Andhra Jyothi: ఆంధ్రజ్యోతి రాసిన జగన్ ‘వజ్రాల వాచ్’ లో నిజమెంత?

ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనాన్ని చూసి.. ఆ సంస్థ కార్యాలయంలో పనిచేస్తున్న కొంతమంది జర్నలిస్టులు నొసలు చిట్లించారు. ఆంధ్రజ్యోతి కథనం నిజం కాదని.. అందులో అన్ని అవాస్తవాలు ఉన్నాయని వారిలో వారు చర్చించుకున్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : January 26, 2024 3:57 pm
Follow us on

Andhra Jyothi: జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఏ చిన్న వ్యతిరేక వార్త దొరికినా కూడా ఆంధ్రజ్యోతి కళ్ళకు అద్దుకుని అచ్చేస్తుంది. దానిని విస్తృతంగా ప్రచారం చేస్తుంది. ఏబీఎన్ ఛానల్ లో ఉదయం నుంచి సాయంత్రం దాకా అదే విషయాన్ని చెబుతుంది. ఇక టిడిపి అనుకూల సోషల్ మీడియా గ్రూపులైతే ఆంధ్రజ్యోతి రాసిన వార్తలు విపరీతంగా సర్కులేట్ చేస్తారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్న నాటి నుంచి మొదలుపెడితే జగన్ ముఖ్యమంత్రి గా కొనసాగుతున్న నేటి కాలం వరకు ఆంధ్రజ్యోతి ది జాతి వైరం. చివరికి జగన్ కు వ్యతిరేకమని షర్మిలకు విస్తృతమైన కవరేజ్ అందించేందుకు ఆంధ్రజ్యోతి వెనుకాడటం లేదంటే దాని జర్నలిజం ప్రమాణాలను అర్థం చేసుకోవచ్చు. కాదు షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం.. జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తుండడంతో మరింత సంబరపడుతోంది. పతాకస్థాయి హెడ్ లైన్స్ తో వార్తలు అచ్చేస్తోంది.

అయితే ఇటీవల వజ్రాలు పొదిగిన బంగారు వాచ్ అనే శీర్షికతో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆంధ్రజ్యోతి ఒక వార్త ప్రచురించింది. కోవిటి సమయంలో ఒక జడ్జినిలోపరుచుకునేందుకు జగన్ మోహన్ రెడ్డి తన పార్టీకి సంబంధించిన ఇద్దరు కీలక నాయకులను రంగంలోకి దింపాడని.. రెండు కోట్ల విలువైన వాచ్ ను జడ్జికి అందించాడని.. ఆయనకు చిరాకేసి నేలకు కొట్టాడని.. ఆ తర్వాత సుప్రీంకోర్టు జడ్జికి లేఖ రాశారని.. ఇటీవల వెలుగులోకి వచ్చిందని.. అనే కోణంలో ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది. సహజంగానే ఇలాంటి విషయాలు ఈనాడుకు తెలియవు. తెలిసినా ఈ స్థాయిలో ప్రజెంట్ చేయలేదు. అది దాని దౌర్భాగ్యం. ఇందులో నిజాలు, అబద్ధాలు ఎలా ఉన్నా.. ఆంధ్రజ్యోతి కథనానికి సాక్షి కౌంటర్ ఇవ్వలేకపోయింది. అంటే దాదాపు అది నిజమే అని అనుకోవాల్సి వస్తోంది. అంతేకాదు ఆంధ్రజ్యోతి వార్తను టిడిపి అనుకూల సోషల్ మీడియా గ్రూపులు విపరీతంగా సర్క్యులేట్ చేశాయి. అయితే దీనికి కౌంటర్గా వైసిపి అనుకూల సోషల్ మీడియా గ్రూపులు ఒక వీడియోను విడుదల చేశాయి.

ఆ వీడియోలో ఏముందంటే.. ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనాన్ని చూసి.. ఆ సంస్థ కార్యాలయంలో పనిచేస్తున్న కొంతమంది జర్నలిస్టులు నొసలు చిట్లించారు. ఆంధ్రజ్యోతి కథనం నిజం కాదని.. అందులో అన్ని అవాస్తవాలు ఉన్నాయని వారిలో వారు చర్చించుకున్నారు. అయితే అలా చర్చించుకుంటున్న వ్యక్తుల ముఖాలు బయటపడకపోవడం.. పైగా వారు మాట్లాడుకుంటున్న మాటలు కంటే బ్యాక్ గ్రౌండ్ లో వినిపిస్తున్న మ్యూజిక్ శబ్ద తీవ్రత అధికంగా ఉండటం విశేషం. అయితే దీనిని వైసిపి అనుకూల సోషల్ మీడియా గ్రూపులు విపరీతంగా సర్కులేట్ చేస్తున్నాయి. సరే ఇందులో నిజం ఎంతో అబద్ధం ఎంతో తెలియదు గానీ.. కోర్టు జడ్జికి రెండు కోట్ల విలువైన వాచ్ బహూకరించేందుకు జగన్ మోహన్ రెడ్డి సిద్ధపడ్డాడని రాసిన ఆంధ్రజ్యోతి.. చంద్రబాబుకు గతంలో సహకరించిన లాయర్ల గురించి, ఆయన తన లైన్లో పెట్టుకునేందుకు జడ్జిలకు చేసిన ఎరల గురించి రాయగలదా? దాని దృష్టిలో చంద్రబాబు ఏం చేసినా తెలుగుజాతి ఔన్నత్యం కోసమే.. అదే జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా అక్రమంగా సంపాదించిన ఆస్తులను కాపాడుకోవడం కోసమే.. అంతే.. ఇదే ఆంధ్రజ్యోతి జర్నలిజం ప్రమాణాల స్థాయి. దాని నుంచి అంతకుమించి ఆశించడం కూడా మూర్ఖత్వమే అవుతుంది.