Roja: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి రోజా అరెస్టు అయ్యే అవకాశం ఉంది. ఆమెకు తాజాగా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 30న విచారణకు హాజరుకావాలని కోరారు. గత కొద్ది రోజులుగా రోజా పొలిటికల్ యాక్టివిటీస్ ను తగ్గించారు. రాష్ట్రానికి దూరంగా ఉన్నారు. కేసులకు భయపడి ఆమె దూరంగా ఉంటున్నట్లు ప్రచారం నడిచింది. సరిగ్గా ఇదే సమయంలో ఇప్పుడు పోలీసుల నుంచి ఆమెకు నోటీసులు అందాయి. విచారణకు హాజరు కాకుంటే మాత్రం అరెస్టు ఖాయమని తెలుస్తోంది. ఆ విషయాన్ని పోలీసులు సైతం ఆమెకు వివరించినట్లు సమాచారం. గత కొంతకాలంగా చెన్నైలో ఉంటున్న ఆమె నగిరికి రాగా పాత కేసులో పోలీసులు నోటీసులు జారీ చేయడం విశేషం.
* అవినీతి ఆరోపణలు..
వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో రోజా మంత్రిగా వ్యవహరించారు. పర్యాటకశాఖ తోపాటు క్రీడల మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు నిర్వహించారు. అయితే ఈ క్రీడల నిర్వహణలో భారీగా అవినీతికి పాల్పడ్డారు అనేది ఆమెపై ఉన్న ప్రధాన ఆరోపణ. దాదాపు 100 కోట్ల రూపాయల వరకు అవినీతికి పాల్పడ్డారని విజిలెన్స్ గుర్తించింది. ప్రభుత్వానికి నివేదించింది. ఈ నేపథ్యంలో ఆమె అరెస్టు ఉంటుందన్న ప్రచారం జరిగింది. గత కొద్ది కాలంగా ఆమె రాజకీయాలను తగ్గించడంతో ఈ అనుమానాలకు బలం చేకూరింది. అరెస్టు భయంతోనే ఆమె మౌనంగా ఉన్నారని ప్రచారం నడిచింది. కానీ ఇప్పుడు పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే అది ఆడుదాం ఆంధ్ర అవినీతికి సంబంధించింది కాదు. కొద్దిరోజుల కిందట జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓ పత్రికలో వచ్చిన కథనాలను నిరసిస్తూ.. ప్రతులను దహనం చేశారు. ఆ కేసులోనే ఇప్పుడు రోజా నోటీసులు అందుకున్నారు.
* రాజకీయాలకు దూరం అవుతారని..
ఏపీ రాజకీయాలకు రోజా గుడ్ బై చెబుతారని ఇటీవల ప్రచారం నడిచింది. రాజకీయంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆమెకు అవకాశాలు తగ్గిస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో నగిరి నుంచి బీసీ అభ్యర్థిని రంగంలోకి దించుతారని కూడా టాక్ నడుస్తోంది. ఇంకోవైపు గత ప్రభుత్వ హయాంలో తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై.. కూటమి ప్రభుత్వం కేసులతో ఉచ్చుబిగుస్తుందని అనుమానాలు ఉన్నాయి. అందుకే ఏపీ రాజకీయాలకు గుడ్ బై చెప్పి.. తమిళ చిత్ర పరిశ్రమతో పాటు బుల్లితెరపై మళ్లీ బిజీ కావాలని రోజా నిర్ణయించుకున్నట్లు ఆ మధ్యన ప్రచారం జరిగింది. ఆమె నటించిన తమిళ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమైనట్లు కూడా తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఓ పత్రిక ప్రతుల దహనం కేసులో ఆమెకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కాకపోతే అరెస్టు చేస్తామని హెచ్చరించినట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..


