Crime News : ప్రేమించుకున్నారు.. ఊరితో యుద్ధం చేశారు.. చివరికి ఇలా మిగిలారు

వీరి వివాహానికి అమ్మాయి తరఫున వాళ్లు ఒప్పుకోలేదు. అంతేకాదు ఊరు మొత్తం కూడా వీరి ప్రేమకు వ్యతిరేకంగా నిలిచింది.. దీంతో వారు తీసుకున్న నిర్ణయం సంచలనానికి దారి తీసింది.

Written By: NARESH, Updated On : April 29, 2024 9:41 pm
Follow us on

Crime News : వారి వయసు మహా అయితే పాతికేళ్లలోపు ఉంటుంది. ఇద్దరూ ప్రేమలో పడ్డారు. కొంతకాలం ప్రేమించుకున్నారు. ఆ తర్వాత కలిసి జీవిద్దామని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు చెప్పారు. అయితే వీరి వివాహానికి అమ్మాయి తరఫున వాళ్లు ఒప్పుకోలేదు. అంతేకాదు ఊరు మొత్తం కూడా వీరి ప్రేమకు వ్యతిరేకంగా నిలిచింది.. దీంతో వారు తీసుకున్న నిర్ణయం సంచలనానికి దారి తీసింది.

సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (ఎస్) పరిధిలోని తుమ్మల పెన్ పహాడ్ గ్రామం ఉంది. ఈ గ్రామానికి చెందిన గుండ గాని సంజయ్, చల్లగుండ్ల నాగజ్యోతి సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. సంజయ్ సూర్యాపేటలోని ఓ వాటర్ ప్లాంట్ లో మెకానిక్ గా పనిచేస్తున్నాడు. నాగజ్యోతి బీ- ఫార్మసీ పూర్తి చేసింది. హైదరాబాదులో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేసుకుంటూ ఎం – ఫార్మసీ చదువుతోంది. సంజయ్, నాగజ్యోతి వ్యవహారం ఆ ఊరిలో కొంతమందికి తెలిసింది. ఈ విషయాన్ని వారు నాగజ్యోతి తండ్రికి చెప్పారు. సంజయ్ పై లేనిపోని విషయాలు చెప్పడంతో అతడు తీవ్రంగా కోపం పెంచుకున్నాడు. సంజయ్ ని తీవ్రంగా మందలించాడు. ఉగాది పండుగ అనంతరం నాగజ్యోతిని ఉద్యోగం మాన్పించి తన ఇంటి దగ్గర ఉంచుకున్నాడు. తమ ప్రేమ వ్యవహారానికి సంబంధించి ఊళ్లో వాళ్ళు తప్పుగా మాట్లాడుతుండడంతో సంజయ్, నాగజ్యోతి తట్టుకోలేకపోయారు. తమ ఇంట్లో నుంచి బయటికి వచ్చి గ్రామ శివారులోని ఓ పొలం వద్ద శనివారం సాయంత్రం పురుగుల మందు తాగారు. నాగజ్యోతి ఇంట్లో కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది. బంధువుల ఇంట్లో, తెలిసిన వాళ్ళ ఇంట్లో వాకబు చేయగా.. తమ వద్దకు రాలేదని వారు సమాధానం చెప్పారు. ఇక సంజయ్ ఇంట్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఆదివారం తెల్లవారుజామున ఆ గ్రామానికి చెందిన కొంతమంది పొలం పనులకు వెళుతుండగా సంజయ్, నాగజ్యోతి విగత జీవులుగా పడి ఉన్నారు.

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆసుపత్రి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను ఇరువురి కుటుంబ సభ్యులకు అప్పగించారు.. అయితే తన ప్రేమకు అడ్డంకిగా మారి.. లేనిపోని ప్రచారాలు చేసిన గ్రామానికి చెందిన బెల్లంకొండ నారాయణ, లతా రెడ్డి, సల్లగుండ్ల అజయ్, మల్లయ్య, శ్రీను, ఉప్పలయ్య, నాగజ్యోతి చల్లగుండ్ల శ్రీను పై చర్యలు తీసుకోవాలని సంజయ్, నాగజ్యోతి తమ సూసైడ్ నోట్ లో రాశారు. సంజయ్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఏడుగురిపై కేసు నమోదు చేశారు.