Ranganath Controversy: హైడ్రా కమిషనర్ గా రంగనాథ్ హైదరాబాద్ నగరంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. అక్రమార్కుల భరతం పడుతున్నారు. భూకబ్జాదారుల వెన్నులో వణుకు పుట్టేలా చేస్తున్నారు. ప్రభుత్వం ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో.. సమర్థవంతంగా పనిచేస్తున్నారు. అయితే ఇక్కడే ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి.. భారతీయ జనతా పార్టీ ఆయన మీద అక్కసు ప్రదర్శిస్తున్నాయి. అడ్డగోలుగా మాట్లాడుతున్నాయి. ఇక గులాబీ పార్టీ అయితే తన సొంత మీడియాలో పిచ్చిపిచ్చిగా రాతలు రాస్తుంది. చివరికి హైడ్రా రంగనాథ్ ను తప్పించాలని గులాబీ పార్టీ తన సొంత మీడియాలో చిలువలు పలువలుగా కథనాలను రాసింది.
హైడ్రా రంగనాథ్ విషయంలో హైకోర్టు ఎందుకు అంత తీవ్ర వ్యాఖ్యలు చేసింది.. అసలు దీని వెనుక కారణమేంటి.. అనే విషయాలను పరిశీలించినప్పుడు ఆసక్తికరమైన సంగతులు తెలిసాయి.. రంగనాథ్ విషయంలో హైకోర్టు ఆ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడానికి ప్రధాన కారణం లోతుకుంట. ఈ పరిధిలో ఉన్న భూమిలో శాంత శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కార్యకలాపాలు సాగిస్తోంది. అయితే ఇందులోకి హైడ్రా అక్రమంగా ప్రవేశించిందని శాంత శ్రీరాం కంపెనీ నిర్వాహకులు చెబుతున్నారు.
ప్రభుత్వ రికార్డుల ప్రకారం లోతుకుంట గ్రామం పరిధిలో ఉన్న సర్వేనెంబర్ 1, 2 లో ఏకంగా 40 ఎకరాల పట్టా భూమి ఉందని శాంతా కంపెనీ చెబుతోంది. గతంలో ఆ భూమి తమదే అని కోర్టు చెప్పిందని.. శాంత కంపెనీ వాదిస్తోంది. దానికి సంబంధించిన కోర్టు తీర్పు కాపీలను కూడా బయటపెడుతోంది. న్యాయస్థానం తీర్పులు ఇచ్చినప్పటికీ హైడ్రా అందులోకి అక్రమంగా ప్రవేశించిందని.. గతంలో ఇదే విషయాన్ని తమ కోర్టు దృష్టికి తీసుకెళ్లామని.. కోర్టు కూడా అందులోకి హైడ్రా ప్రవేశించకూడదని ఆదేశాలు ఇచ్చిందని.. అయినప్పటికీ ఇప్పుడు హైడ్రా దానిని ఉల్లంఘించి.. తమను ఇబ్బంది పెడుతోందని శాంతా కంపెనీ నిర్వాహకులు చెబుతున్నారు.
శాంతా కంపెనీ నిర్వాహకులు కోర్టుకు వెళ్లడంతో.. కేసును విచారించిన కోర్టు హైడ్రా అధిపతి రంగనాథ్ తీరును తీవ్రంగా తప్పు పట్టింది. మరోవైపు హైడ్రా ఈ విషయంలో ఇచ్చిన క్లారిటీ ఇంకో విధంగా ఉంది..”శాంతా శ్రీరామ్ కంపెనీ చూపిస్తున్న భూమి లోతుకుంట గ్రామంలో ఉన్న 1, 2 సర్వే నెంబర్లలో లేదు. ఆ సంస్థ కోర్టులలో తప్పుడు వివరాలు ఇచ్చింది.. రికార్డుల ప్రకారం తాము అక్రమార్కుల నుంచి కాపాడిన భూమి కంటోన్మెంట్ పరిధిలో జనరల్ ల్యాండ్ రికార్డ్స్ 243లో 119 ఎకరాలు, 255లో 29 ఎకరాలు ఉంది.. శాంతా కంపెనీ చెబుతున్న లోతుకుంట భూమికి.. మేము కాపాడిన భూమికి దాదాపు మూడు కిలోమీటర్ల దూరం ఉంది. కంటోన్మెంట్ ఏరియాలో ఉన్న భూమిలో సహజసిద్ధమైన కొండలు ఉన్నాయి. ఇక్కడ రాత్రిపూట జంతువులు తిరుగుతాయి. అక్కడ బాంబులు పేల్చుతూ ఇబ్బంది కలిగిస్తున్నారు. దీనికి సంబంధించి మాకు సేవ్ రాక్ సొసైటీ.. స్థానికులు ఫిర్యాదు చేశారు. అందువల్ల మేము రంగంలోకి దిగాం. సర్వే నెంబర్ 1, 2 లో ప్రవేట్ భూమిలో లేఔట్ కు శాంత కంపెనీ 2007లో అనుమతులు తెచ్చుకుంది. 2026లో లేఅవుట్ సవరణకు అనుమతి తెచ్చుకుంది. అప్పుడు జిఎల్ఆర్ నెంబర్ 243/పీ, 255/పీ గా చూపించారని” హైడ్రా చెబుతోంది.


