Jagan Kapu Politics: వైఎస్ఆర్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ కాపు నేతల్లో ఒక కొత్త వివాదం ప్రారంభం అయ్యింది. ముద్రగడ పద్మనాభం కు జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యత ఇవ్వడంపై ఇప్పుడు ఆ సామాజిక వర్గం నేతలు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముద్రగడ రాజకీయ నిర్ణయాలు బాగుండవని.. ఆయనను నమ్ముకొని రాజకీయాలు చేయడం అంత మంచిది కాదని వైసీపీ కాపు నేతలు చెబుతున్నారు. ఇటీవల అంబటి రాంబాబు ఎపిసోడ్లో ముద్రగడ పద్మనాభం లేఖ రాయడం పై కాపు నేతలు ఆగ్రహంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కాపు నేతలకు అన్యాయం చేసిందంటూ చెబుతూ ఆయన రాసిన లేఖ కలకలం సృష్టిస్తోంది. అయితే అది కూటమి ప్రభుత్వం కంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే సెగలు రేపినట్లు వార్తలు వచ్చాయి. అనవసరంగా ముద్రగడ పద్మనాభం ను హైలెట్ చేయడం పగదని సొంత పార్టీ నేతలే జగన్మోహన్ రెడ్డి వైఖరిపై ఆగ్రహంగా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది.
పవన్ తిరస్కరించడంతో..
గడిచిన ఎన్నికలకు ముందు ముద్రగడ పద్మనాభం( mudragada Padmanabham ) తన కుమారుడితో కలిసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముందుగా ఆయన జనసేనకు వెళ్తారని ప్రచారం నడిచింది. అయితే ఆయనతో మేలు కంటే కీడు అధికమని పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు సూచించినట్లు వార్తలు వచ్చాయి. అందుకే పవన్ కళ్యాణ్ సైతం వెనక్కి తగ్గారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ముద్రగడ పద్మనాభం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పవన్ కళ్యాణ్ ను ఓడించడంతోపాటు జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేస్తానని శపధం చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడిస్తానని కూడా సవాల్ చేశారు. అలా ఓడించకపోతే తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డి గా మార్చుకుంటానని ప్రకటన చేశారు. అయితే ఆయన మాటలను గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గం అస్సలు పట్టించుకోలేదు. అయితే పవన్ కళ్యాణ్ విషయంలో ముద్రగడ రెచ్చగొట్టిన వ్యాఖ్యలే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కాపులను దూరం చేశాయని ఆ సామాజిక వర్గ నేతలు భావించారు. ఆ ఎన్నికల్లో దారుణ ఓటమి ఎదురైంది. కానీ ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ముద్రగడ పద్మనాభంను ముందు పెట్టి రాజకీయం చేయడం ఏమిటి అనే ప్రశ్న వినిపిస్తోంది.
అవుట్ డేటెడ్ పొలిటీషియన్..
వాస్తవానికి ముద్రగడ పద్మనాభం 1989 లోనే చివరిసారిగా ఎమ్మెల్యేగా అయ్యారు. 1995లో ప్రత్తిపాడు( prathipadu) నియోజకవర్గంలో ఆయన ఓడిపోవడంతో తిరిగి ఆ నియోజకవర్గ వైపు చూడనని తేల్చి చెప్పారు. 2009లో పిఠాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓటమి చవి చూసారు. తరచూ అభిప్రాయాలు మార్చుకోవడం, అన్ని పార్టీల నాయకత్వాలతో విభేదాలు ఏర్పడడం వంటివి ముద్రగడ పద్మనాభం కు మైనస్ గా మారాయి. ఆయన ద్వారా కాపులను ఆకర్షించాలన్న ప్రయత్నం సరి కాదన్నది వైసీపీ నేతల వాదన. తాజాగా అంబటి రాంబాబు ఎపిసోడ్లో ప్రభుత్వానికి ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన హై కమాండ్ ఆదేశాలు లేనిదే లేఖ రాయరు. అటువంటిది వంగవీటి మోహన్ రంగా, ముద్రగడ పద్మనాభం, అంబటి రాంబాబు తదితరులను టిడిపి వేధించిందని లేఖ రాశారు ఘాటుగా. అయితే దీని ద్వారా లాభం కంటే నష్టమే అధికమని.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కాపులు మరింత దూరం జరుగుతారు అన్నది వారి భయం.