CM Revanth Reddy: ఏపీ అభివృద్ధి పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు లేవు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నా హర్షించిన దాఖలాలు లేవు. కేంద్ర పెట్టుబడులను స్వాగతించిన పరిస్థితి లేదు. కానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఇక్కడ పెట్టుబడుల గురించి మాట్లాడుతున్నారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుల అనుమతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని చెబుతూ.. మాదాపూర్- జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాలు కలిపినా.. అంత పరిధి లేని విశాఖకు మెట్రో రైలు ప్రాజెక్టు అనుమతి లభించింది అంటూ వ్యాఖ్యానించారు రేవంత్. అయితే తెలంగాణ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని.. ఏపీకి మాత్రం ప్రాధాన్యమిస్తోందని చెప్పేందుకు రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో విశాఖ ప్రాధాన్యత గుర్తించడంలో రేవంత్ విఫలమయ్యారన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.
* గ్రేటర్ విశాఖ పరిధి ఎక్కువ..
ఏదైనా ఒక నగర ప్రాధాన్యతను కేవలం భౌగోళిక విస్తీర్ణం, సైజును బట్టి మాత్రమే అంచనా వేయడం సరికాదు. అది సృష్టిస్తున్న ఆర్థిక వ్యవస్థ, జనాభా ప్రాతినిధ్యం, పారిశ్రామిక బలాన్ని బట్టి చూడాలని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ లెక్కన రేవంత్ రెడ్డి చేసిన ఈ పోలిక సరికాదన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఆయన చెబుతున్నట్టు జూబ్లీహిల్స్, మాదాపూర్ సేరి లింగంపల్లి మండల పరిధిలోని ఐటి కారిడార్ ప్రాంతాలు కలిపినా.. వాటి విస్తీర్ణం కేవలం 45 నుంచి 50 చదరపు కిలోమీటర్ల లోపే ఉంటుంది. కానీ గ్రేటర్ కార్పొరేషన్ పరిధి, నగర విస్తీర్ణమే అక్షరాల 640 చదరపు కిలోమీటర్లు. రేవంత్ పోల్చినట్టు చూస్తే దానికి 12 రెట్లు అదనం అన్నమాట. ఇక విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ పరిధి ఏకంగా 7328 చదరపు కిలోమీటర్లు. ఇలా చూసుకున్న రేవంత్ రెడ్డి అంచనా చాలా తప్పు.
* జాతీయ స్థాయిలో సైతం గుర్తింపు…
మాదాపూర్ తో పాటు జూబ్లీహిల్స్ లో స్థిర నివాసితులు కేవలం మూడు నుంచి నాలుగు లక్షల వరకు మాత్రమే. కానీ 2011 జనాభా లెక్కల ప్రకారం విశాఖపట్నం పరిధిలో 20 లక్షల కుటుంబాలు స్థిర నివాసం ఏర్పాటు చేసుకోగా.. తాజా జనాభా లెక్కల ప్రకారం మరో ఆరు ఏడు లక్షల కుటుంబాలు పెరిగి ఉంటాయి. దేశంలో అత్యధిక జనాభా కలిగిన నగరాల జాబితాలో వైజాగ్ 17వ స్థానంలో నిలిచింది. ఇక భారత దేశంలో సంపన్న నగరాల అధికారిక జాబితాలో విశాఖ స్థానం 10. జిడిపిలో కూడా మంచి స్థానంలోనే ఉంది. ఏపీ మొత్తం జిడిపిలో ఒక్క విశాఖ 23 శాతానికి పైగా కలిగి ఉంది అంటే ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు. అటువంటి విశాఖ నగరం విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఎంత మాత్రం సరికావు అనేది నిపుణుల మాట. హైదరాబాద్ మెట్రో విస్తరణకు అనుమతులు రాకపోవడానికి రాజకీయ నేతలు చేసిన తప్పులు, సాంకేతిక కారణాలే కారణం. ఆ ప్రాజెక్టుతో రాజకీయాలు చేసుకుంటున్నారు. కానీ తమ సోదర రాష్ట్రం రాజకీయంగా సఖ్యతగా మెలుగుతూ ప్రాజెక్టులను సాధిస్తాంది. దానిని గుర్తించాల్సింది పోయి.. ఇతర ప్రాంతాలను కించపరిచేలా మాట్లాడడం మాత్రం సరికాదు. ఈ విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుంటేనే చాలా మంచిది.
