CM Chandrababu: ఎన్నికల్లో జగన్ కోలుకోలేని దెబ్బ తిన్నారు. ఓటమి నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటమిపై పోస్టుమార్టం చేయాలే తప్ప.. ఇప్పుడు అధికారపక్షంపై వ్యూహం పన్నడం సరైన చర్య కానే కాదు. శాసనమండలి ద్వారా చంద్రబాబు సర్కార్ కు సరైన బుద్ధి చెబుతామని జగన్ హెచ్చరించడం ఇబ్బందికర పరిస్థితులను తప్పకుండా తెచ్చిపెడుతుంది. అంతులేని మెజారిటీతో అధికారంలోకి రావడం,కేంద్రంలో కీలకంగా ఉండడం వంటి కారణాలతో చంద్రబాబు అత్యంత శక్తివంతుడయ్యారు. ఇది గమనించి జగన్ అడుగులు వేస్తే ఉత్తమం.
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనమండలిలో ఆ పార్టీకి ప్రాతినిధ్యం లేదు. దీంతో రాజధానులవంటి బిల్లులు పాస్ కాలేదు. అప్పుడే శాసనమండలిని రద్దు చేయాలని జగన్ భావించారు. కేంద్రానికి కూడా నివేదించారు.కానీకేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదు.ఇంతలో వైసిపి ప్రాతినిధ్యం శాసనమండలిలో పెరుగుతూ వచ్చింది. దీంతో శాసనమండలి రద్దు అనే అంశం పక్కకు వెళ్లిపోయింది.ఇప్పుడు అదే శాసనమండలి వ్యవస్థ ద్వారా వైసిపి ఉనికి చాటుకోవాలని.. టిడిపి ప్రభుత్వాన్ని అడ్డుకోవాలని జగన్ ప్రయత్నాలు మొదలుపెట్టడం విశేషం.
అయితే జగన్ ప్రయత్నాలను ఎప్పుడో ఊహించారు చంద్రబాబు. ఎన్నికలకు ముందే ఒక అంచనాకు వచ్చారు. అందుకే శాసనమండలి నుంచి ఏ ఒక్కరిని మంత్రివర్గంలోకి తీసుకోలేదు. గతంలో యనమల రామకృష్ణుడు, లోకేష్ లాంటి వారికి శాసనమండలి నుంచి మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ప్రస్తుతం శాసనమండలిలో వైసీపీ బలం ఎక్కువగా ఉంది. 58 ఎమ్మెల్సీలకు గాను. ఆ పార్టీకి 38 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. కీలక బిల్లులు పాస్ కావడంలో అడ్డు తగులుతారని చంద్రబాబు గ్రహించారు. అందుకే అవసరమైతే శాసనమండలిని రద్దు చేయడానికి వెనుకడుగు వేయరు. గతంలో మాదిరిగా కేంద్ర ప్రభుత్వం అడ్డు చెప్పదు కూడా. ఒకవేళ చంద్రబాబు శాసనమండలి వ్యవస్థను రద్దు చేస్తే.. 38 మంది వైసిపి ప్రజాప్రతినిధులు రాజకీయ నిరుద్యోగులుగా మారడం ఖాయం. అటు టిడిపికి ఒకరిద్దరు ఎమ్మెల్సీలే మిగిలారు. రద్దు చేసిన టిడిపికి ఎటువంటి నష్టం లేదు. అందుకే జగన్ ఎంత వెనక్కి తగ్గితే అంత మంచిది. లేకుంటే మాత్రం ఆయనకే నష్టం.