East Godavari District: నాలుగో సంతానంగా ఆడబిడ్డ.. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా?

వేమగిరి గణపతి నగర్ కు చెందిన ఓ తాపీ మేస్త్రి కుటుంబంతో జీవిస్తున్నాడు. ఆయనకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ప్రస్తుతం వారు పాఠశాలలో చదువుకుంటున్నారు.

Written By: Dharma, Updated On : April 16, 2024 12:04 pm

East Godavari District

Follow us on

East Godavari District: మాతృత్వం మహిళలకు అనిర్వచనీయమైన అనుభూతి. ఎలాంటి మహిళలైనా మాతృత్వాన్ని కోరుకుంటారు. కానీ అలాంటి మాతృత్వాన్ని అవహేళన చేసింది ఓ మహిళ. నాలుగో సారి కూడా ఆడ శిశువు జన్మించడంతో తుప్పల్లో పడేసింది. అమ్మతనాన్ని అమ్మేసింది. మాతృత్వాన్ని చంపేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరిలో ఈ ఘటన వెలుగు చూసింది.

వేమగిరి గణపతి నగర్ కు చెందిన ఓ తాపీ మేస్త్రి కుటుంబంతో జీవిస్తున్నాడు. ఆయనకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ప్రస్తుతం వారు పాఠశాలలో చదువుకుంటున్నారు. అయితే ఆయన భార్యకు మగసంతానంపై మమకారం ఉండడంతో.. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోలేదు. కానీ చేయించుకున్నట్లు భర్తను నమ్మించింది. మరోసారి గర్భం దాల్చింది. మగ పిల్లాడు పుడితే అందరికీ చెబుదామని.. ఆడపిల్ల పుడితే మాయం చేద్దామన్న ఆలోచనకు వచ్చింది. గర్భం దాల్చిన విషయం గోప్యంగా ఉంచింది. కడుపు పెరగడంపై భర్త ప్రశ్నించగా.. రకరకాల కారణాలు చెప్పి నమ్మించింది. గత ఎనిమిది నెలలుగా ఇదే మాదిరిగా నమ్మిస్తూ వచ్చింది.

రెండు రోజుల కిందట పురిటి నొప్పులు రావడంతో.. భర్తను, పిల్లలను చర్చికి పంపింది. తనకు తానే పురుడు పోసుకుంది. కత్తిపీటతో పేగును కత్తిరించింది. ఆడపిల్ల పుట్టడంతో నైటీలో పసికొందును చుట్టి 20 అడుగుల ఎత్తు నుంచి తుప్పల్లోకి విసిరింది. శిశువు ఏడుపులు వినిపించడంతో చుట్టుపక్కల వారు వచ్చి చూడగా.. చిన్నారి కనిపించింది. అయితే చిన్నారికి చుట్టిన నైటీ తన భార్యదని ఆయన గుర్తించాడు. ఇంటికి వెళ్లి భార్యను నిలదీశాడు. మగ బిడ్డ పై మమకారంతో ఈ పని చేశానంటూ ఆమె కన్నీరు మున్నీరైంది. హుటాహుటిన తల్లీ బిడ్డలను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు క్షేమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. స్థానికంగా ఈ ఘటన సంచలనం రేకెత్తించింది.