UPI Payments: గుడ్ న్యూస్.. యూపీఐ చెల్లింపుల్లో ఆర్బీఐ కీలక మార్పులు.. ఏంటో తెలుసా..?

యూపీఐ చెల్లింపులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక మార్పులు తీసుకువచ్చింది. ఇందుకు కొత్త గా కొన్ని ప్రతిపాదనలు చేసింది. యూపీఐ ద్వారా పన్నుల చెల్లింపుల పరిమితిని రూ. లక్ష నుంచి రూ. 5 లక్షల వరకు పెంచేలా చూస్తున్నట్లు తెలిపింది.

Written By: Neelambaram, Updated On : August 9, 2024 2:16 pm

UPI Payments

Follow us on

UPI Payments: ప్రస్తుతం ఉన్న యూపీఐ చెల్లింపుల విధానంలో కొంత మార్పులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతిపాదించింది. ఆర్బీఐ మూడు రోజులుగా నిర్వహిస్తున్న ద్రవ్య పరపతి విధాన నిర్ణయాల సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ మీటింగ్ వివరాలను గురువారం సాయంత్రం వెల్లడించారు. కాగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న కీలక ప్రతిపాదనను ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. యూపీఐ లావాదేవీల విషయంలో ఈ కీలక మార్పు ఉండబోతున్నదని ఆయన చెప్పారు. యూపీఐ ద్వారా పనున చెల్లింపుల పరిమితిని పెంచాలని అనుకుంటున్నట్లు శక్తికాంత్ దాస్ ప్రకటించారు. యూపీఐ ద్వారా ఇప్పటి వరకు లక్ష వరకు పన్ను చెల్లించే అవకాశం ఉండేది. దీనిని రూ. 5 లక్షల వరకు పెంచుతున్నట్లు ఆయన ప్రకటించారు. దీని కారణంగా వ్యక్తిగత ఆదాయ పన్ను, ముందస్తు పన్నులు చెల్లించే వారు ఒకే లావాదేవీలో రూ. 5 లక్షల వరకు చెల్లించే అవకాశం ఏర్పడుతుంది. కాగా యూపీఐ చెల్లింపుల పరిమితిని సవరించడం ఇది మొదటిసారి మాత్రం కాదు. గతంలోనూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలా సవరణలు చేసింది. డిసెంబర్ 2023లో వైద్యఖర్చులు, విద్యాసంస్థలో ఫీజులను యూపీఐ ద్వారా చెల్లించే పరిమితిని రూ. 5 లక్షల వరకు పెంచింది. ఇక క్యాపిటల్ మార్కెట్లు, బీమా లాంటి వాటి పరిమితిని రూ. 2 లక్షల వరకు పెంచింది. మరోవైపు పబ్లిక్ ఇష్యూల్లో పెట్టుబడులు, రిటైల్ డైరెక్ట్ స్కీముల్లో ఒక్కో లావాదేవీకి యూపీఐ ద్వారా రూ. 5లక్షల వరకు చెల్లించేలా అవకాశం కల్పించింది.

రూ. లక్ష నుంచి రూ. 5లక్షల వరకు
అయితే ఇప్పటివరకు రూ. లక్ష వరకు మాత్రమే పన్నుల చెల్లింపునకు అవకాశం ఉండేది. దీంతో క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా ఈ పన్నులను చెల్లించేవారు. కొంత మంది బ్యాంకుకు వెళ్లి చేసేవారు. కార్డుల ద్వారా సీవీవీ, ఎక్స్పైరీ తేదీ తదితర వివరాలు నమోదు చేయాల్సి వచ్చేది. అనంతరం ఓటీపీతో ధ్రువీకరిస్తేనే చెల్లింపు ప్రక్రియ పూర్తయ్యేది. దీంతో కార్డుల నిబంధనల మేరకు కొంత అదనపు రుసుం వినియోగదారుడిపై పడేది. ఇక యూపీఐ చెల్లింపుల ప్రక్రియతో అలాంటి ఇబ్బందులేవీ ఉండవు. కేవలం పిన్ ఎంటర్ చేస్తే చాలు. చెల్లింపుల ప్రక్రియ ఎలాంటి రుసుం లేకుండా పూర్తవుతుంది.

మరో కొత్త విధానం ప్రతిపాదన
ఇక యూపీఐలో డెలిగేటెడ్ చెల్లింపుల వ్యవస్థను తీసుకొచ్చేందుకు ఆర్బీఐ నిర్ణయించింది. ఈ సదుపాయం తో ఒక వ్యక్తి మరొ వ్యక్తి కి తన ఖాతా నుంచి కొంత లావాదేవీ చేసేందుకు అవకాశం ఇవ్చొచ్చు. సెకండరీ యూజ్ కు యూపీఐ నుంచి అనుసంధానించిన ఖాతా కూడా అవసరం ఉండదు. అయితే కుటుంబాల్లో సభ్యులను దృష్టిలో పెట్టుకొని సులువైన పద్ధతిని అమల్లోకి తేవాలనే ఆలోచనలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. అయితే ఈ విధానంలో చెల్లింపుపై మాత్రం కొంత పరిమితి వరకే ఉంటుంది. ఫలితంగా డిజిటల్ రంగంలో ఇది మరింత విస్తరణకు అవకాశం ఇవ్వనుంది. ఇంట్లో కుటుంబ పెద్ద లేదా ఉద్యోగం చేసే వారి ఖాతా నుంచి వారి అనుమతితో ఎవరైనా కుటుంబ సభ్యుడు కొంత మొత్తం అవసరాల కోసం చెల్లించుకునే వీలు కలుగుతుంది. ఈ మార్పుపై యూపీఐ యూజర్లలో హర్షం వ్యక్తమవుతున్నది.