Telangana Congress: నామినేషన్లు దగ్గరకొస్తున్న అభ్యర్థులను తేల్చని కాంగ్రెస్.. ఇదేం పితలాటకం!

కరీంనగర్‌ ఎంపీ టికెట్‌ కోసం హుస్నాబాద్‌ మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, మరో మాజీ ఎమ్మెల్యే వెలిచాల జగపతిరావు తనయుడు వెలిచాల రాజేందర్‌రావు పోటీ పడుతున్నారు.

Written By: Raj Shekar, Updated On : April 16, 2024 11:52 am

Telangana Congress

Follow us on

Telangana Congress: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌ మరో రెండు రోజుల్లో విడుదల కానుంది. ఏప్రిల్‌ 18 నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలవుతుంది. తొలి రెండు రోజుల్లోనే మంచి ముహూర్తాలు ఉండడంతో అభ్యర్థులు నామినేషన్ల దాఖలుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఇప్పటికే 17 స్థానాలకు టికెట్లు ప్రకటించింది. అధికార కాంగ్రెస్‌ మాత్రం 14 స్థానాలకే అభ్యర్థులను ఖరారు చేసింది. కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్‌ టికెట్‌పై ఇప్పటికీ తేల్చడం లేదు. ఈ మూడు నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎవరో తెలియకపోవడంతో ప్రచారం కూడా మొదలు పెట్టలేదు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ 17 స్థానాల్లో ప్రచారం చేస్తుండగా, కాంగ్రెస్‌ 14 స్థానాల్లో మాత్రమే ప్రచారం చేస్తోంది.

కరీంనగర్‌పై అందరి దృష్టి..
ఉత్తర తెలంగాణలో కీలకమైన, ఉద్యమాల పురిటిగడ్డగా గుర్తింపు ఉన్న కరీంనగర్‌ ఎంపీ టికెట్‌పై అధికార కాంగ్రెస్‌ మీనమేషాలు లెక్కిస్తోంది. మూడు స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్‌ అగ్రనేతలు ఇప్పటికే నాలుగైదుసార్లు సమావేశమయ్యారు. కానీ, ఇప్పటికీ తేల్చలేకపోయారు. ఏప్రిల్‌ 14న హైదరాబాద్‌కు వచ్చిన కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ.వేణుగోపాల్‌తో సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీతో చర్చించారు.

ఇద్దరి మధ్యే పోటీ…
కరీంనగర్‌ ఎంపీ టికెట్‌ కోసం హుస్నాబాద్‌ మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, మరో మాజీ ఎమ్మెల్యే వెలిచాల జగపతిరావు తనయుడు వెలిచాల రాజేందర్‌రావు పోటీ పడుతున్నారు. అయితే ఇద్దరూ అగ్రకులానికి చెందినవారే ఒకరు రెడ్డి సామాజికవర్గం నేత కాగా, మరోకరు వెలమ సామాజికవర్గం నేత. దీంతో ఇద్దరిలో ఎవరికి టికెట్‌ ఇవ్వాలో తేల్చుకోలేకపోతున్నారు. మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి బీసీని బరిలో దించాలని భావిస్తున్నారు. అగ్రవర్ణాలకు టికెట్‌ ఇస్తే బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ మధ్య ఓట్లు చీలిపోతాయని, బీజేపీ నుంచి పోటీలో ఉన్న బీసీ అభ్యర్థి బండి సంజయ్‌ లాభ పడతారని అంచనా వేస్తున్నారు. అయితే, ఇక్కడ బలమైన బీసీ నేత లేకపోవడం ఆ పార్టీకి మైనస్‌గా మారింది. స్థానికేతరుడికి టికెట్‌ ఇస్తే.. తప్పుడు సంకేతం వెళ్తుందని కాంగ్రెస్‌ అధిష్టానం భావిస్తోంది.

‘వెలిచాల’వైపే మొగ్గు..
వెలమ సామాజిక వర్గానికి చెందిన వెలిచాల రాజేందర్‌రావుకే ఎంపీ టికెట్‌ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్‌ కూడా రాజేందర్‌రావుకే మద్దతు ఇస్తున్నారు. మొదట ప్రవీణ్‌రెడ్డికి మద్దతు ఇచ్చారు. అయితే ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉండడంతో ఆయన పోటీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో రాజేందర్‌రావునే బరిలో దించాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. ఈమేరకు ఒకటి రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. టికెట్‌ ఖరారు కాగానే పెద్ద ఎత్తును ప్రచారం నిర్వహించాలని రాజేందర్‌రావు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నారు.

ఖమ్మంలో ఇలా..
ఖమ్మం నుంచి కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంకగాంధీని ఖమ్మం నుంచి పోటీ చే యాలని సీఎం ఇంతకుముందే కోరారు. అయితే ప్రియాంక పోటీ చేసే అవకాశాలు లేవని కేసీ.వేణుగోపాల్‌ స్పష్టం చేశారు. ఇక్కడి నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సోదరుడు ప్రసాద్‌రెడ్డి టికెట్‌ ఆశిస్తున్నారు.