Karimnagar PMJ Jewellery Theft: లోని పీఎంజే జ్యువెలరీ షాప్ లో జరిగిన దొంగతనంలో పోలీసులు అనేక బృందాలుగా విడిపోయి ఆధారాలు సేకరించే పనిలోపడ్డారు. ఇప్పటికే దొంగల ముఖచిత్రాలను మీడియాకు విడుదల చేశారు. వారి ఆచూకీ చెప్పిన వారికి లక్ష రూపాయల బహుమతి ఇస్తామని ప్రకటించారు.. ఇది ఇలా ఉండగానే ఈ వ్యవహారంలో రోజురోజుకు కొత్త కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి.
కరీంనగర్ పి ఎం జె జ్యూవెలరీ షాప్ దోపిడీ కేసులో ఇప్పటివరకు పోలీసులు ఐదుగురు వ్యక్తులు నిందితులు ఉన్నారని గుర్తించారు. ఈ వ్యవహారంలో ఉన్నది ఐదుగురు మాత్రమే కాదని.. ఏకంగా ఆరుగురు ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. కరీంనగర్లో ప్రవేశించడానికి వీరు ధర్మపురి ప్రాంతంలో బస చేశారు. విజయలక్ష్మి ప్రైవేట్ లాడ్జిలో మూడు రోజులపాటు ఉన్నారు. ముందు నలుగురు వ్యక్తులు వచ్చారు. ఆ తర్వాత ఇద్దరు వేర్వేరుగా అందులోకి ప్రవేశించారు.
మొదటి వచ్చిన వ్యక్తులు పల్సర్ బైక్ ద్వారా లాడ్జి లోకి చేరుకున్నారు. వారు ఇచ్చిన ఆధారాలను పరిశీలిస్తే అవన్నీ కూడా ఫేక్ అని తెలుస్తోంది. ఈ దొంగతనం జరిగిన తర్వాత పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో వారు విజయలక్ష్మి లాడ్జిలో ఉన్నట్టు తెలిసింది. సీసీ కెమెరాలను పోలీసులు విస్తృతంగా పరిశీలిస్తున్నారు. మూడు రోజులపాటు ఆ దొంగలు ఆ లాడ్జిలో ఉన్నారని పోలీసులకు తెలిసింది. అక్కడ అనేక ఆధారాలు సేకరించిన పోలీసులు.. కేసు దర్యాప్తులో వేగాన్ని పెంచినట్లు సమాచారం.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆ మధ్య రాయపర్తి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇదే తరహాలో దొంగతనం జరిగింది. కాకపోతే దుండగులు ఎటువంటి ఆధారాలు వదలకుండా దొంగతనం చేశారు. రాత్రి సమయం కావడంతో సిసి కెమెరాలలో తమ దృశ్యాలు రికార్డు కాకుండా జాగ్రత్తపడ్డారు. ఖాతాదారుల బంగారాన్ని దొంగలు తస్కరించిన నేపథ్యంలో.. పోలీసులు రంగంలోకి దిగారు. బృందాలుగా విడిపోయి దర్యాప్తు మొదలు పెట్టారు. చివరికి ఒక్క ఆధారం కూడా పోలీసులకు లభించలేదు.
బ్యాంకు పరిసర ప్రాంతాలలో పోలీసులకు ఒక సిగరెట్ అట్టముక్క దొరికింది. ఆ అట్టముక్క మీద ఉత్తర ప్రదేశ్ అడ్రస్ ఉంది. దీంతో తెలంగాణ పోలీసులు ఉత్తరప్రదేశ్ పోలీసులను సంప్రదించారు. జరిగిన విషయం మొత్తం చెప్పారు. దీంతో అక్కడ ఉన్న దొంగల ముఠాల వివరాలను తెలంగాణ పోలీసులకు ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు అందించారు. ఈ క్రమంలో అక్కడి పోలీసుల సహకారంతో తెలంగాణ పోలీసులు దర్యాప్తు చేయగా.. ఈ దొంగతనానికి ఉత్తర ప్రదేశ్ దొంగల ముఠా పాల్పడినట్టు తేలింది. వారి దగ్గర నుంచి బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కరీంనగర్లో జరిగిన దొంగతనం కూడా ఇదే తరహాలో ఉండి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ధర్మపురి ప్రాంతంలో విజయలక్ష్మి లాడ్జి పరిసర ప్రాంతాల్లో అనేక కీలక వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా పూర్తిస్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ కరీంనగర్ జిల్లాలో జరిగిన దొంగతనం.. తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే కొద్ది రోజుల్లోనే దొంగలను పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.