AP Politics: ఏపీలో మరో కూటమి తెరపైకి వచ్చింది. ఇప్పటికే తెలుగుదేశం, జనసేన,బిజెపిలు ఏకతాటి పైకి వచ్చాయి. ఇప్పుడు కాంగ్రెస్ తో పాటు వామపక్షాలు ఒక కూటమిగా అవతరించాయి. ఎన్డిఏలో జనసేన భాగస్వామ్య పక్షంగా ఉంది. ఇప్పుడు కొత్తగా టిడిపి చేరనుంది. మరోవైపు జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో కాంగ్రెస్ తో పాటు వామపక్షాలు ఉన్నాయి. ఏపీలో సైతం ఈ రెండు కూటమిలు బరిలో దిగనున్నాయి. అయితే ఈ రెండు కూటమిలకు ఉమ్మడి శత్రువు వైసిపి. జగన్ ను ఎలాగైనా గద్దె దించాలని అటు టిడిపి, జనసేన.. ఇటు కాంగ్రెస్ తో పాటు వామపక్షాలు భావిస్తుండడం విశేషం. జాతీయస్థాయిలో ఎన్డీఏ, ఇండియా కూటమిలు ప్రత్యర్థులు అయినా.. ఏపీలో మాత్రం ఆ రెండు కూటములు నేరుగా.. ప్రత్యర్థులు కాకపోవడం అంతకంటే విశేషం.
జనసేనతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంది. ఇప్పుడు బిజెపి విషయం తేలనుంది. దాదాపు ఆ మూడు పార్టీల మధ్య పొత్తు, సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ బిజెపి రాకుంటే టీడీపీ, జనసేన కూటమిలోకి ప్రవేశించాలని వామపక్షాలు భావించాయి. జాతీయస్థాయిలో ఇండియా కూటమిలోకి టిడిపి, జనసేన ఎంట్రీ ఇస్తే కాంగ్రెస్ సైతం ఏపీలో ఆ రెండు పార్టీలతో జతకట్టే అవకాశం ఉండేది. కానీ బిజెపి ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. కాంగ్రెస్ తో వామపక్షాలు జతకట్టాయి. దీంతో ఏపీలో కూడా ఇండియా కూటమి తెరపైకి వచ్చింది. దీంతో త్రిముఖ పో రు తప్పదు. ఎన్డీఏ, ఇండియా కూటమి, వైసీపీల మధ్య ఎన్నికల్లో పోటీ ఉండనుంది. అయితే ప్రధానంగా ఎన్డీఏ వర్సెస్ వైసీపీ అన్న రీతిలో ఫైట్ నడుస్తుంది. అటు కాంగ్రెస్ పార్టీ సైతం ఓటు శాతం పెంచుకుంటే అది వైసీపీకి దెబ్బ కానుంది. ఒకవేళ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే మాత్రం ముమ్మాటికి అది టిడిపి, జనసేన, బిజెపిల కూటమి విజయానికి గండి కొట్టే అవకాశం ఉంటుంది.
మరోవైపు ఏపీలో ఇండియా కూటమి ఏర్పాటుకు ఒక ముందడుగు పడింది. విజయవాడలో పార్టీ కార్యాలయంలో షర్మిల తో వామపక్షాల నేతలు సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లో పొత్తు, సీట్ల సర్దుబాటు పై చర్చించారు. ఇప్పటికే జాతీయస్థాయిలో ఇండియా కూటమిలో కాంగ్రెస్, వామపక్షాలు ఉండడంతో ఏపీలో పొత్తు ఖాయం అయినట్టే. త్వరలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని షర్మిల ప్రకటించారు. రాజధాని లేని రాష్ట్రం గా ఏపీని జగన్ నిలిపారని.. ఎక్కువమంది ఎంపీలను ఇస్తే బిజెపి మెడలు వంచి విభజన హామీలు సాధిస్తానని ఎన్నికల్లో చెప్పుకొచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. మొత్తానికైతే ఇండియా కూటమి ఎంట్రీ తో ఏపీలో త్రిముఖ పోరు ఖాయమని తేలింది.