YS Sharmila : కాంగ్రెస్ ఫండింగ్ పక్క దారి.. షర్మిలపై ఆరోపణలు నిజమేనా?

YS Sharmila దానిని అడ్డుకట్ట వేయాలంటే షర్మిలపై తీవ్ర ఆరోపణలు చేయడం ఉత్తమమని వైసిపి ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే షర్మిలపై పార్టీ ఫండింగ్ ఆరోపణలు చేస్తున్నట్లు సమాచారం.

Written By: NARESH, Updated On : June 10, 2024 11:42 am

YS Sharmila

Follow us on

YS Sharmila : ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? ఆ పార్టీ వల్ల ఎవరికి నష్టం జరిగింది? అంటే కచ్చితంగా వైసీపీకేనని ఎవరైనా చెబుతారు. అయితే జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలపడటం, ఏపీలో సైతం ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తుండడం, వైసీపీకి దారుణ పరాజయం ఎదురు కావడంతో.. కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వచ్చినట్లు కనిపిస్తున్నాయి. అయితే వైసీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరికలు పెరిగే అవకాశం ఉంది. టిడిపి కూటమి జగన్కు ఎన్ని రకాలు ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాలుగా పెడుతుంది. అందుకే జగన్ వెంట ఇష్టం లేకున్నా నడిచిన సీనియర్లు కొందరు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. అదే జరిగితే షర్మిల నాయకత్వం బలపడుతుంది. షర్మిలకు కాంగ్రెస్ పార్టీ మరింత ప్రోత్సాహం అందిస్తుంది.

అయితే ఎన్నికల అనంతరం షర్మిలపై సొంత పార్టీ నేతలు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. పార్టీ ఫండింగ్ వందల కోట్ల రూపాయలు ఆమె నొక్కేశారని.. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ తో పాటు మరికొందరు ఆరోపణలు చేస్తున్నారు. వీటి వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ పాత్ర ఉంటుందని తెలుస్తోంది. అసలు కాంగ్రెస్ పార్టీకి వందల కోట్లు వచ్చే పరిస్థితి ఉందా? ఆ పార్టీ ఆర్థికంగా ఇబ్బందులు పడుతోంది. గత పది సంవత్సరాలుగా అధికారానికి దూరంగా ఉండటంతో.. పార్టీ ఫండ్ ఇచ్చుకునే స్థితిలో లేదు. కానీ షర్మిలపై ఉద్దేశపూర్వకంగానే ఆరోపణలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ పార్టీ ఫండ్ ఇచ్చి ఉండి.. షర్మిల అభ్యర్థులకు ఇవ్వకుంటే హై కమాండ్ కలుగజేసుకునేది. కానీ కాంగ్రెస్ నుంచి ఎటువంటి స్పందన లేదు. కాబట్టి ఇది నిజమైన ఆరోపణలు కావని తెలుస్తోంది.

కచ్చితంగా షర్మిలపై ఉన్న ఆరోపణలు వెనుక వైసిపి ఉందన్నది ఒక అనుమానం. చాలామంది నాయకులకు ప్రత్యామ్నాయం లేక వైసీపీలో కొనసాగారు. ఇప్పుడు జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలపడుతోంది. మరో ఐదేళ్లలో అధికారానికి దగ్గరగా రావడం ఖాయం. అందుకే నాయకులంతా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మొగ్గు చూపుతారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. పొరుగున కర్ణాటకలో సైతం అదే పార్టీ అధికారంలో కొనసాగుతోంది. ఈ రెండు చోట్ల వైసీపీ నేతలకు వ్యాపారాలు, స్థిర ఆస్తులు ఉన్నాయి. వాటిని కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు అవసరం. జాతీయస్థాయిలో పార్టీ బలపడుతున్న దృష్ట్యా ఏపీలో సైతం విస్తరించే ఛాన్స్ కనిపిస్తోంది. అందుకే మరో ఆరు నెలల్లో వైసిపి కీలక నాయకులు కాంగ్రెస్ పార్టీ పట్టడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దానిని అడ్డుకట్ట వేయాలంటే షర్మిలపై తీవ్ర ఆరోపణలు చేయడం ఉత్తమమని వైసిపి ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే షర్మిలపై పార్టీ ఫండింగ్ ఆరోపణలు చేస్తున్నట్లు సమాచారం.