Kirak RP: సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఆ వీడియోలే కనిపించేవి. సెలబ్రిటీల నుంచి మొదలు పెడితే సామాన్యుల వరకు అందరూ ఆ కర్రీ పాయింట్ల ముందు క్యూలో ఉండేవారు. అక్కడ దొరికేది పెద్ద పెద్ద కూరలు కాదు.. భూమ్మీద లభించే అరుదైన వస్తువులతో తయారుచేసే కూరలు అంతకంటే కాదు. జస్ట్ చేపల పులుసు.. అది కూడా నెల్లూరు చేపల పులుసు.. దానికోసం జనం విరగబడేవారు. క్యూలో ఉండేవారు.
ఈ స్థాయిలో హైపు ఎవరికైనా లభిస్తే.. దానిని మరో రేంజ్ కు తీసుకెళ్లేవారు. కానీ అక్కడ ఉన్నది కిరాక్ ఆర్పి.. ఏం చేయాలో తెలుసు ఆయనకు.. చేపల పులుసు ఎలా అమ్మాలో తెలుసు ఆయనకు.. కానీ వచ్చిన డిమాండ్ ఎలా నిలబెట్టుకోవాలో తెలియక.. కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా వార్తల్లో విఫల వ్యక్తిగా మిగిలిపోయారు. అసలు ఎందుకు ఇలా జరిగింది
.. ఎందుకు ఇలా అయింది.. దాని వెనుక పెద్ద స్టోరీ ఉంది. కాకపోతే నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు స్ట్రాటజీ సక్సెస్ అవ్వడం వెనుక కిరాక్ ఆర్పి ఉన్నాడు. ఫ్లాప్ అవడం వెనక కూడా కిరాక్ ఆర్పి ఉన్నాడు.
కిరాక్ ఆర్ పి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ప్రారంభించినప్పుడు సోషల్ మీడియా ద్వారా విపరీతంగా తన మార్కెట్ పెంచుకున్నాడు. ప్రమోషనల్ వీడియోలు చేయించుకున్నాడు. హైదరాబాద్ నగరాల్లో ఒకేసారి నాలుగు సెంటర్లు ఏర్పాటు చేశాడు. మెయిన్ కిచెన్ ఒక దగ్గర ఏర్పాటు చేసి.. డిస్ట్రిబ్యూట్ చేయడం మొదలుపెట్టాడు. కాకపోతే మొదట్లోనే ఇక్కడ లభించే చేపల పులుసు కు ధర విపరీతంగా ఉందని కామెంట్లు వినిపించాయి. అంతేకాదు కారం ఎక్కువగా ఉంటుందని.. పులుపు తక్కువగా ఉంటుందని.. ఉప్పు తక్కువగా ఉంటుందని.. ఇలాంటి కామెంట్లు కూడా వినిపించాయి. ఇలాంటి సమయంలో కస్టమర్ లను తెలివిగా మేనేజ్ చేయాల్సింది పోయి.. కిరాక్ ఆర్పి దురుసుగా ప్రవర్తించాడు. ఫలితంగా కస్టమర్లు దూరమయ్యారు.. విపరీతమైన డిమాండ్ ను క్యాష్ చేసుకోలేక.. కర్రీ పాయింట్లను నిర్వహించలేక చేతులెత్తేశాడు. ఫలితంగా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అలా ముగిసిపోయిన అధ్యాయం అయిపోయింది.
నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసును ప్రారంభిస్తున్నప్పుడు కిరాక్ ఆర్పి ప్రఖ్యాత పచ్చళ్ళ ప్రకాష్ అలియాస్ బాబాయ్ దగ్గరికి వెళ్లారు. తాను కర్రీ పాయింట్లను ఏర్పాటు చేస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. దానికి ప్రకాష్ కొన్ని సూచనలు చేశారు. వాటికి తగ్గట్టుగా కిరాక్ ఆర్ పి కర్రీ పాయింట్లను ఏర్పాటు చేశారు. ఆయన చెప్పినట్టుగా మార్కెటింగ్ స్ట్రాటజీ అమలు చేయకపోవడంతో.. చివరికి నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసు ఒక విఫల ప్రయోగంగా మిగిలిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో పేరు పొందిన హోటళ్లు.. కర్రీ పాయింట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా సంవత్సరాలుగా కస్టమర్ల ఆదరణ పొందుతున్నాయి. అవన్నీ కూడా క్రమక్రమంగానే పేరు తెచ్చుకున్నాయి. అయితే నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు మాత్రం విపరీతమైన డిమాండ్ సొంతం చేసుకుంది. కానీ ఆ డిమాండ్ నిలబెట్టుకోవడంలో విఫలమైంది. హోటల్ వ్యాపారం లోకి రావాలి అనుకునే వారికి.. నిలబడాలి అనుకునే వారికి.. ఏం చేస్తే బాగుపడతామో అనుకునే వారికి.. నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసు ఒక లైవ్ ఎగ్జాంపుల్.
