుడు 88 ఏళ్లు. సినిమాలకు దూరమై చాలా కాలమైంది. చివరగా 2013లో ‘వెల్కమ్ ఒబామా’ అనే టైటిల్తో ఓ మరాఠీ మూవీని రీమేక్ చేశారు. మరి, బాలయ్య భారీ స్థాయిలో రూపొందించాలని ప్లాన్ చేస్తున్న ఈ చిత్రాన్ని అంత పెద్ద వయసులో సింగీతమే డైరెక్ట్ చేస్తారా? లేక వేరే వాళ్లు మెగాఫోన్ పట్టుకుంటారా? చూడాలి.