Vidadala Rajini
Vidadala Rajini: మాజీ మంత్రి విడదల రజిని( vedatala Rajini ) చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. మంత్రిగా ఉన్నప్పుడు బెదిరింపులకు దిగి వసూళ్లకు పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి. దానిపై తాజాగా ఏసీబీ కేసు నమోదు చేసింది. అరెస్టుకు రంగం సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న రజిని దూకుడుగా ఉండేవారు. చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. ఈ క్రమంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె సైలెంట్ అయ్యారు. ఒకానొక దశలో ఆమె జనసేనలో చేరుతారని ప్రచారం జరిగింది. కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది. అయితే ఆమె మంత్రిగా ఉన్నప్పుడు పల్నాడు జిల్లా ఎడ్లపాడు లోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానిని విజిలెన్స్ తనిఖీల పేరుతో బెదిరించారన్నది ప్రధాన ఆరోపణ. దాదాపు రూ. 2.02 కోట్లు వసూలు చేశారని ఆరోపణలతో ఆమెపై కేసు నమోదు అయ్యింది. దీంతో కేసు నమోదు చేసిన ఏసీబీ రంగంలోకి దిగినట్లు సమాచారం.
Also Read: వివేకానంద రెడ్డి ‘హత్య’ పై తాజాగా ఫిర్యాదు!
* అప్పటి అధికారులపై..
గత కొద్ది రోజులుగా ఆమెపై ఈ ఆరోపణలు ప్రధానంగా వినిపించాయి. కానీ ఇప్పుడు ఏకంగా కేసు నమోదు అయ్యింది. ఆమెతో పాటు గుంటూరు ఆర్విఈఓ, ఐపీఎస్ అధికారి పల్లె జాషువాతో ( Palle Joshua )సహా మరికొందరిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. లంచం తీసుకోవడం, ఆయాచిత లబ్ది కలిగించడం, నేరపూరిత కుట్ర, బెదిరింపు తదితర చర్యలు అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్లను చేర్చుతూ కేసులు నమోదయ్యాయి. కాగా ఈ కేసులో ఏ1గా విడదల రజిని, ఏ2గా ఐపీఎస్ పల్లె జాషువా, ఏ3గా విడదల రజిని మరిది గోపి, ఏ 4 గా రజనీ పిఏ దొడ్డ రామకృష్ణ లపై కేసు నమోదు అయ్యింది.
Also Read: వివేకానంద రెడ్డి ‘హత్య’ పై తాజాగా ఫిర్యాదు!
* ముందుగా విజిలెన్స్ కు ఫిర్యాదు
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కు( Vigilance and enforcement) ఫిర్యాదు వచ్చింది. దీంతో అప్పటి ఏసీబీ డీజీగా ఉన్న హరీష్ కుమార్ గుప్తా విచారణ చేపట్టి నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. ఆయన సిఫార్సు మేరకు ఏసీబీ విచారణకు సర్కారు ఆదేశించింది. దీంతో ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ ప్రాథమిక దర్యాప్తులో ఆధారాలు లభించడంతో కేసులు నమోదు చేశారు.
* యజమానులను బెదిరించి
పల్నాడు జిల్లా( Palnadu district ) ఎడ్లపాడు మండలం విశ్వనాధుని కండ్రిక గ్రామంలో శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ ను నిర్వహిస్తున్నారు. వాటి యజమానులను పిలిపించిన అప్పటి మంత్రి రజిని.. విజిలెన్స్ దాడులు జరగకుండా ఉండాలంటే అడిగినంత డబ్బులు ఇవ్వాల్సిందేనని బెదిరించారు. ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేశారన్నది ప్రధాన ఆరోపణ. నాటి గుంటూరు రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి పల్లె జాషువా తనిఖీల పేరుతో హడావిడి చేశారని.. ఎవరు ఫిర్యాదు చేయకుండానే అక్కడకు వెళ్లారనేది ప్రధాన ఆరోపణ. ఆ దాడుల భయంతోనే సంబంధిత యజమానులు రెండు కోట్ల రెండు లక్షలు చెల్లించారని.. ఐపీఎస్ అధికారి జాషువాకు పది లక్షల రూపాయలు ముట్టిందన్నది ప్రధాన ఆరోపణ. దీనిపైన ఫిర్యాదులు రావడంతో ఏసీబీ రంగంలోకి దిగింది.