Krishna rever board : రాయలసీమ? కోస్తానా? కృష్ణా రివర్ బోర్డు కార్యాలయం ఎక్కడ? చంద్రబాబు ఏం చేస్తారో?

వైసిపి ఓటమితో మూడు రాజధానుల అంశం కనుమరుగైంది. ప్రాంతీయవాదానికి చెక్ పడింది. అమరావతి ఏకైక రాజధానిగా నిలిచింది. అయితే ఓ ప్రాంతీయ బోర్డు కార్యాలయం ఏర్పాటు వివాదాస్పదంగా మారే అవకాశం కనిపిస్తోంది.

Written By: Dharma, Updated On : August 20, 2024 12:07 pm

Krishna rever board Office

Follow us on

Krishna rever board : ఏపీలో కూటమి పాలనకు రెండు నెలలు గడుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలను అధిగమిస్తూ కోటవి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. సంక్షేమ పథకాల అమలుతో పాటు పాలనపై చంద్రబాబు సర్కార్ దృష్టి పెట్టింది.మూడు రాజధానులు పక్కకు వెళ్లిపోయాయి. అమరావతి ఏకైక రాజధానిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా అడుగులు వేస్తోంది. పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గతం మాదిరిగా కాకుండా అన్ని జిల్లాలను అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇటువంటి తరుణంలో రాష్ట్రానికి సంబంధించిన ఓ కీలక కార్యాలయం ఏర్పాటు కోసం రెండు నగరాల మధ్య గట్టి పోటీ నెలకొంది.ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దాని ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఏ నగరానికి చెందిన నాయకులు తమకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతూ ఉండడంతో జిఠిలం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత కృష్ణా నది జలాల వివాద పరిష్కారం కోసం ఓ బోర్డును ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాదులో ఈ బోర్డు కార్యాలయం ఉండేది. తెలుగు రాష్ట్రాల్లో ప్రవహిస్తున్న కృష్ణా నది ఏపీలో తన ప్రయాణాన్ని ముగిస్తుంది. దీంతో చివరి రాష్ట్రమైన ఏపీలో కృష్ణా బోర్డు ఏర్పాటు కోసం గతంలోనే ప్రయత్నాలు జరిగాయి. గత వైసిపి ప్రభుత్వం విశాఖ రాజధానిని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కృష్ణా బోర్డును సైతం విశాఖలో ఏర్పాటు చేయడానికి మొగ్గు చూపింది. కృష్ణానది ఎక్కువగా రాయలసీమ ప్రాంతంలోనే ప్రవహిస్తుంది. ఈ లెక్కన అక్కడే బోర్డు కార్యాలయం ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. ఏ సంబంధం లేని విశాఖలో ఏర్పాటు చేయడం ఏమిటి అని నిలదీతలు ఎదురయ్యేసరికి వైసీపీ ప్రభుత్వం మౌనం దాల్చింది.

* నిర్ణయం అనివార్యం
అయితే ఈ ఎన్నికల్లో వైసిపి ఓడిపోవడం.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగిపోయింది. ఇప్పుడు బోర్డు కార్యాలయం ఏర్పాటు విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పని అనివార్య పరిస్థితి ఎదురైంది. వైసిపి హయాంలోనే కృష్ణా బోర్డు కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వచ్చింది. వైసిపి ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో అంశం పెండింగ్లో ఉండిపోయింది.

* విజయవాడలో ఏర్పాటుకు సన్నాహాలు
అయితే తాజాగా టిడిపి కూటమి ప్రభుత్వం బోర్డు కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోందన్న ప్రచారం సాగుతోంది. ఈ పరిస్థితుల్లో రాయలసీమ నేతలు అలర్ట్ అయ్యారు. కర్నూలు ఎంపీ బస్తీపాటి నాగరాజును కొంతమంది రాయలసీమ నేతలు కలిశారు. కర్నూలులోనే కృష్ణా రివర్ బోర్డు కార్యాలయం ఏర్పాటు చేయాలని కోరారు.గతంలో రాయలసీమ హక్కుల కోసం పోరాడిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సైతం కర్నూలులోనే కార్యాలయం ఏర్పాటు చేయాలని పట్టు పట్టే అవకాశం ఉంది.

* రాయలసీమ నుంచి విమర్శలు
వాస్తవానికి చంద్రబాబు రాయలసీమకు చెందిన వ్యక్తి. కానీ రాయలసీమ ప్రయోజనాల కోసం ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు అన్న విమర్శ ఉంది. ఎప్పుడు గాని కృష్ణా రివర్ బోర్డు కార్యాలయాన్ని రాయలసీమలో ఏర్పాటు చేయకుంటే.. ప్రత్యర్థులకు ప్రచారాస్త్రంగా మారనుంది. ఇటువంటి తరుణంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ప్రత్యర్థులకు అవకాశం ఇస్తారో? లేకుంటే రాయలసీమ రైతులకు ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకుంటారో అన్నది తెలియాల్సి ఉంది.