Trancefar Time: తెలంగాణలో ఉపాధ్యాయులకు ప్రభుత్వం శుభ వార్త చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ఎదురు చూస్తున్న పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. వరుసగా ఎన్నికలు రావడంతో ఈ ప్రక్రియ ఆలస్యమైంది. జూన్ 6న ఎన్నికల కోడ్ ముగియడంతో ప్రభుత్వం టీచర్ల ప్రమోషన్, ట్రాన్స్ఫర్స్పై దృష్టిపెట్టింది. నేడో రేపో ట్రాన్స్ఫర్స్ షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది.
ఏళ్లుగా ఎదురు చూపు..
తెలంగాణ వ్యాప్తంగా వేల మంది టీచర్లు ప్రమోషన్లు, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల.. ఈ ఏడాది లోక్సభ ఎన్నికలు రావడంతో ప్రక్రియ ఆగిపోయింది. తెలంగాణలో విద్యాశాఖ బాధ్యతలు సీఎం రేవంత్రెడ్డి చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
వేల మందికి ప్రమోషన్లు..
బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ పూర్తయితే తెలంగాణ వ్యాప్తంగా 10,449 మందికి ఎస్ఏలుగా, 778 మందికి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా, 6 వేల మందికి ఎస్జీటీలు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందుతారు. జూన్ 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెలలో ప్రమోషన్లు, బదిలీలు పూర్తి చేయాలన్న ఆలోచనలో సీఎం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఒకటి రెండు రోజుల్లో షెడ్యూల్ విడదులకు విద్యాశాఖ కసరత్తు చేస్తోందని సమాచారం.
ఆగిన చోటు నుంచే మొదలు..
గతేడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో విద్యాశాఖ పదోన్నతుల, బదిలీల ప్రక్రియ మొదలు పెట్టింది. అయితే కోర్టు కేసులతో అది ఆగిపోయింది. ఇప్పుడు రేవంత్ సర్కార్ ఆగిన చోట నుంచి మళ్లీ ప్రక్రియ మొదలు పెట్టనుంది. జోన్ – 1 లో కొంత ప్రక్రియ పూర్తి కావడం వల్ల ఒక షెడ్యూల్, మల్టీ జోన్ – 2 కి సంబంధించి మరో షెడ్యూల్ జారీ చేసే అవకాశం ఉంది.