IIT Graduate Selling Biryani Success Story: మనదేశంలో ప్రఖ్యాత విద్యాసంస్థలుగా ఐఐటీలు పేరుపొందాయి. ఐఐటీలలో చదువుకున్న వారికి కార్పొరేట్ కంపెనీలు ఎర్ర తివాచీ పరుస్తాయి. కోరుకున్న జీతం.. ఇష్టపడిన జీవితం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఐఐటీలో చదివిన వారికి చాలా లభిస్తాయి. కానీ అతడు వీటిని కోరుకోలేదు. ఐఐటీలో చదువుకున్న అతడు.. ఇతర దేశాల్లో మాస్టర్ చదివాడు. ఫైనాన్స్ స్కూల్లో బిజినెస్ డిగ్రీ కూడా పూర్తి చేశాడు. అయినప్పటికీ కార్పొరేట్ కొలువును కోరుకోలేదు. చదివిన చదువుకు సమాధానం లేకుండా బిర్యాని వ్యాపారంలో వ్యాపారం లోకి అడుగుపెట్టాడు.
అతడి పేరు విశాల్ జిందాల్. మనదేశంలో పేరుపొందిన ఐఐటీలో బీటెక్ చేశాడు. ఆ తర్వాత సైరా కాస్ యూనివర్సిటీలో ఎంబీఏ చేశాడు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో ఫైనాన్స్ డిగ్రీ చేశాడు. ఇంతటి ఉన్నత చదువులు చదివినప్పటికీ.. అతడు కార్పొరేట్ కంపెనీలలో పనిచేయాలని అనుకోలేదు. తనకు ఎంతో ఇష్టమైన బిర్యాని రంగంలోకి అడుగుపెట్టాడు. అడుగు పెట్టడమే కాదు ప్రతిరోజు 37 లక్షల రూపాయల విలువైన బిర్యానిలు అమ్ముతున్నాడు. ప్రస్తుతం అతని ఆధ్వర్యంలో 100కు పైగా ఔట్ లెట్ లు ఉన్నాయి. 45 పైగా సిటీలలో అతడు బిర్యానీ విక్రయిస్తున్నాడు. ఇక్కడితోనే అతడి టార్గెట్ పూర్తి కాలేదు. త్వరలోనే తన కంపెనీని 1000 కోట్ల విలువైన సంస్థగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాడు.
“బిర్యానీ బై కిలో” పేరుతో అతడు బిర్యానీలు విక్రయిస్తున్నాడు. భువనేశ్వర్ ఐఐటీలో చదివిన ఇతడు.. మొదట్లో ఎలక్ట్రానిక్స్ వ్యాపారంలో ప్రవేశించాడు. ఆ తర్వాత బిర్యానీ వ్యాపారం మొదలుపెట్టాలని అనుకున్నాడు. తన స్నేహితుడి సహకారంతో ఈ రంగంలోకి ప్రవేశించాడు. మొదట్లో కాస్త ఇబ్బందిగా ఉన్నప్పటికీ.. ఆ తర్వాత కుదురుకున్నాడు. వ్యాపార మెలకువలు మొత్తం తెలుసుకున్నాడు. తద్వారా తన “బిర్యాని బై కిలో ” ఔట్ లెట్ ల సంఖ్యను పెంచుకున్నాడు. వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా బిర్యాని రూపొందించడం.. తాజాగా అమ్మడం వల్ల ఇతడి పేరు మార్మోగిపోయింది. ముఖ్యంగా కన్సామ (అరబ్ దేశాలలో తయారు చేసే విధానం) విధానంలో బిర్యానీ తయారు చేయడం ఇతడి స్పెషాలిటీ. ఇందులో వాడే దినుసులు.. నెయ్యి, బియ్యం వంటి వాటిని ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటాడు జిందాల్. బిర్యానీ క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీపడడు. అందువల్లే తన బిర్యాని కి ఈ స్థాయిలో గుర్తింపు లభించింది..
ఐఐటీలో చదివి.. ఉన్నతమైన ఉద్యోగాన్ని పక్కనపెట్టి.. తన మీద తానే ప్రయోగాలు చేసుకున్నాడు జిందాల్. చివరికి విజయవంతమయ్యాడు. ఒకటి దగ్గర పని చేయడం కంట.. పదిమందికి పని కల్పించడమే ఉత్తమం అని భావించాడు. అందువల్లే నేడు ఈ స్థాయిలో కొనసాగుతున్నాడు. కృషితో నాస్తి దుర్భిక్షం అనే పదానికి సిసలైన అర్థం గా నిలుస్తున్నాడు జిందాల్.