Jagan: అసెంబ్లీ సమావేశాలకు జగన్ వెళతారా? వెళ్ళరా? లేక రాజకీయ కారణాలు చూపి ముఖం చాటేస్తారా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 2014 ఎన్నికల్లో వైసిపి 67 స్థానాల్లో విజయం సాధించింది. అయితే తొలినాళ్లలో శాసనసభకు హాజరయ్యారు జగన్. అల్లరి చేష్టలతో ఒకరిద్దరు వైసిపి శాసనసభ్యులు సస్పెన్షన్ కు గురయ్యారు. అప్పట్లో శాసనసభను బాయ్ కట్ చేస్తున్న బయటకు వచ్చారు జగన్.మళ్లీ సీఎం గానే వస్తానని శపధం చేశారు.2019 ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా తిరిగి శాసనసభలో ప్రమాణ స్వీకారం చేశారు.అయితే ఇప్పుడు కేవలం 11 మంది మాత్రమే వైసీపీ తరఫున ఎన్నికయ్యారు.దీంతో జగన్ సభకు హాజరవుతారా? లేదా? అన్న అనుమానాలు అయితే కలుగుతున్నాయి.
గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 23 స్థానాలకే పరిమితం అయ్యింది. దీంతో చంద్రబాబు సభకు హాజరయ్యారు. అధికార పార్టీని ఢీకొట్టగలిగారు. టిడిపి నుంచి నలుగురు సభ్యులను ఆకర్షించగలిగారు జగన్. టిడిపికి ప్రతిపక్ష హోదా దక్కకుండా కూడా ప్రయత్నించారు. కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. ఈ తరుణంలో అధికార పార్టీ నుంచి చంద్రబాబుకు ఎదురుదాడి ప్రారంభమైంది. అయినా సరే టిడిపి సభ్యులు గట్టిగానే ఎదుర్కొనేవారు. కానీ చంద్రబాబుపై వ్యక్తిగత కామెంట్స్ చేశారు వైసీపీ సభ్యులు. దీనిపై నొచ్చుకున్న చంద్రబాబు మళ్లీ సీఎం గానే మళ్లీ హౌస్ లో అడుగు పెడతానని ప్రతిన బూనారు. ఇప్పుడు సీఎం హోదాలో చంద్రబాబు హౌస్ లో అడుగుపెట్టనున్నారు. విపక్ష నేతగా జగన్ అడుగు పెడతారా? పెట్టే ఛాన్స్ ఉందా? అంటే మాత్రం లేదనే సమాధానం వినిపిస్తోంది.
అయితే మంత్రుల నుంచి పార్టీ ఎమ్మెల్యేల వరకు చంద్రబాబు, టిడిపి ఎమ్మెల్యేలపై ఓ రేంజ్ లో మాటల దాడి చేసేవారు.ఆ ఊచ కోత గురించి జగన్కు తెలియంది కాదు. పైగా హౌస్ లో చంద్రబాబు తో పాటు పవన్ ఉంటారు. బాలకృష్ణ తో పాటు లోకేష్ ఉంటారు. అన్నింటికీ మించి తాను కేసులతో వేధించిన రఘురామకృష్ణంరాజు లాంటి వారు కూడా ఎదురుగా కనిపిస్తారు. గత ఐదు సంవత్సరాలుగా కేసులతో బాధించిన.. నేతలంతా ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వారి నుంచి ఏ స్థాయిలో కౌంటర్ అటాక్ వస్తుందో జగన్ కు తెలియంది కాదు. అందుకే ఆయన మరోసారి వివిధ కారణాలు చూపుతూ హౌస్ కు రావడం మానేస్తారని ప్రచారం జరుగుతోంది. మరి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.