కరోనా దెబ్బకు ఏప్రిల్ లో మూతపడిన థియేటర్లు.. గతవారమే తెరుచుకున్నాయి. ఇష్క్, తిమ్మరుసు చిత్రాలు రిలీజ్ కావడంతో.. ఫలితం కోసం టాలీవుడ్ మొత్తం ఆసక్తిగా ఎదురు చూసింది. పలు చోట్ల ఆడియన్స్ సందడి కనిపించడంతో.. మిగిలిన నిర్మాతలకు ధైర్యం వచ్చింది. పైగా.. థర్డ్ వేవ్ హెచ్చరికలు కూడా బలపడుతున్నాయి. దీంతో.. ఈ గ్యాప్ లోనే తమ సినిమాలను వదలాలని చిన్న నిర్మాతలు తొందపడుతున్నారు. ఈ కారణంగానే వచ్చే శుక్రవారం ఏకంగా 7 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.
ఇవన్నీ చిన్న సినిమాలే. ఎస్.ఆర్. కల్యాణ మండపం, మ్యాడ్, క్షీర సాగర మధనం, మెరిసే మెరిసే, ముగ్గురు మొనగాళ్లు, రావణలంక, ఇప్పుడు కాక ఇంకెప్పుడు? ఈ జాబితాలో ఉన్నాయి. ఇందులో ఎస్.ఆర్. కల్యాణ మండపం సినిమాపై మాత్రమే కాస్త హైప్ ఉంది. జనాల్లో ఆ సినిమా గురించి కాస్త ప్రచారం సాగింది. మిగిలిన వాటిలో దేనికీ సరైన ప్రచారం రాలేదు.
అయితే.. ఈ సినిమాలకు తెలంగాణలోనే మెరుగైన అవకాశాలు ఉన్నాయి. ఏపీలో సెకండ్ వేవ్ నుంచి అమల్లో ఉన్న ఆంక్షలన్నీ.. ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. అంతేకాదు.. థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో జనాలకు సరికొత్త ఆదేశాలు కూడా జారీచేసింది ఏపీ. దీంతో.. ఏపీలో సినిమాలకు కష్టకాలమే.
ఆంధ్రప్రదేశ్ లోని థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ అమల్లో ఉంది. అంతేకాదు.. నైట్ షోలు కూడా లేవు. ఇక, వకీల్ సాబ్ సమయంలో హడావిడిగా టికెట్ రేట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న సర్కారు.. ఆ తర్వాత ఏమీ మాట్లాడలేదు. ఇలాంటి కారణాలతో సీ సెంటర్లలో థియేటర్లు తెరుకోవట్లేదు. బీ సెంటర్లు కూడా చాలా వరకు డౌటే. అసలే.. 50 శాతం ఆక్యుపెన్సీ, పైగా నైట్ షోలు లేకపోవడం వంటి కారణాలతో థియేటర్లు ఓపెన్ చేసుకొని ఏం చేయాలి? అనే ఆలోచనలో ఉన్నారు ఎగ్జిబిటర్లు.
అంతేకాకుండా.. థర్డ్ వేవ్ నేపథ్యంలో ఈ నెల 6 నుంచి ఏపీలో థియేటర్లను పూర్తిగా మూసేస్తారనే ప్రచారం కూడా సాగుతోంది. అదే జరిగితే.. తెలంగాణ థియేటర్లు మాత్రమే దిక్కవుతాయి. తెలంగాణలో ఇప్పటి వరకు ఇబ్బంది లేదు. థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీ ఉంది. థియేటర్లు కూడా దాదాపుగా అన్నీ తెరుచుకున్నాయి. కాబట్టి.. ఈ రాష్ట్రంలో ఇబ్బంది లేదు. మరి, ఈ 7 సినిమాల్లో ఎన్ని హిట్ కొడతాయి? మరెన్ని ఫట్ మంటాయి? ఫైనల్ గా కలెక్షన్ సంగతి ఏంటీ? అన్నది చూడాలి.