YSRCP Leaders Protest ABN Andhra Jyothy Office: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఏబీఎన్ రాధాకృష్ణ వీకెండ్ కామెంట్లో వైసీపీ నేతల కుటుంబాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ హైదరాబాదులో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలో రాధాకృష్ణ వ్యాఖ్యలపై పలువురు నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాధాకృష్ణను గుర్తు పెట్టుకుంటామని.. అధికారంలోకి వచ్చాక చుక్కలు చూపిస్తామంటూ హెచ్చరించారు. జర్నలిజం ముసుగులో అనైతికంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. ఏపీ నుంచి వెళ్లిన చాలామంది వైసీపీ నేతలు ఏబీఎన్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. అయితే తిరిగి ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మహిళలపై జరిగిన అన్యాయాలపై ప్రత్యేక కథనాలు వచ్చాయి. అయితే చాలామంది వైసిపి నేతలు అక్కడకు ఇష్టం లేకపోయినా వెళ్లారని.. జగన్ బలవంతం చేసి పంపించడంతో వారు అక్కడకు వెళ్లి ధర్నా చేశారన్న ప్రచారం సాగుతోంది.
* అలా చేయవు కూడా..
సాధారణంగా మీడియా కార్యాలయాల( media offices) వద్ద ఏ రాజకీయ పార్టీ కూడా ధర్నాలు, నిరసనలు చేయదు. ఎందుకంటే అలా చేస్తే సమస్య పరిష్కారం కాకపోగా.. తిరిగి అదే మీడియా సంస్థ పాపులారిటీ పెంచుకుంటుంది. మరోవైపు మీడియా సంస్థలు అంటే చాలా రకాల ఆబ్లికేషన్స్ రాజకీయ నాయకులకు ఉంటాయి. అందుకే మీడియా సంస్థల వద్ద ఆందోళనలు చేసేందుకు చాలామంది నేతలు రారు. అయితే నిన్న చాలామంది వైసిపి మాజీ మంత్రులు, ముఖ్య నేతలు, మాజీ ఎమ్మెల్యేలు ఆంధ్రజ్యోతి యాజమాన్యంతో పాటు వారి ప్రతినిధులకు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. తాము బలవంతంగా మాత్రమే వచ్చామని.. తమ విషయంలో తప్పు పట్టవద్దని వారు కోరినట్లు ప్రచారం సాగుతోంది. ఏబీఎన్ వెంకటకృష్ణ సైతం ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు.
* ఆ అనుబంధం ఉన్న నేతలు..
రాజకీయ పార్టీల వారీగా మీడియా విడిపోవడం ఎప్పుడో జరిగిపోయింది. సాక్షి మీడియా ( Sakshi media) ప్రవేశించాక ఈ పరిస్థితి మరింత ఎక్కువైంది. అయితే ప్రస్తుతం వైసీపీలో ఉన్న నేతలు గతంలో చాలా పార్టీల్లో పని చేసేవారు. ఆ సమయంలో వారికి ఆంధ్రజ్యోతితో మంచి అనుబంధము ఉంది. జిల్లాల్లో తమ ప్రచారానికి ఆ మీడియా ఎక్కువగా సహకరించింది. అయితే వీకెండ్ కామెంట్లో ఏబీఎన్ రాధాకృష్ణ వైసిపి నేతల కుటుంబాల్లో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఈ నిరసన కొనసాగింది. కానీ ఈ నిరసనలో మహిళలు ఎవరు కనిపించలేదు. పైగా జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా ఉండే ఓ కొద్దిమంది నేతలు మాత్రమే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మరికొందరు వచ్చామంటే వచ్చాం అన్నట్టు ఉన్నారు. కానీ ముందుగానే చాలామంది నేతలు ఫోన్లో సంప్రదింపులు చేసుకున్నాక.. తమకు ఈ ఆందోళనకు హాజరు కావాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైందని చెప్పుకున్నారట. ఇప్పుడు అదే విషయాన్ని ఏబీఎన్ వెంకటకృష్ణ బాహటంగానే చెబుతున్నారు. ఇప్పుడు ఆందోళన కంటే ముందుగా ఆంధ్రజ్యోతికి టచ్ లోకి వెళ్లిన ఆ నేతలు ఎవరబ్బా అనే చర్చ నడుస్తోంది.