TDP MLA: తెలుగుదేశం పార్టీకి వీర విధేయులైన నేతలు చాలామంది ఉన్నారు. పార్టీ కష్టకాలంలో సైతం వెన్నంటి నడిచిన వారు చాలామంది ఉన్నారు. అటువంటి వారిలో బోండా ఉమామహేశ్వరరావు ఒకరు. విజయవాడకు చెందిన ఈ టిడిపి నేత పార్టీతో పాటు నాయకత్వానికి చాలా విధేయత గా ఉంటారు. అయితే ఇటీవల టిడిపి నాయకత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. మొన్న ఆ మధ్యన మంత్రి పదవి ఇవ్వకపోవడం పై అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా కాపు అంశంపై మాట్లాడుతూ.. ముద్రగడ పద్మనాభంను ఆకాశానికి తీశారు. ఆయనను తేలిగ్గా తీసుకోవడం వల్లే 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే బోండా ఉమామహేశ్వరరావు కామెంట్స్ పై భిన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
మంత్రి పదవి రాకపోవడంతో..
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి మొన్నటి ఎన్నికల్లో గెలిచారు బోండా ఉమామహేశ్వరరావు. కాపుల కోటాలో తనకు మంత్రి పదవి వస్తుందని ఎంతగానో ఆశలు పెట్టుకున్నారు. అయితే వివిధ సమీకరణలో అది వీలు కాలేదు. చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వలేకపోయారు. అయితే బోండా ఉమామహేశ్వరరావు మాత్రం పార్టీతో పాటు నాయకత్వంపై విధేయతతోనే వ్యవహరిస్తూ వచ్చారు. కానీ ఇటీవల ఆయన వైఖరిలో మార్పు కనిపిస్తోంది. మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తి, కాపుల అంశం వంటి వాటిపై బాహటంగానే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏకంగా ముద్రగడ పద్మనాభం సేవలను కొనియాడడమే కాదు.. ఆయనను టిడిపి నిర్లక్ష్యం చేసిందని వ్యాఖ్యానించడం మాత్రం హాట్ టాపిక్ అవుతుంది. పార్టీని ఇరకాటంలో పెట్టేలా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతుండడంపై మాత్రం కూటమి పార్టీలో కొత్త చర్చ నడుస్తోంది.
వైసీపీ నేతలతో..
గుంటూరులో ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభ జరిగింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా హాజరయ్యారు. ఆయన సమక్షంలోనే బోండా ఉమామహేశ్వరరావు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం విశేషం. ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో సైతం ఆయన ఎక్కువగా కనిపిస్తున్నారు. త్వరలో కాపుల ఆత్మీయ సభ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పుకొస్తున్నారు. అయితే చంద్రబాబుతో పాటు లోకేష్ విషయంలో బోండా ఉమామహేశ్వరరావు కు చెడిందా? అనే అనుమానం కలుగుతోంది. అయితే బోండా ఉమామహేశ్వరరావు పార్టీ లైన్ దాటి ఎక్కడా వ్యవహరించలేదని టిడిపిలోనే ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి అయితే టిడిపిలో ఇప్పుడు బోండా ఉమామహేశ్వరరావు కామెంట్స్ పెద్ద కలకలమే సృష్టిస్తున్నాయి.


