Vizianagaram Political Legacy: తెలుగుదేశం పార్టీతో( Telugu Desam Party) సుదీర్ఘ రాజకీయ బంధాన్ని తెంచుకున్నారు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు. దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా తెలుగుదేశం పార్టీలో కొనసాగారు ఆయన. ఇటీవలే గోవా గవర్నర్ గా నియమితులయ్యారు. రాజ్యాంగబద్ధ పదవిలోకి వెళ్తుండడంతో.. రాజకీయాలకు గుడ్ బై చెప్పాల్సి వచ్చింది. దీంతో విజయనగరం జిల్లాలో టిడిపి శ్రేణుల్లో ఒక రకమైన భావోద్వేగం వ్యక్తం అవుతోంది. ఒకటి కాదు రెండు కాదు.. దాదాపు ఐదు దశాబ్దాలుగా జిల్లా రాజకీయాల్లో చెరగని ముద్రవేశారు అశోక్ గజపతిరాజు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా, కేంద్రమంత్రిగా, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడిగా.. ఇలా పదవులకు వన్నెతెచ్చారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. ఇప్పుడు గవర్నర్ అనే రాజ్యాంగబద్ధ పదవితో శాశ్వతంగా రాజకీయాలనుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. ఈరోజే ఆయన టిడిపి ప్రాథమిక సభ్యత్వానికి, పొలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా రాజీనామా చేశారు.
Also Read: Rajampet MP Mithun Reddy: అజ్ఞాతంలో వైసిపి ఎంపి?
జనతా పార్టీ ద్వారా ఎంట్రీ..
విజయనగరం రాజవంశీయుడిగా ఉన్న అశోక్ గజపతిరాజు( Ashok gajapathi Raju ) తండ్రి పివిజి రాజు రాజకీయ నాయకుడిగా కూడా రాణించారు. ప్రధానంగా సోషలిస్ట్ పార్టీ తరపున ఆయన ప్రాతినిధ్యం వహించారు. అశోక్ గజపతిరాజు సోదరుడు ఆనంద్ గజపతిరాజు ఎమ్మెల్యేగా, ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. అయితే సోదరుడు కాంగ్రెస్ పార్టీలో కూడా రాణించారు. అయితే అశోక్ తొలిసారిగా జనతా పార్టీ నుంచి 1978లో ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అటు తర్వాత నందమూరి తారక రామారావు పిలుపుమేరకు తెలుగుదేశం పార్టీలో చేరారు. అది మొదలు నేటి వరకు ఆయన సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలోనే పనిచేశారు. అయితే తెలుగుదేశం పార్టీ పతనావస్థలో ఉన్న సమయంలో సైతం అదే పార్టీలో కొనసాగిన ఏకైక నాయకుడు అశోక్ గజపతిరాజు. ముఖ్యంగా పార్టీ అధినేతలగా వ్యవహరించిన నందమూరి తారక రామారావు, చంద్రబాబుకు అత్యంత ఇష్టుడైన నేత కూడా. అందుకే తెలుగుదేశం పార్టీలో ఆయనకు పదవులు వెతుక్కుంటూ వచ్చాయి.
Also Read: Rayalaseema Political Strategy: చంద్రబాబు గురి.. రాయలసీమపై భారీ స్కెచ్!
విడదీయరాని బంధం..
విజయనగరం జిల్లాలో( Vijayanagaram district) అశోక్ అంటే టిడిపి.. టిడిపి అంటే అశోక్. సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఏపీవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేసింది. అయితే విజయనగరం జిల్లాకు వచ్చేసరికి మాత్రం అశోక్ గజపతిరాజు బంగ్లా పార్టీ కార్యాలయంగా కొనసాగింది. ఇప్పటికీ కొనసాగుతూ వస్తోంది. 42 సంవత్సరాల పాటు అశోక్ చెప్పు చేతల్లోనే ఉండేది విజయనగరం జిల్లా టిడిపి. సామాన్య కార్యకర్త నుంచి పెద్ద స్థాయి నేత వరకు అందర్నీ పేరు పెట్టి పిలవగలిగే చనువు అశోక్ గజపతిరాజుకు ఉండేది. అశోక్ పట్ల పార్టీ శ్రేణులకు ఆరాధన భావం ఎక్కువ. జిల్లా అభివృద్ధిలో సైతం ఆయన పాత్ర కీలకం. 1983 నుంచి 1999 వరకు ఏకధాటిగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. 2004లో మాత్రం తొలిసారిగా ఓడిపోయారు. తిరిగి 2009లో సైతం బంపర్ మెజారిటీతో గెలిచారు. 2014లో విజయనగరం ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు. 2019లో ఎంపీగా ఓడిపోయి ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. ఇప్పుడు శాశ్వతంగా రాజకీయాలకు దూరమవుతున్నారు. రాజ్యాంగబద్ధ పదవిలోకి వెళ్తున్నారు. ఆయన రాజకీయ నిష్క్రమణను తెలుగుదేశం పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఒకటి రెండు రోజుల్లో ఆయన గోవా గవర్నర్గా నియమితులయ్యే అవకాశం ఉంది.