Stock Market : రెండేళ్లలో వరస్ట్ వీక్ ఇదే.. వారంలోనే ఇన్వెస్టర్ల సంపద 16లక్షల కోట్లు ఆవిరి

సెన్సెక్స్ దాదాపు 809 పాయింట్లు పడిపోయి 81688 వద్ద ముగిసింది. నిఫ్టీ 235 పాయింట్లు పతనమైంది. ఈ పతనంతో 25014 పాయింట్ల వద్ద ముగిసింది.

Written By: Mahi, Updated On : October 5, 2024 11:57 am

Stock Market

Follow us on

Stock Market : శుక్రవారం కూడా స్టాక్‌ మార్కెట్‌లో భారీ పతనం నమోదైంది. ఈ వారం ట్రేడింగ్ చివరి రోజున సెన్సెక్స్ 800 పాయింట్లకు పైగా పడిపోయింది. నిఫ్టీ కూడా 200 పాయింట్లకు పైగా పడిపోయింది. ఈ వారంలో 5 రోజుల ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 4100 పాయింట్లకు పైగా పడిపోయింది. ఈ పతనం కారణంగా ఇన్వెస్టర్లు దాదాపు రూ.16 లక్షల కోట్ల మేర నష్టపోయారు. ఒక రోజు ముందుగా అంటే గురువారం సెన్సెక్స్ 1700 పాయింట్లకు పైగా పడిపోయింది. దీంతో పెట్టుబడిదారులు దాదాపు రూ.10 లక్షల కోట్లు నష్టపోయారు. జూన్ 2022 తర్వాత స్టాక్ మార్కెట్లో అత్యంత చెత్తవారం ఇదే అని విశ్లేషకులు చెబుతున్నారు. కంటిన్యూగా వారం మొత్తం క్షీణించడం ఇదే తొలిసారి. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా మార్కెట్ ప్రతికూలంగా ప్రభావితమైంది. మధ్యప్రాచ్చంలో ఉద్రిక్తల కారణంగా ముడి చమురు సరఫరాలకు అంతరాయం కలుగుతాయన్న భయాలు నెలకొనడంతో బ్యారెల్ చమురు ధరలు భారీగా పెరిగాయి. చైనా ఉద్దీపన ప్యాకేజీ కూడా మార్కెట్ క్షీణతకు కారణమైంది. దీంతో విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్ నుంచి డబ్బును వెనక్కి తీసుకుని చైనా వైపు మొగ్గు చూపారు.

శుక్రవారం పరిస్థితి ఎలా ఉంది?
ట్రేడింగ్ వారంలో శుక్రవారం చివరి రోజు. ఈ రోజు కూడా మార్కెట్‌లో భారీ పతనం జరిగింది. సెన్సెక్స్ దాదాపు 809 పాయింట్లు పడిపోయి 81688 వద్ద ముగిసింది. నిఫ్టీ 235 పాయింట్లు పతనమైంది. ఈ పతనంతో 25014 పాయింట్ల వద్ద ముగిసింది. మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లలో అత్యధిక క్షీణత కనిపించింది. ఈ షేర్ 3.58 శాతం పడిపోయింది. ఇది కాకుండా, బజాజ్ ఫైనాన్స్ షేర్లు కూడా 3 శాతానికి పైగా పడిపోయాయి.

ఐదు రోజుల్లో తీవ్ర క్షీణత
సెప్టెంబరు 27 నుంచి అక్టోబర్ 4 వరకు 5 ట్రేడింగ్ రోజుల్లో స్టాక్ మార్కెట్‌లో భారీ క్షీణత కనిపించింది. ఈ 5 రోజుల్లో సెన్సెక్స్ 4148 పాయింట్లు పడిపోయింది. బీఎస్ఈలో లిస్టయిన స్టాక్స్ మార్కెట్ క్యాప్ రూ.15.9 లక్షల కోట్లు తగ్గి రూ.461.26 లక్షల కోట్లకు చేరుకుంది. అంటే దాదాపు రూ.16 లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్లు నష్టపోయారు. జూన్ 2022 తర్వాత సెన్సెక్స్ , నిఫ్టీల చెత్త పనితీరుగా చెప్పుకోవచ్చు. ఈ వారం సెన్సెక్స్ 4.3 శాతం, నిఫ్టీ 4.5 శాతం పడిపోయాయి. జేఎస్ డబ్ల్యూ స్టీల్ నేతృత్వంలోని లోహాల రంగం మాత్రమే లాభాలను నమోదు చేసింది. ఇతర ప్రధాన రంగాల సూచీలు – రియల్టీ, ఆటో, ఇంధనం వంటివి. తీవ్రంగా దెబ్బతిన్నాయి. వారంవారీ నష్టాలను నమోదు చేశాయి.

మార్కెట్‌ క్షీణతకు కారణాలు
చైనా ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించింది. దీంతో విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) భారత మార్కెట్ నుంచి డబ్బును వెనక్కి తీసుకుని చైనా వైపు మొగ్గు చూపారు. మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న టెన్షన్ మార్కెట్‌ను కూడా ప్రభావితం చేస్తోంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న యుద్ధ పరిస్థితుల దృష్ట్యా, విదేశీ పెట్టుబడిదారులు అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో మరింత జాగ్రత్తగా ఉన్నారు.

చైనా ఏం చేస్తోంది?
తాత్కాలిక మార్కెట్ డేటా ప్రకారం.. గురువారం వరకు గత నాలుగు ట్రేడింగ్ సెషన్లలో ఎఫ్‌ఐఐలు స్టాక్ మార్కెట్ నుండి దాదాపు రూ.32 వేల కోట్లను ఉపసంహరించుకున్నాయి. గురువారం ఎఫ్‌ఐఐలు రూ.15,243 కోట్ల విక్రయాలు జరపడం విదేశీయులు ఒక్కరోజులోనే అత్యధికంగా విక్రయించారు. వాస్తవానికి, వృద్ధిని ప్రోత్సహించడానికి చైనా అనేక చర్యలను ప్రకటించింది. మనీ మేనేజర్లు చైనాలో పెట్టుబడి పెట్టడానికి ఆసియా అంతటా లాంగ్ పొజిషన్‌లను తగ్గించుకుంటున్నారు.