Crime News : స్నేహం నటిస్తూ అత్యాచారం.. ప్రేమ పేరుతో లైంగిక దాడి… పెళ్లి మాటున పైశాచికత్వం.. దేవుడా.. ఆడపిల్లలపై ఏంటీ అఘాయిత్యాలు

తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్లలపై జరుగుతున్న దారుణాలు ఆందోళన కలిగిస్తున్నాయి.. స్నేహం, ప్రేమ, పెళ్లి ముసుగులో చేస్తున్న లైంగిక దాడులు సమాజంలో భయాన్ని కలుగజేస్తున్నాయి.

Written By: Anabothula Bhaskar, Updated On : October 6, 2024 6:39 pm
Follow us on

Crime News : గుండెల నిండా ప్రేమిస్తున్నానని.. కంటికి రెప్పలా చూసుకుంటానని.. పెళ్లి చేసుకుంటానని.. ఇలా రకరకాల పేర్లతో నమ్మించి కామాంధులు ఆడపిల్లలను వంచిస్తున్నారు. దీంతో అభం శుభం తెలియని అమ్మాయిలు బాధితులుగా మారుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ఈ తరహా సంఘటనలు తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి..

ప్రేమిస్తున్నానని చెప్పి..

మల్కాజ్ గిరి జిల్లాలోని అల్వాల్ ప్రాంతానికి చెందిన సాయికుమార్ నాగోల్ లో ఓ హోటల్ లో బౌన్సర్ గా పని చేస్తున్నాడు. అక్కడ పనిచేస్తున్న ఓ యువతితో అతడికి పరిచయం ఏర్పడింది.. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఆమె ఒప్పుకుంది. ఇదే క్రమంలో ఎల్బీనగర్ ప్రాంతంలోని హోటల్ కు తీసుకెళ్లాడు. ఆమెపై పలుసార్లు లైంగికంగా దాడికి పాల్పడ్డాడు. ఇదే సమయంలో పెళ్లి చేసుకోవాలని ఆమె బలవంతం చేస్తే.. గత ఏప్రిల్ లో వివాహం నిశ్చయించుకున్నాడు. నెలలు గడుస్తున్నప్పటికీ పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాలేదు. దీంతో ఆమె ఒత్తిడి తీసుకొస్తే దాడి చేసి ఇబ్బంది పెట్టాడు. దీంతో మోసపోయానని భావించిన ఆమె అతనిపై చర్యలు తీసుకోవాలని ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

బాలికలపై దారుణం

జనగామ జిల్లాలోని దేవరుప్పుల మండలానికి చెందిన 14 సంవత్సరాల బాలిక, మల్కాజ్ గిరి ప్రాంతానికి చెందిన 15 సంవత్సరాల బాలిక ఐఎస్ డివిజన్లో ఉన్న పునరావాస కేంద్రంలో ఆశ్రయం పొందుతున్నారు. గత నెల 24న ఆ ప్రాంతం నుంచి బాలికలు ఇద్దరు పారిపోయి జనగామ వచ్చారు. బస్టాండ్ సమీపంలో ఓ పాన్ షాప్ నిర్వహించే వ్యక్తి వద్ద ఫోన్ తీసుకొని.. తమకు పరిచయం ఉన్న మరో యువకుడికి ఫోన్ చేసి.. తాము ఉన్న ప్రాంతం, ఇతర వివరాలు వెల్లడించారు. బస్టాండ్ ప్రాంతానికి చేరుకున్న ఆ యువకుడు జనగామ జిల్లాకు చెందిన బాలికను వెంట తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇక బస్టాండ్ దగ్గర ఉన్న మరో బాలికకు షెల్టర్ ఇస్తానని చెప్పిన పాన్ షాప్ నిర్వాహకుడు, అతని ముగ్గురు స్నేహితులు ఆమెపై లైంగికంగా దాడికి పాల్పడ్డారు. అయితే ఆ బాలికలు మరుసటి రోజు బస్టాండ్ వద్ద ఒంటరిగా తిరుగుతున్న నేపథ్యంలో జనగామ అర్బన్ పోలీసులు గుర్తించారు. వారిని వివరాలు అడగడంతో అసలు విషయం చెప్పారు. ఆ బాలికలపై లైంగిక దాడికి పాల్పడిన వారిపై ఫోక్సో కేసు నమోదు చేశారు.

కారులో లాడ్జికి తీసుకెళ్లి..

ఉమ్మడి వరంగల్ జిల్లా భూపాలపల్లి జిల్లా కేంద్రంలో హనుమాన్ నగర్ ప్రాంతానికి చెందిన తాటి శివరాజ్ కుమార్ .. స్థానికంగా ఉన్న ఒక కాలేజీలో బీటెక్ చేస్తున్నాడు.. శివరాజ్ కు భూపాలపల్లి ప్రాంతానికి చెందిన పుట్టపాక శరత్ అనే స్నేహితుడు ఉన్నాడు. శరత్ కు వరంగల్ ప్రాంతంలోని ఓ కాలేజీలో చదువుతున్న యువతి పరిచయమైంది. కొద్ది రోజుల తర్వాత ప్రేమిస్తున్నానని శరత్ చెప్పడంతో ఆమె నిరాకరించింది. స్నేహితులుగా మాత్రమే ఉందని పేర్కొంది.. దీంతో శివరాజ్ కుమార్, అతని ఫ్రెండ్స్ వివేక్, మణి దీప్ కారులో ఆమె చదువుకుంటున్న కళాశాలకు వెళ్లారు. ఆమెకు మాయమాటలు చెప్పి బలవంతంగా కారులో తీసుకెళ్లారు. ఆమెను వరంగల్ బస్టాండ్ సమీపంలో ఉన్న లాడ్జికి తీసుకెళ్లి లైంగికంగా దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమె ఈ విషయాన్ని తన తల్లికి చెప్పడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.