West Asia War Ceasefire: 40 రోజులపాటు కొనసాగిన పశ్చిమాసియా యుద్దం ఎట్టకేలకు ఆగింది. ఇరాన్పై అమెరికా సాగిస్తున్న సైనిక చర్యలకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు వారాల పాటు విరామం ప్రకటించారు. ఈ నిర్ణయం ప్రపంచ మార్కెట్లకు ఉత్సాహాన్ని ఇచ్చాయి. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో కుదిరిన ఈ ‘ద్వైపాక్షిక కాల్పుల విరమణ‘ ఒప్పందం ప్రకారం, ఇరాన్ తక్షణమే హార్మూజ్ జలసంధిని పూర్తిగా, సురక్షితంగా తెరవాలని షరతు విధించారు, ఈ అనూహ్య పరిణామంతో పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు కొంతవరకు తగ్గాయి.
చమురు ధరలలో భారీ పతనం..
యుద్ధ విరామం ప్రకటించిన వెంటనే అంతర్జాతీయ చమురు మార్కెట్లు వేగంగా స్పందించాయి. దీంతో చమురు ధరలు పడిపోయాయి. బ్రెంట్ క్రూడ్ 16 శాతం, డబ్ల్యూటీఐ క్రూడ్ ధర 16.5 శాతం తగ్గాయి. యుద్ధం కొనసాగుతున్న సమయంలో బ్రెంట్ క్రూడ్ ధర 110 నుంచి 112 డాలర్ల వరకు పెరిగింది. అయితే, ఈ ధరలు యుద్ధానికి ముందు ఉన్న 70 కంటే ఇంకా ఎక్కువేనని విశ్లేషకులు గుర్తుచేశారు.
స్టాక్ మార్కెట్లలో పండగ వాతావరణం
చమురు ధరలు కుప్పకూలగా, అమెరికా స్టాక్ ఫ్యూచర్స్ ఆకాశాన్ని అంటాయి. డౌ జోన్స్ ఫ్యూచర్స్ 900 పాయింట్లు (+1.95%) ఎగబాకింది. ఎస్ అండ్ పీ 500 పాయింట్లు పెరిగింది. నాస్డాక్ ఫ్యూచర్స్ 2.46 శాతం లాభపడింది. ఇంధన సరఫరా అంతరాయాలు తొలగుతాయనే ఆశాభావం పెట్టుబడిదారులలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
చమురు రవాణాకు హార్మూజ్ కీలకం..
ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 20 శాతం (రోజుకు 12–15 మిలియన్ బ్యారెల్స్) ఈ ఇరుకైన జలమార్గం గుండానే సాగుతుంది. మార్చి నుంచి డ్రోన్, క్షిపణి దాడుల భయంతో నౌకల రాకపోకలు స్తంభించిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన కొరత ఏర్పడింది. ఇప్పుడు ఈ మార్గం తెరవబడటంతో ఇంధన నౌకల రవాణా పునఃప్రారంభమవుతుంది. అయితే యుద్ధ విరమణ రెండు వారాల విరామం మాత్రమే కాబట్టి, శాశ్వత శాంతికి ఇది దారి తీస్తుందా అనే సందేహం ఉంది. షరతుల ప్రకారం హార్మూజ్ పూర్తి స్థాయిలో తెరుచుకుంటుందా అనే అనిశ్చితి నెలకొంది.
ట్రంప్ ఈ అనూహ్య నిర్ణయం తీసుకోవడం వెనుక అమెరికా ఆర్థిక పరిస్థితులు, ఇంధన ధరల పెరుగుదలతో ప్రజల్లో ఏర్పడిన ఆగ్రహం ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. అయితే, ఈ రెండు వారాల విరామం ఇరాన్ షరతులు పాటిస్తే శాశ్వత శాంతికి మార్గం సుగమమవుతుంది, లేకపోతే యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉంది.