Sharmila Rajya Sabha: మొన్నటి వరకు కర్ణాటక నుంచి రాజ్యసభ సభ్యురాలిగా షర్మిల ఎన్నిక అవుతారని.. ఆమె ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున కర్గే ను తన భర్త అనిల్ తో కలిసినప్పుడు అందరూ ఇదే అనుకున్నారు. పైగా రాహుల్ గాంధీ ఆశీస్సులు కూడా ఆమెకు ఉన్నాయని.. వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె కావడంతో ఆమెకు అన్ని విధాలుగా మంచి జరుగుతుందని అందరూ భావించారు. షర్మిల కూడా ఇదేవిధంగా సంకేతాలు ఇచ్చారు. కానీ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. రాజ్యసభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ఆమె పేరు కనిపించలేదు.
మొత్తం ఏడుగురు సభ్యులతో జాబితాను విడుదల చేసింది కాంగ్రెస్ పార్టీ. కర్ణాటక నుంచి మల్లికార్జున కర్గే, పవన్ కేరా, మన్సూర్ అలీఖాన్ ను అభ్యర్థులుగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించింది. మీనాక్షి నటరాజన్ కు మధ్యప్రదేశ్ నుంచి.. నీరజ్ డాంగ్లి ని రాజస్థాన్ నుంచి.. ప్రణవ్ ఝా జార్ఖండ్ నుంచి అభ్యర్థులుగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఇప్పటికే రాజ్యసభలో ఆ పార్టీకి సభా పక్ష నేతగా ఉన్నారు. ఎంపీగా ఆయన పదవీకాలం కూడా ముగింపు దశలో ఉంది. అందువల్లే పార్టీ మరొకసారి ఆయనకు అవకాశం కల్పించింది. తమిళనాడు రాష్ట్రంలో అన్నా డీఎంకే ఎంపీ రాజీనామాతో ఆస్థానం ఖాళీ అయింది. దీంతో ఆస్థానాన్ని టీవీకే పార్టీ అధినేత విజయ్ కాంగ్రెస్ పార్టీకి కేటాయించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ స్థానం నుంచి ప్రవీణ్ చక్రవర్తి రంగంలో నిలిచారు.
ఏపీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా కొనసాగుతున్న షర్మిలకు కర్ణాటక నుంచి అభ్యర్థిగా అవకాశం లభిస్తుందని వార్తలు వినిపించాయి. అయితే ఆమెకు ఆ అవకాశం లభించలేదు. షర్మిలకు ఆ అవకాశం లభించకుండా చేసింది ఎవరనే చర్చ నడుస్తోంది. వాస్తవానికి షర్మిల ఏపీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బలమైన వాయిస్ వినిపిస్తున్నారు. ఇటీవల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక స్థానం కూడా గెలుచుకోలేకపోయినప్పటికీ.. చాలా ప్రాంతాలలో మెరుగైన ఓటు బ్యాంక్ సాధించింది.
ఈ నేపథ్యంలో షర్మిలకు ఎంపీ పదవి ఇచ్చి.. అధిష్టానం ఆమెకు గౌరవం కల్పిస్తుందని అనుకున్నప్పటికీ.. అలా జరగలేదు. కొన్ని కోటరీలు ఆమెకు వ్యతిరేకంగా పనిచేశాయని.. అందువల్లే ఆమెకు ఆ పదవి లభించలేదని సమాచారం. అభ్యర్థిగా తన పేరు ఖరారు కాకపోవడంతో షర్మిల ఒకింత నిరాశలో ఉన్నట్టు తెలుస్తోంది..
దేశంలోని 10 రాష్ట్రాల పరిధిలో 24 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ రాష్ట్రాల్లో ఏపీలో నాలుగు.. గుజరాత్ లో నాలుగు.. కర్ణాటకలో నాలుగు.. మధ్యప్రదేశ్లో మూడు.. రాజస్థాన్లో మూడు.. జార్ఖండ్లో రెండు.. మణిపూర్ ప్రాంతంలో ఒకటి.. మేఘాలయ ప్రాంతాల్లో ఒకటి.. అరుణాచల్ ప్రదేశ్ లో ఒకటి.. మిజోరం రాష్ట్రంలో ఒక స్థానం ఉన్నాయి. ఇవే కాకుండా తమిళనాడు.. ఒడిస్సా రాష్ట్రంలో కూడా ఒక్కొక్క స్థానానికి ఇదే రోజున ఉప ఎన్నికలు జరుగుతాయి.
