Amaravati Capital: అమరావతి విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏ ప్రయత్నం చేస్తున్న వికటిస్తూనే ఉంది. మొన్నటికి మొన్న అమరావతి రైతులను తన వద్దకు పిలిపించుకున్నారు జగన్మోహన్ రెడ్డి. వారికి అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. అయితే అలా వచ్చిన రైతులు ఒకటి రెండు రోజుల్లోనే ప్రభుత్వానికి సహకరిస్తూ తమ భూములను ఇచ్చేశారు. మరోవైపు బలవంతపు భూ సమీకరణకు వ్యతిరేకంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సిఆర్డిఏ పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ అమరావతిలో పర్యటనకు వెళితే అమరావతి రైతుల అడ్డుకున్నారు. మీకు అండగా నిలిచేందుకే వచ్చామని చెప్పినా వారు వినలేదు. దీంతో ప్రతిఘటన ఎదురై.. కోడిగుడ్లతో తరిమికొట్టారు. ఇది ముమ్మాటికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అవమానకరమే. అందుకే అమరావతి విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సైలెంట్ గా ఉంటే మేలు అనేది విశ్లేషకుల మాట.
* అప్పట్లో ఉద్యమాన్ని అణచివేసి..
వైయస్సార్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానులు అంటూ అమరావతిని నిర్వీర్యం చేశారు. దీంతో అమరావతి రైతులు ఉద్యమ బాట పట్టారు. పెద్ద ఎత్తున రోడ్లమీదకు వచ్చి నిరసన తెలిపారు. ఈ క్రమంలో ఉక్కు పాదం మోపారు. ప్రజాస్వామ్య యుతంగా, శాంతియుతంగా ఆందోళనలు చేస్తే వారిపై కేసులు నమోదు చేయడం, అమరావతి టు ఆలయాల సందర్శనకు వెళితే దాడులు చేయడం వంటివి చేశారు. స్మశానంతో సైతం పోల్చారు.. అది అమరావతి కాదు కమ్మరావతి అంటూ ఎద్దేవా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ అమరావతి రైతుల మనసులో అలానే ఉండిపోయాయి. దాని పర్యవసానాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి.
* ఇప్పుడు కొత్తగా పరిరక్షణ కమిటీ..
అమరావతి రైతుల పరిరక్షణ కోసం వైసీపీ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అంటే అమరావతికి ఓకే చెప్పినట్టే కదా. కానీ మొన్నటికి మొన్న జగన్మోహన్ రెడ్డి మావిగన్ ప్రతిపాదన తీసుకొచ్చారు. మచిలీపట్నం- విజయవాడ- గుంటూరు ను కలుపుతూ క్యారిడార్ను ఏర్పాటు చేస్తే ఆటోమేటిక్గా రాజధాని అయిపోతుందని జగన్మోహన్ రెడ్డి సెలవిచ్చారు. ఒకవైపు మూడు రాజధానులు అన్నారు. అధికారం కోల్పోయేసరికి మావిగన్ సూచన చేశారు. ఇప్పుడేమో అమరావతి రైతుల పరిరక్షణ అంటూ బయలుదేరారు. అందుకే వైసిపి నేతలపై అమరావతి రైతులు దాడి చేసినంత పని చేశారు.
* రైతుల్లో ఆగ్రహానికి కారణం అదే..
2014 నుంచి 2019 మధ్య వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. అప్పుడు అధికార పక్షం చేసిన అమరావతి ప్రతిపాదనను జై కొట్టింది. అదే అమరావతి నిర్మాణాలను సెట్టింగులతో పోల్చింది. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులు అన్న విషయాన్ని చెప్పి అమరావతిని అలాగే వదిలేసింది. 2024లో అధికారం కోల్పోయాక అమరావతిపై మాట్లాడకుండా ఉండిపోయి ఉంటే బాగుండేది. ఒకవైపు రాజధానిని వేరే ప్రాంతానికి తరలించాలని మావిగన్ సూచించారు జగన్. ఇప్పుడు అమరావతి రైతుల పరిరక్షణ అంటూ కొత్త డ్రామా మొదలుపెట్టారు. ఇవన్నీ అమరావతి రైతుల్లో జగన్మోహన్ రెడ్డిని విలన్ చేస్తున్నాయి. అందుకే అమరావతి విషయంలో వైసీపీ ఎంత సైలెంట్ గా ఉంటే అంత మంచిది.
