Satya Nadella: అమెరికా ఐటీ మార్కెట్లో భారతీయ ఇంజనీర్లు, సీఈఓలు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. అమెరికన్ ఐటి కంపెనీలు వారికి చక్కని జీతాలు చెల్లిస్తున్నాయంటే వారి కంపెనీల ఎదుగుదలలో మన వారి శ్రమ ఎతుందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా అమెరికా దిగ్గజ ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల వేతన ప్యాకేజీ వెల్లడైంది. సీఎన్బీసీ నివేదిక ప్రకారం, జూన్ 30తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో నాదెళ్ల 79.1 మిలియన్ డాలర్లు (రూ. 6.5 బిలియన్ల కంటే ఎక్కువ) వేతనం అందుకోనున్నారు. ఇది అంతకుముందు సంవత్సరం నాదెళ్ల సంపాదించిన 48.5 మిలియన్ డాలర్ల కంటే కంటే ఇది 63శాతం ఎక్కువ. సత్య నాదెళ్ల ఆదాయంలో ఎక్కువ భాగం స్టాక్ గ్రాంట్ల ద్వారా వచ్చింది. విశేషమేమిటంటే, కంపెనీ వ్యాపార పరిస్థితుల దృష్ట్యా తన జీతంలో కోత విధించాలని నాదెళ్ల స్వయంగా కంపెనీని అభ్యర్థించారు.
నాదెళ్లపై కంపెనీకి చాలా నమ్మకం
సత్య నాదెళ్ల 2024కి అందుకోనున్న రివార్డ్కు సంబంధించి ముఖ్యమైన విషయాలను కంపెనీ తెలిపింది. కంపెనీ ఏం చెప్పిందంటే, “మేము సత్య నాదెళ్ల టార్గెట్ పెర్ఫార్మెన్స్ స్టాక్ రివార్డ్ను 50,000,000డాలర్లుగా సెట్ చేసాం, ఇది నాయకుడిగా అతని అసాధారణ సామర్థ్యాలు, బాధ్యతలకు బాగా సరిపోతుంది. క్లిష్ట పరిస్థితుల్లోనూ అనూహ్యంగా అద్భుతంగా రాణించారు.’’ అని పేర్కొంది. సత్య నాదెళ్ల వార్షిక సంపాదన 79.1 మిలియన్ డాలర్లు (6,65,03,05,740), 365 రోజుల ప్రాతిపదికన లెక్కిస్తే సత్య నాదెళ్ల రోజువారీ సంపాదన మన కరెన్సీలో రూ.18220015. అంటే దాదాపు రెండు కోట్లు.
20 నిమిషాల్లో 7 బిలియన్ డాలర్ల విలువైన డీల్
భారతీయ సంతతికి చెందిన సత్య నాదెళ్ల 2014లో ప్రపంచంలోని ప్రముఖ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. నాదెళ్ల బాధ్యతలు చేపట్టిన తర్వాత దాదాపు 40 ఏళ్ల కంపెనీలో వేగంగా మార్పులు చేశారని చెబుతున్నారు. ఫలితంగా నాదెళ్ల నాయకత్వంలో మైక్రోసాఫ్ట్ క్లౌడ్ కంప్యూటింగ్లో తన మార్కెట్ వాటాను రెట్టింపు చేసింది. సత్య నాదెళ్ల నాయకత్వంలో మైక్రోసాఫ్ట్ డెవలపర్స్ ప్లాట్ఫారమ్ గిట్హబ్ను 7.5 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. విశేషమేమిటంటే 20 నిమిషాల్లోనే నాదెళ్ల ఈ డీల్ కుదుర్చుకున్నారు. 2018లో ప్రపంచ ప్రఖ్యాత ఓపెన్ సోర్స్ కంపెనీ గిట్హబ్ను కొనుగోలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి కేవలం 20 నిమిషాల సమయం పట్టిందని న్యూయార్క్ టైమ్స్ నివేదిక పేర్కొంది.