Vijayasai Reddy: విజయసాయి రెడ్డి( Vijaya Sai Reddy ) పొలిటికల్ రీఎంట్రీ ఇస్తారా? తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ అవుతారా? రాజ్యసభ పదవిని తీసుకుంటారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కొద్ది నెలల కిందట ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వం తో పాటు రాజ్యసభ పదవిని సైతం వదులుకున్నారు. ఇకనుంచి రాజకీయాల గురించి మాట్లాడడానికి కూడా తేల్చి చెప్పారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం ఉండదని కూడా చెప్పుకొచ్చారు. వ్యవసాయం చేసుకుంటానని కూడా అన్నారు. అయితే ఈ ప్రకటన వచ్చిన తర్వాత ఫామ్ హౌస్ లో వ్యవసాయం చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే అక్కడ నుంచి తిరిగి రాజకీయాలు మాట్లాడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఢిల్లీ వేదికగా ఆయన పొలిటికల్ ఎంట్రీ పై తెగ ప్రచారం నడుస్తోంది.
Also Read: రాజమండ్రి సెంట్రల్ జైలుకు గోరంట్ల మాధవ్.. అరెస్టు నుంచి వరుస ట్విస్టులు!
* పార్టీలో నెంబర్ 2
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీలో నెంబర్ 2 గా ఎదిగారు విజయసాయిరెడ్డి. పార్టీ ఆవిర్భావానికి ముందే జగన్మోహన్ రెడ్డితో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంటూ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి కేసులో ఏ2 నిందితుడిగా కూడా ఉన్నారు విజయసాయిరెడ్డి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటులో కూడా కీలక పాత్ర పోషించారు. ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు శ్రమించారు. అయితే ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటమి ఎదురు కావడంతో ఉన్నఫలంగా పార్టీకి గుడ్ బై చెప్పారు. రాజ్యసభ పదవిని సైతం వదులుకొని అందర్నీ ఆశ్చర్యపరిచారు. అయితే దీని వెనుక బిజెపి హస్తము ఉందన్నది ఒక ఆరోపణ. బిజెపి తెర వెనుక ఉండి విజయసాయిరెడ్డి ద్వారా ఈ గేమ్ ఆడిందని అప్పట్లోనే ఆరోపణలు వినిపించాయి. అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డి పొలిటికల్ రీఎంట్రీ ఇస్తారన్న ప్రచారం ఢిల్లీ వర్గాల నుంచి వినిపిస్తోంది.
* దక్షిణాదిపై ఫోకస్..
భారతీయ జనతా పార్టీ( Bhartiya Janata Party) జాతీయ అధ్యక్ష పదవి ఈసారి దక్షిణాది రాష్ట్రాలకు ఇవ్వాలని బిజెపి అగ్ర నేతలు ఒక నిర్ణయానికి వచ్చారు. అందులో భాగంగా దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్నారు. పేరు మోసిన ఇతర పార్టీల నేతలను బిజెపిలో చేర్చుకునేందుకు నిర్ణయించారు. అలానే విజయసాయిరెడ్డి ని బిజెపి లోకి తీసుకెళ్లి ఆయన ఖాళీ చేసిన రాజ్యసభ పదవి అప్పగిస్తారని ప్రచారం సాగుతోంది. తద్వారా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్న కీలక నేతలను ఆయన బిజెపిలోకి తెస్తారని ఒక అంచనా వేస్తున్నారు. అతి త్వరలో విజయసాయిరెడ్డి బిజెపిలో చేరడం ఖాయమని జోరుగా ప్రచారం సాగుతోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.
* కోటరీ పై సంచలన ఆరోపణలు..
ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు అధినేత జగన్మోహన్ రెడ్డికి ( Jagan Mohan Reddy)వ్యతిరేకంగా మాట్లాడారు విజయసాయిరెడ్డి. జగన్ చుట్టూ ఉన్న కోటరీ వల్లే తాను పార్టీకి దూరమయ్యానని చెప్పుకొచ్చారు. వైసిపి హయాంలో అవినీతి జరిగిందని.. మద్యం కుంభకోణానికి సంబంధించి ఆధారాలు తన వద్ద ఉన్నాయని.. అవసరం అనుకుంటే తాను మరోసారి విచారణకు హాజరవుతానంటూ తిరిగి సిఐడి కి ఆఫర్ చేశారు విజయసాయిరెడ్డి. తనపై ఉన్న కేసుల దృష్ట్యా విజయసాయిరెడ్డి సైతం బిజెపిలో చేరేందుకు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.