Yanamala Ramakrishnudu controversy: తెలంగాణలో డ్రగ్స్ వ్యవహారం కాదు కానీ.. ఏపీలో మాత్రం ఓ సీనియర్ నేతకు ఇది మాయని మచ్చ. తన రాజకీయ ప్రస్థానంలో ఏ మచ్చ లేకుండా కొనసాగుతున్నారు సీనియర్ మోస్ట్ లీడర్ యనమల రామకృష్ణుడు( yanamalai Ramakrishnudu ). ఇప్పుడు తెలంగాణలో డ్రగ్స్ తీసుకున్నట్టు భావిస్తున్న పుట్టా మహేష్ కుమార్ యాదవ్ స్వయాన రామకృష్ణుడు అల్లుడు. అయితే ఇది పొలిటికల్ గా తెలుగుదేశం పార్టీకి డ్యామేజ్ చేస్తుందని ఆ పార్టీ భావిస్తోంది. అందుకే పార్టీ వ్యవహారాలకు మహేష్ కుమార్ యాదవ్ ను దూరంగా ఉంచింది. మరోవైపు మహేష్ తండ్రి టిడిపి ఎమ్మెల్యే సుధాకర్ రెడ్డి. ఆయన గతంలో టీటీడీ చైర్మన్గా వ్యవహరించారు. ప్రస్తుతం మైదాకూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. అటు మహేష్ భార్య దివ్య తుని ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే ఇప్పటివరకూ మహేష్ కుటుంబ ప్రస్తావన పెద్దగా పైకి రాలేదు. డ్రగ్స్ కలకలం తోనే ఇదంతా బయటకు వచ్చింది. ముఖ్యంగా యనమల రామకృష్ణుడు తీవ్ర మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది.
టిడిపిలో తనదైన ముద్ర..
తెలుగుదేశం పార్టీలో( Telugu Desam Party) తనకంటూ ఒక ముద్ర చాటుకున్నారు యనమల రామకృష్ణుడు. పార్టీలో క్రమశిక్షణ కలిగిన నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. రాజకీయ ప్రత్యర్థులపై ఆయన సునిసితంగా విమర్శలు చేయగలరు. రాజకీయ ప్రత్యర్థులు సైతం ఆయనను గౌరవిస్తారు. అటువంటిది అల్లుడు డ్రగ్స్ తీసుకుని దొరికిపోవడం నిజంగా ఆయనకు లోటు. పైగా తెలుగుదేశం పార్టీలో ఒకే కుటుంబానికి ఇన్ని అవకాశాలు ఇచ్చారా అనేది ఒక చర్చ నడుస్తోంది ఈ పరిణామంతో. ఇప్పటికే యనమల రామకృష్ణుడుకు గౌరవప్రదమైన పదవి ఇవ్వాలన్న విజ్ఞప్తులు పార్టీలో ఉన్నాయి. ఎందుకంటే పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన కొనసాగుతూ వచ్చారు. ఇప్పుడు గౌరవప్రదమైన పదవీ విరమణ కోరుకుంటున్నారు.
ఒకే కుటుంబంలో అవకాశాలు..
ప్రత్యేక పరిస్థితుల నడుమ మొన్న ఎన్నికలు జరిగాయి. పొత్తులో భాగంగా సీట్ల కేటాయింపు అనేది కష్టంగా మారింది. చాలా రాజకీయ కుటుంబాలకు ఒక్కటే టికెట్ లభించింది. కానీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ విషయంలో మాత్రం చాలా అవకాశాలు దక్కాయి. అప్పటికే ఎమ్మెల్సీగా యనమల రామకృష్ణుడు ఉన్నారు. ఆయన అల్లుడితోపాటు కుమార్తెకు సైతం చాన్స్ ఇచ్చారు. అదే సమయంలో వియ్యంకుడికి రాయలసీమలో టిక్కెట్ ఇచ్చారు. ఇన్ని అవకాశాలు తీసుకున్నాక కూడా మహేష్ కుమార్ యాదవ్ ఇటువంటి తప్పుచేసి కుటుంబాన్ని బయటపెట్టేశారు అనేది ఒక విమర్శ ఉంది. అన్నింటికీ మించి యనమల రామకృష్ణుడు పై ఈ ప్రభావం ఉంటుందన్న టాక్ నడుస్తోంది. దానికి కారణం లేకపోలేదు.
పదవికి ఎదురు చూస్తుండగా..
ప్రస్తుతం యనమల రామకృష్ణుడు మంచి పదవి కోసం ఎదురుచూస్తున్నారు. ఆయనకు గవర్నర్ పోస్ట్ కానీ.. రాజ్యసభ పదవి కాని ఇస్తారని ప్రచారంలో ఉంది. అయితే ఇప్పటికే అశోక్ గజపతిరాజుకు గవర్నర్గా ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు యనమల కోరుకుంటున్నట్లు రాజ్యసభ పదవి ఇస్తారన్న అంచనాలు ఉన్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే అల్లుడు డ్రగ్స్ కేసులో చిక్కుకోవడం ఆయనకు మైనస్ గా మారింది. ఒకవైపు అదే కుటుంబంలో అన్ని పదవులు ఇచ్చాక కూడా యనమలకు రాజ్యసభ ఇవ్వడం ఏమిటనే ప్రశ్న వినిపిస్తోంది. కొద్ది రోజులపాటు ఆ కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం మేలని ఎక్కువ మంది సూచిస్తున్నారు. కానీ యనమల క్రమశిక్షణతో పాటు ఆయన సీనియారిటీ చంద్రబాబుకు తెలుసు. కచ్చితంగా గౌరవప్రదమైన పదవి ఇస్తారని యనమల అనుచరులు చెబుతున్నారు. అయితే తాజా పరిణామాలతో త్వరలో భర్తీ చేయబోయే నాలుగు రాజ్యసభ పదవుల్లో యనమలకు ఒకటి దక్కుతుందో? లేదో? చూడాలి.