Cyber Crime: సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన ఎమ్మెల్యే.. పోలీసుల విచారణలో కీలక విషయాలు

సైబర్ మోసగాడి వలలో పడి ఓ ఎమ్మెల్యే నిండా మునిగాడు. తనను తాను ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఆ మోసగాడు పరిచయం చేసుకున్నాడు. అతడు చెప్పిన మాటలను ఆ ఎమ్మెల్యే నమ్మాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : May 20, 2024 12:13 pm

Cyber Criminals cheats MLA

Follow us on

Cyber Crime: సైబర్ నేరగాళ్ల బారినపడి ఇప్పటివరకు సామాన్యులే నిండా మునిగారు. ఇందులో విద్యావంతులు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు మీరు చదవబోయే కథనంలో ఒక ట్విస్ట్ ఉంది. అంతకుమించిన ఆశ్చర్యం కూడా ఉంది. మోసగాళ్లు ఇంతకు తెగిస్తారా అనే విస్మయం కూడా ఉంది. ఇంతకీ ఏం జరిగిందంటే..

సైబర్ మోసగాడి వలలో పడి ఓ ఎమ్మెల్యే నిండా మునిగాడు. తనను తాను ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఆ మోసగాడు పరిచయం చేసుకున్నాడు. అతడు చెప్పిన మాటలను ఆ ఎమ్మెల్యే నమ్మాడు. పైగా ముఖ్యమంత్రి ఒక కొత్త రుణ పథకాన్ని ప్రారంభించబోతున్నారని ఆ సైబర్ మోసగాడు మాయమాటలు చెప్పాడు. అతడు చెప్పిన మాటలను విశ్వసించిన ఎమ్మెల్యే రెండవ మాటకు తావు లేకుండా 3.60 లక్షలను ఆ మోసగాడి ఖాతాలో వేశాడు. డబ్బు ఖాతాలో జమ అయిన దగ్గర నుంచి ఆ మోసగాడు ఎమ్మెల్యేకు ఫోన్ చేయడం మానేశాడు. దీంతో అనుమానం వచ్చి ఎమ్మెల్యే తన పీఏ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయించాడు. వారు ఎంక్వయిరీ చేయగా.. దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.

సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతుండడంతో.. డబ్బులు సులభంగా సంపాదించేందుకు సైబర్ మోసగాళ్లు కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసులు ఎన్ని రకాలుగా అవగాహన కల్పించినప్పటికీ ఆ మోసగాళ్ల ఆగడాలకు చెక్ పడటం లేదు. కస్టమ్స్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేస్తున్నామని, ఉచితంగా బహుమతులు వచ్చాయని, డిస్కౌంట్ ప్రకటించామని, తక్కువ డబ్బులతో ఎక్కువ సంపాదించుకోవచ్చని.. ఇలా రకరకాల మాటలతో సైబర్ మోసగాళ్లు ప్రజలకు వల వేస్తున్నారు. వారి మాయమాటలకు సామాన్యులే కాదు, విఐపి లు కూడా మోసపోతున్నారు.

ఇంకా ఇటీవల ఒక ఎమ్మెల్యేకు ఓ సైబర్ మోసగాడు ఫోన్ చేశాడు. తనను తాను ఆర్థిక ముఖ్య కార్యదర్శిగా చెప్పుకున్నాడు. ఎమ్మెల్యేకు రోజూ ఫోన్ చేసి పరిచయం పెంచుకున్నాడు. ముఖ్యమంత్రి తొందరలోనే కొత్త రుణ పథకం ప్రారంభించబోతున్నారని వివరించాడు. ఆ పథకం ద్వారా వందల మందికి లక్షల లో రుణాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నారని వెల్లడించాడు.. మీ కోటా కింద 100 మందికి రుణాలు అందే విధంగా చూస్తానని ఎమ్మెల్యేకు సైబర్ మోసగాడు అర చేతిలో స్వర్గం చూపించాడు. ఈ రుణం మంజూరు కావాలంటే ఒక్కో లబ్ధిదారు 3600 చెల్లించాలని.. అప్పుడే పని జరుగుతుందని ఎమ్మెల్యేకు చెప్పాడు. ఆ మాటలు మొత్తం నమ్మిన ఎమ్మెల్యే ఆ సైబర్ మోసగాడి ఖాతాలో 3.60 లక్షల జమ చేశాడు. అయితే అప్పటినుంచి ఆ మోసగాడు ఫోన్ చేయకపోవడంతో ఎమ్మెల్యేకు అనుమానం వచ్చింది. మోసపోయానని భావించి, తన పీఏ ద్వారా సైబర్ సెల్ పోలీసులకు ఫిర్యాదు చేయించాడు. వారు పూర్తి వివరాలతో విచారణ జరపగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది..

ఎమ్మెల్యేను మోసం చేసిన ఆ నిందితుడి పేరు తోట బాలాజీ నాయుడు అలియాస్ మల్లారెడ్డి అలియాస్ అనిల్ కుమార్. పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. గతంలో ఈ నిందితుడి పై రెండు రాష్ట్రాలలో కలిపి 37 కేసులు ఉన్నాయి. 2008లో రామగుండం ఎన్టీపీఎస్ లో సదరు నిందితుడు ఏఈ గా పనిచేశాడు. 2009లో ఓ ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి నుంచి డబ్బులు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.