YS Jagan Skips AP Assembly: ఏపీ ( Andhra Pradesh)రాజకీయాల్లో ఎట్టకేలకు ఫుల్ క్లారిటీ వచ్చింది. శాసనసభ సమావేశాలకు హాజరు విషయంలో జగన్మోహన్ రెడ్డి పూర్తి సంకేతాలు ఇచ్చేశారు. సభకు వచ్చేది లేదని తేల్చేశారు. ఇక ప్రజల మధ్య తేల్చుకుంటామని గట్టిగానే చెప్పారు. ప్రతిపక్ష హోదా ఇస్తే కానీ అసెంబ్లీకి రామని తేల్చి చెప్పిన జగన్.. అన్నంత పని చేశారు. తాను గైర్ హాజరు కావడమే కాకుండా.. వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఎవరు హాజరుకాకుండా కట్టడి చేయగలిగారు. వైయస్ జగన్మోహన్ రెడ్డిని విభేదించి కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరవుతారు అంటూ జరిగిన ప్రచారం చివరకు ఉత్తదేనని తేలిపోయింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం రెండుసార్లు మాత్రమే సభకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో, గవర్నర్ ప్రసంగ సమయాల్లో మాత్రమే రెండుసార్లు సభకు వచ్చారు. అప్పటినుంచి గైర్హాజరవుతూ వచ్చారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామని తేల్చి చెప్పారు. అయితే అది తాము ఇచ్చేది కాదని.. సభకు వస్తే తగిన సమయం కేటాయిస్తామని స్పీకర్ అయ్యన్నపాత్రుడు చెప్పుకొచ్చారు. కానీ ఇవేవీ ఫలించలేదు. ఈరోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలకు జగన్తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు రాలేదు.
వస్తే బాగుంటుందన్న అభిప్రాయం
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ ఎమ్మెల్యేలు సభకు వస్తే బాగుంటుందన్న అభిప్రాయం అందరిలోనూ కనిపించింది. సభకు హాజరైతే ప్రజా సమస్యలు చర్చకు వస్తాయని రాష్ట్రం మొత్తం చూసింది. కానీ ప్రతిపక్ష హోదా ఇవ్వనిదే తాము రామని జగన్మోహన్ రెడ్డితో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తేల్చి చెప్పారు. ప్రతిపక్ష హోదా తోనే తగిన సమయం మాట్లాడేందుకు దక్కుతుందన్నది జగన్మోహన్ రెడ్డి వాదన. అయితే సభకు వస్తే జరగబోయేది జగన్మోహన్ రెడ్డికి తెలుసు. కూటమి 164 మంది ఎమ్మెల్యేలతో పటిష్ట స్థితిలో ఉంది. పైగా అక్కడ మూడు పార్టీల్లో సీనియర్ నేతలు ఉన్నారు. అందులోనూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బాధితులే అధికంగా ఎమ్మెల్యేలు అయ్యారు. అందుకే ఏ స్థాయిలో సభలో ఎదురు దాడి ఉంటుందో జగన్మోహన్ రెడ్డికి తెలుసు. సభకు వెళ్లి అబాసుపాలు కావడం కంటే.. వెళ్లకుండా ఉండడమే ఉత్తమం అన్న నిర్ణయానికి జగన్ అండ్ కో వచ్చినట్లు తెలుస్తోంది. తద్వారా ఇక నుంచి శాసనసభ సమావేశాలకు వచ్చేది లేదని ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.
ప్రజలతో మమేకం..
ఇకనుంచి ప్రజల మధ్య ఉండాలని జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) నిర్ణయం తీసుకున్నారు. సభకు హాజరైతే అవమానాలు తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ అసెంబ్లీకి జగన్ హాజరైతే మాట్లాడేందుకు ఒకటి లేదా రెండు నిమిషాలు మాత్రమే మైక్ ఇస్తారు. తప్పకుండా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన వాటిపై చర్చిస్తారు. దీనికి తోడు గెలిచిన వైసిపి ఎమ్మెల్సీలు సైతం దూకుడు కలిగిన నేతలు లేరు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి నేత ఉన్నా.. మాటల్లో ఎదురుదాడి ఉండదు. వాదనలు చేయలేరు. ఈ క్రమంలో సభకు హాజరైతే అవమానాలు తప్పవు. పైగా మద్యం కుంభకోణం తో పాటు ఇతరత్రా అంశాలను తప్పకుండా చర్చిస్తుంది కూటమి. దానికి ఎదురు దాడి చేయలేక, సమర్ధించలేక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడడం ఖాయం. అందుకే ప్రతిపక్ష హోదా అని మెలిక పెట్టి సభకు గైర్హాజరు కావడం మేలన్న నిర్ణయానికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి.
డైరెక్టుగా జనంలోకి..
అయితే సభకు జగన్మోహన్ రెడ్డి తో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడం ఇబ్బందికరమే. ప్రజల్లో కూడా దీనిపై బలమైన చర్చ నడుస్తోంది. అందుకే దానికి చెక్ చెప్పాలని భావిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అసెంబ్లీకి వెళ్లకుండా డైరెక్ట్ గా జనంలోనే తిరుగుతూ.. ప్రజలతో మమేకమై పనిచేస్తే మంచి ఫలితం ఉంటుందని ఆయన ఒక అంచనాకు వచ్చారు. ఏపీలో ప్రజా సమస్యలపై గళం ఎత్తుతూ ప్రజల అభిమానాన్ని చురగొనాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. మొత్తానికైతే శాసనసభకు హాజరు విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు జగన్మోహన్ రెడ్డి.