Pawan Kalyan
Pawan Kalyan: తెలుగు వారి దృష్టిని ఆకర్షించింది పిఠాపురం నియోజకవర్గం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడమే అందుకు కారణం. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు స్థానాల్లో పవన్ కళ్యాణ్ ఓడిపోయారు. అప్పటినుంచి అవమానభారాన్ని మోస్తున్నారు. వైసిపి నేతల చీత్కారాలను భరించారు. అందుకే ఈసారి గట్టిగా కొట్టాలని నిర్ణయం తీసుకున్నారు. పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. పవన్ ఎమ్మెల్యేగా చూడాలని ఆయన అభిమానులు, సగటు జన సైనికులు తహతహలాడుతూ వచ్చారు. ఒక రాజకీయ పార్టీ అధినేతగా కూటమి తరుపున పవన్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తే.. ఆయన తరుపున ప్రచారానికి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ముందుకొచ్చారు. విజయవంతంగా పూర్తి చేశారు.
ముందుగా గుర్తించుకోవాల్సింది మాజీ ఎమ్మెల్యే వర్మ త్యాగం. పవన్ కోసం తాను గెలిచిన సీటు వదులుకున్నారు వర్మ. అదే పవన్ కోసం తమ విలువైన సమయాన్ని వదులుకొని ప్రచారం చేశారు బుల్లితెర నటులు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. జబర్దస్త్ టీం నుంచి గెటప్ శీను, హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, రాజు… బుల్లితెర నటులు శ్రవణ్, సహస్రనాయుడు, పూజా మూర్తి వంటి అనేకమంది తమ బిజీ షెడ్యూల్ ను మార్చుకొని మరి పిఠాపురంలో ప్రచారం చేశారు. పార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్, నిర్మాత నాగ వంశీ, మెగా హీరోలు సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ తేజ్, జానీ మాస్టర్, క్రికెటర్ అంబటి రాయుడు వంటి వారు ఎండను సైతం లెక్కచేయకుండా పిఠాపురంలో ప్రచారం చేశారు.
కేవలం పవన్ కళ్యాణ్ ను అవమాన భారం నుండి దూరం చేసేందుకు వారంతా అహర్నిశలు శ్రమించారు. ఇప్పటికే పిఠాపురంలో పవన్ గెలుపు దాదాపు ఖాయమైంది. కేవలం మెజారిటీ మీదే అందరి దృష్టి ఉంది. అటు వైసీపీ సైతం పిఠాపురం పై ఆశలు వదులుకుంది. టిడిపి ఇన్చార్జ్ వర్మ అయితే ఒక అడుగు ముందుకు వేసి వార్ వన్ సైడేనని తేల్చేశారు. జూన్ 4న కేవలం మెజారిటీ మాత్రమే చూడాలని పవన్ అభిమానులకు కిక్ ఎక్కించే ప్రయత్నం చేశారు వర్మ. పిఠాపురంలో పవన్ గెలుపు వెనుక వర్మ త్యాగం, నటీనటుల కష్టం దాగి ఉందన్న విషయాన్ని జనసేన గుర్తుంచుకోవాలి. వారి నిస్వార్థ సేవను గుర్తించి పవన్ ఉదారంగా వ్యవహరించాల్సి ఉంది. మరి పవన్ వారి రుణం ఎలా తీర్చుకుంటారో చూడాలి.