YS Vijayamma : షర్మిల మాదిరిగానే విజయమ్మ.. వైసీపీ స్టాండ్ ను తెలియజేసిన ‘సాక్షి’!

రాజశేఖర్ రెడ్డి కుటుంబ ఆస్తి వివాదం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్. కుమార్తె షర్మిల వైపు విజయమ్మ ఉండడంతో ఇప్పుడు ఆమె టార్గెట్ అవుతున్నారు.ఏకంగా సాక్షిలోనే వ్యతిరేక కథనాలు వస్తుండడం విశేషం.

Written By: Dharma, Updated On : October 28, 2024 2:40 pm

YS Vijayamma

Follow us on

YS Vijayamma :  ఏపీ రాజకీయాల్లో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి.పార్టీలకు అనుకూలంగా మీడియాలు మారిపోయాయి.టిడిపికి అనుకూలంగా ఉండే మీడియాను ఎల్లో మీడియా గాను.. వైసీపీకి అనుకూలంగా ఉన్న మీడియాను నీలి మీడియా గాను విభజించారు.పరిస్థితులకు తగ్గట్టు తటస్థ మీడియా వ్యవహరిస్తూ ఉంటుంది.అయితే వైసీపీకి కరపత్రంగా మారిపోయింది సాక్షి. ఎల్లో మీడియా గా ముద్రపడిన ఈనాడు,ఆంధ్రజ్యోతిలో అప్పుడప్పుడు వ్యతిరేక కథనాలు వస్తుంటాయి.టిడిపికి ఫేవర్ చేస్తూనే వ్యతిరేక కథనాలు రాయడం వారికి అలవాటైన విద్య. అయితే ఈ తరహా ప్రయత్నం ఎక్కడ సాక్షిలో కనిపించదు.అక్కడ కనిపించేది రాజకీయ ప్రత్యర్థులకు వ్యతిరేక కథనాలు, వైసిపికి అనుకూల వార్తలు. అంతకుమించి సాక్షి మీడియా ఎటువంటి ఆలోచన చేయదు. అయితే తాజాగా సాక్షి మీడియాలో వైఎస్ విజయమ్మకు వ్యతిరేకంగా కథనం రావడం విశేషం. ప్రస్తుతం రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో ఆస్తి వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈడి అటాచ్మెంట్ లో ఉన్న ఆస్తికి సంబంధించి షేర్లను ఎలా బదలాయిస్తారు అంటూ తల్లి, చెల్లెలిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు జగన్. అప్పటి నుంచి రచ్చ ప్రారంభం అయ్యింది. దీనిపై షర్మిల స్ట్రాంగ్ గా రియాక్ట్ అవుతున్నారు. అదే సమయంలో వైసీపీ నేతలు సైతం ఎదురు దాడి చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ విషయంలో జగన్ కు భారీ డ్యామేజ్ జరిగింది. తన రాజకీయ ప్రత్యర్థులతో సోదరి షర్మిల చేతులు కలిపి ఇదంతా చేస్తున్నారని జగన్ నుంచి ఆరోపణలు వస్తున్నాయి.అయితే ఎక్కడ విజయమ్మ పేరు ప్రస్తావించలేదు. కానీ ఈరోజు విజయమ్మకు వ్యతిరేకంగా సాక్షిలో కథనం రావడం విశేషం. దీనిని వైసీపీ శ్రేణులు సైతం సమర్ధించుకుంటున్నాయి.

* ప్రత్యర్థులకు ఇది వరం
అయితే సాక్షిలో ప్రచురితమైన కథనం చూసి రాజకీయ ప్రత్యర్థులు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అదే సాక్షిలో పైభాగాన రాజశేఖర్ రెడ్డి బొమ్మను చిత్రీకరించారు. మధ్యలో విజయమ్మను తిట్టిపోస్తున్నారు. సోదరి షర్మిలను సైతంతప్పుపడుతూ భారీగా వ్యతిరేక కథనం రాశారు.రాజకీయ ప్రత్యర్థులతో చేతులు కలిపిన తప్పుడు మనుషులుగా చూపే ప్రయత్నం చేశారు.ఇప్పటివరకు రాజకీయ ప్రత్యర్థులను మాత్రమే సాక్షిలో వ్యతిరేకంగా చూపించేవారు. ఇప్పుడు సొంత కుటుంబ సభ్యులను మాత్రం అలా చూపించేసరికి వైసీపీ అభిమానులు సైతం అయోమయానికి గురవుతున్నారు. రాజశేఖర్ రెడ్డి కుటుంబ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

* విజయమ్మపై కత్తులు
అయితే ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే విజయమ్మ పై సైతం వైసీపీ కత్తులు దూసే అవకాశం కనిపిస్తోంది. కుటుంబ వ్యవహారం చాలా వరకు వెళ్లిపోయిందని.. విజయమ్మ తిరిగి రాకపోయేసరికి వైసీపీ శిబిరానికి ప్రత్యేక ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. అయితే సాక్షిలో కథనం బట్టివిజయ మన సైతం ఏ స్థాయిలో శత్రువుగా చూస్తున్నారో అర్థం అవుతుంది. మున్ముందు షర్మిల తో పాటు విజయమ్మకు వ్యతిరేకంగా వ్యక్తిగత కథనాలు వచ్చినా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి.