Sajjala Ramakrishna Reddy: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి నెంబర్ 2 వివాదం ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ తర్వాత స్థానంపై ఎప్పుడు పోటీ ఉండనే ఉంటుంది. అయితే చాలా రోజులపాటు పార్టీలో నెంబర్ 2 నేతగా వ్యవహరించారు విజయసాయిరెడ్డి. ఎందుకంటే అధినేత జగన్మోహన్ రెడ్డితో పార్టీ అక్రమాస్తుల కేసులో ఆయన నిందితుడు. 16 నెలల పాటు జైలు జీవితం కూడా అనుభవించాడు. పార్టీ ఆవిర్భావం వెనుక విజయసాయిరెడ్డి పాత్ర ఉంది. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు జగన్మోహన్ రెడ్డితో సమానంగా కృషి చేశారు విజయసాయిరెడ్డి. అందుకే ఆయనకు పార్టీలో రెండో స్థానం దక్కింది. అయితే ఎక్కడో సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ గా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి ప్రవేశం తో సీన్ మారింది. చివరకు పార్టీ నుంచి బయటకు వెళ్లి పోయేదాకా పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి తర్వాత స్థానం పార్టీలో సజ్జల రామకృష్ణారెడ్డిదే. ఎందుకంటే ఆయన l వ్యవహారాలతో పాటు రాష్ట్ర సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆయనకు గట్టి పోటీ ఎదురవుతున్నట్లు తెలుస్తోంది.
Also Read: జగన్ ఆలయాల్లో పూజలు చేస్తే ఆ చర్చ ఖాయం!
* తాడేపల్లి లోనే మకాం..
మద్యం కుంభకోణంలో( liquor scam ) అరెస్ట్ అయ్యారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. చంద్రగిరి ఎమ్మెల్యేగా వ్యవహరించిన భాస్కర్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ స్థానానికి పోటీ చేశారు. అయితే ఆయన తన రాజకీయ వారసుడికి అసెంబ్లీ టికెట్ ఇప్పించి.. తాడేపల్లి వ్యవహారాలు చూసుకోవాలని జగన్మోహన్ రెడ్డి వద్ద విన్నవించారు. అయితే అనూహ్యంగా మా గుంట శ్రీనివాసుల రెడ్డి టిడిపిలో చేరిపోవడంతో.. ఒంగోలు పార్లమెంట్ స్థానానికి అభ్యర్థి అవసరం అయ్యారు. దీంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి షిఫ్ట్ చేశారు. అయితే ఎన్నికల్లో ఆయన ఓడిపోవడంతో తిరిగి తాడేపల్లి చేరుకున్నారు భాస్కర్ రెడ్డి. కానీ మద్యం కుంభకోణంలో అరెస్టయ్యారు. బెయిల్ పై విడుదలయ్యారు. అయితే ఇప్పుడు భాస్కర్ రెడ్డి తాడేపల్లి లోనే మకాం వేసి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా పనులు చక్కబెడుతున్నారు. ఈ క్రమంలో వ్యూహాల పరంగా సజ్జల రామకృష్ణారెడ్డి తో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విభేదిస్తున్నట్లు తెలుస్తోంది. వారిద్దరి మధ్య విభేదాలు పతాక స్థాయికి చేరినట్లు సమాచారం.
* సర్వే టీంల అస్త్రంతో..
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి( Bhaskar Reddy) సర్వే టీంలు ఉన్నాయి. ఆ ఎత్తుగడతోనే ఆయన జగన్మోహన్ రెడ్డికి దగ్గరవుతున్నారు. దీనిని ఎంత మాత్రం సహించుకోలేకపోతున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇటీవల ఒక సర్వే అస్త్రాన్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ముందు పెట్టినట్లు సమాచారం. కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలను అరెస్టు చేయడం వల్ల ప్రజల్లో సింపతీ పెరుగుతోందని.. జగన్ ఇమేజ్ గ్రాఫ్ పైకి వెళ్తోందని ఆయన నివేదికలు ఇస్తున్నారు. మరిన్ని అరెస్టులు జరిగేలా ప్లాన్ చేస్తేనే క్యాడర్లో కసి పెరుగుతుందని.. పార్టీ మళ్లీ పుంజుకుంటుందని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి చెబితే ఆయన ఖుషి అయినట్లు తెలుస్తోంది.
* సజ్జల నుంచి అభ్యంతరం..
మరోవైపు సజ్జల రామకృష్ణారెడ్డి( sajjala Ramakrishna Reddy ) చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సర్వే ఆస్త్రాన్ని తీవ్రంగా వ్యతిరేకించినట్లు తాడేపల్లి వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. ఇప్పటివరకు సజ్జల మాట నడుస్తోంది తాడేపల్లిలో. పార్టీ సమన్వయ బాధ్యతలను ఇవ్వడం ద్వారా పార్టీలో నెంబర్ 2 బాధ్యతను కట్టబెట్టడంతో సజ్జల ఆలోచనలో పడ్డారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సర్వే అస్త్రం సరికాదని గట్టిగానే వాదనలు వినిపించినట్లు తెలుస్తోంది. పార్టీలో అరెస్టులు జరిగితే ద్వితీయ శ్రేణి నాయకత్వం పూర్తిగా దెబ్బతింటుందని.. అరెస్టులతో సింపతి వర్కౌట్ అయినా.. పార్టీ శ్రేణులు ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని గట్టి హెచ్చరికలు పంపినట్లు తెలుస్తోంది. మరోవైపు జగన్ బయటకు వచ్చే ముందు ఇచ్చే నివేదికలు.. సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేసే విషయంలో చెవిరెడ్డి పెత్తనం పెరిగింది అన్నది సజ్జలలో ఉన్న అనుమానం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇలానే విడిచి పెడితే తనకు ఇబ్బంది వస్తుందని సజ్జల గ్రహించినట్లు తెలుస్తోంది. చెవిరెడ్డి ఇదే ఊపు కొనసాగితే మాత్రం మరో ఆరు నెలల్లో సజ్జల ప్లేస్ లో రావడం ఖాయమని వైసీపీలోనే ఒక ప్రచారం నడుస్తోంది. మరి అందులో నిజం ఎంత ఉందో తెలియాలి.