Vallabhaneni Vamsi : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్( Vamsi Mohan) ఆరోగ్యం క్షీణించింది. ప్రస్తుతం విజయవాడ సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా వల్లభనేని వంశీ ఉన్నారు. గత కొద్దిరోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో అధికారులు హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొద్ది నెలల కిందట వల్లభ నేని వంశీ మోహన్ అరెస్టయిన సంగతి తెలిసిందే. ఆయన బెయిల్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ న్యాయస్థానాల్లో ఊరట దక్కడం లేదు. దాదాపు రెండు నెలలకు పైగా ఆయన జైలులోనే గడుపుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా ఆరోగ్యం క్షీణించడంతో జైలు అధికారులు స్పందించి ఆసుపత్రికి తరలించారు.
Also Read : కొత్త కార్డుల జారీపై కీలక అప్డేట్.. జూన్ 30 వరకు గడువు!
* గత కొద్ది రోజులుగా అనారోగ్యం..
వల్లభనేని వంశీ మోహన్ గత కొన్ని రోజులుగా నడుము నొప్పి, కాళ్ల వాపుతో బాధపడుతున్నట్లు సమాచారం. సమస్యలు తీవ్రం కావడంతో డాక్టర్లు గుండె సంబంధిత పరీక్షలు, రక్త పరీక్షలు చేశారు. రెండు గంటలపాటు వివిధ వైద్య పరీక్షల అనంతరం తిరిగి జైలుకు తరలించారు. దాదాపు రెండు నెలల నుంచి వల్లభనేని వంశీ మోహన్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. టిడిపి కార్యాలయంలో( Telugu Desam Party office ) పనిచేసే సత్య వర్ధన్ కిడ్నాప్ ఆరోపణలపై.. వల్లభనేని వంశీ మోహన్ ను ఏపీ పోలీసులు హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టు రిమాండ్ విధించింది. అప్పటినుంచి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. వల్లభనేని వంశీ మోహన్ పై కేసుల మీద కేసులు నమోదవుతుండడంతో ఆయన ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. తీవ్ర భక్తుడికి గురైన ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం.
* రెండు నెలలకు పైగా జైల్లో..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) హయాంలో వల్లభనేని వంశీ మోహన్ దూకుడుగా ఉండేవారు. టిడిపి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు. ఈ క్రమంలో చంద్రబాబుతో పాటు లోకేష్ పై నిత్యం అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. 2023 ఫిబ్రవరిలో గన్నవరం టిడిపి ఆఫీస్ పై దాడి చేసి కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. అక్కడున్న వాహనాలను సైతం తగలబెట్టారు. ఆ సమయంలోనే పార్టీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న సత్య వర్ధన్ ను కులం పేరుతో వంశి దూషించారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపైనే వంశీ మోహన్ పై కేసు నమోదయింది. శుక్రవారం హైకోర్టు ఆయన బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది. సత్య వర్ధన్ కిడ్నాప్ వ్యవహారంలో వల్లభనేని వంశీ పాత్ర ఉన్నట్లు ప్రాథమికంగా ఆధారాలు ఉన్నాయని అభిప్రాయపడింది.
* ఆందోళనలో కుటుంబ సభ్యులు..
వల్లభనేని వంశీ మోహన్ అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. రెండు నెలలకు పైగా జైల్లో ఉండి పోవడంతో వారిలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. మరోవైపు బెయిల్ పిటిషన్లు రద్దు చేయడం, కోర్టుల్లో సానుకూల తీర్పులు రాకపోవడంతో కుటుంబ సభ్యులు బాధతో ఉన్నారు. ఇటువంటి సమయంలోనే అనారోగ్యానికి గురికావడం కూడా వారిని కలవరపాటుకు గురిచేస్తోంది.