Vangaveeti Radha Krishna: తెలుగుదేశం పార్టీ నాయకత్వం గతంలా వ్యవహరించడం లేదు. కాస్త దూకుడుగానే నిర్ణయాలు తీసుకుంటోంది. గతం మాదిరిగా ఉపేక్షిస్తే రాజకీయపరంగా ఇబ్బందులు తప్పవని భావిస్తోంది. అందుకే వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. నిత్యం ప్రభుత్వం పై విమర్శలు చేసే అంబటి రాంబాబుతో వేదిక పంచుకున్నారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. అదే బోండా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పై ఓ రేంజ్ లో విరుచుకుపడేవారు. అయితే ఆయన సడన్ గా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో వేదిక పంచుకోవడం వెనుక బలమైన కారణం ఉంది. మంత్రి పదవి కోసమే ఆయన ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చేందుకు ఈ మార్గం ఎంచుకున్నారని అర్థం అవుతోంది. అయితే దీనిని సహించలేదు టీడీపీ హై కమాండ్. వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీనిపై సమాధానం చెప్పాలని కోరింది. అయితే బోండా ఉమామహేశ్వరరావు మరో అడుగు ముందుకు వేస్తే మాత్రం టిడిపి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని దింపే అవకాశం ఉంది.
* రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపు..
ఒక సాధారణ నేతగా ఉన్న బోండా ఉమామహేశ్వరరావుకు 2014లో విజయవాడ సెంట్రల్ సీటు ఇచ్చింది టిడిపి హై కమాండ్. ఆ ఎన్నికల్లో బోండా ఉమామహేశ్వరరావు పోటీ చేసి మంచి మెజారిటీతో గెలిచారు. సీఎం చంద్రబాబు తో పాటు మంత్రి నారా లోకేష్ కు దగ్గరయ్యారు. అమరావతి రాజధాని కి దగ్గరగా ఉన్న విజయవాడలో.. కీలక నియోజకవర్గంలో ఉమామహేశ్వరరావు గెలవడంతో ఆయనకు ఎంతగానో ప్రాధాన్యం ఇచ్చారు. 2019లో రెండోసారి టిక్కెట్ ఇవ్వగా ఆయన ఓడిపోయారు. అయినా సరే టిడిపి నాయకత్వం పట్ల విధేయత ప్రదర్శిస్తూ.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడేవారు. బహుశా ఆ నమ్మకంతోనే 2024 ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి దక్కుతుందని అంచనా వేసుకున్నారు.. కానీ వివిధ సమీకరణలో అది సాధ్యం కాలేదు. అప్పటినుంచి ప్రభుత్వంపై ఓ రకమైన చిన్నపాటి అసంతృప్తితో వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతటితో బోండా ఉమా ఆగిపోతే పర్వాలేదు. లేకుంటే మాత్రం ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని టిడిపి హై కమాండ్ ప్రోత్సహించే అవకాశం ఉంది.
* ఆ నియోజకవర్గ టికెట్ ఇవ్వలేదని..
ప్రస్తుతం వంగవీటి మోహన్ రంగా కుమారుడు రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నారు. ఆయనది విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం. ఆ నియోజకవర్గ టికెట్ ఇవ్వలేదని భావించి జగన్మోహన్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరిపోయారు రాధాకృష్ణ. గత రెండు ఎన్నికల్లో టిడిపి గెలుపు కోసం కృషి చేశారు. అయితే ఇప్పుడు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు టిడిపి హై కమాండ్ ఆగ్రహానికి గురయ్యారు. ఒకవేళ టిడిపి అధిష్టానంతో ఆయన సర్దుబాటు చేసుకుంటే పర్వాలేదు.. లేకుంటే మాత్రం వంగవీటి రాధాకృష్ణను టిడిపి ప్రయోగించే అవకాశం ఉంది. త్వరలో వంగవీటి రాధాకృష్ణకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో పాటు మంత్రిగా అవకాశం ఇస్తారని ప్రచారం నడుస్తోంది. అందుకే బోండా ఉమామహేశ్వరరావు లో ఒక రకమైన అభద్రతాభావంతోనే ఇలా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. అయితే బోండా ఉమా లైన్ దాటితే మాత్రం వంగవీటి రాధాకృష్ణను ప్రయోగించడం ఖాయం.


