Ganta Srinivasa Rao: చంద్రబాబును ధిక్కరిస్తున్న గంటా.. సంగతేంటి?

గడిచిన నాలుగు ఎన్నికల్లో.. నాలుగు నియోజకవర్గాల నుంచి గంటా శ్రీనివాసరావు పోటీ చేసి గెలుపొందారు. గత ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

Written By: Dharma, Updated On : February 24, 2024 10:59 am
Follow us on

Ganta Srinivasa Rao: మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీ మారుతారా? టిడిపి ఆయనకు టికెట్ ఇవ్వడం లేదా? విశాఖలో సర్దుబాటు చేసేందుకు వీలు లేదా? అందుకే వేరే జిల్లాలో సీటు చూపిస్తుందా? అందుకు గంటా శ్రీనివాసరావు విముఖంగా ఉన్నారా? అవసరమైతే పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో గత రెండు రోజులుగా ఇదే చర్చ నడుస్తోంది. గంటాకు విశాఖలో టిక్కెట్ లేదని చంద్రబాబు తేల్చేశారని.. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని సూచించారని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై గంటా స్పందించారు. నిజమేనని అర్థం వచ్చేలా మాట్లాడారు. కానీ పార్టీ నిర్ణయానికి మాత్రం తిరస్కరించినట్లు తెలుస్తోంది.

గడిచిన నాలుగు ఎన్నికల్లో.. నాలుగు నియోజకవర్గాల నుంచి గంటా శ్రీనివాసరావు పోటీ చేసి గెలుపొందారు. గత ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈసారి కూడా ఆయన సేఫ్ నియోజకవర్గాన్ని ఎంపిక చేసే పనిలో పడ్డారు. కానీ గతం మాదిరిగా అంత ఈజీ అయ్యే పని కాదు. విశాఖలో 15 నియోజకవర్గాలకు గాను పొత్తులో భాగంగా టిడిపి కనీసం ఐదు స్థానాలను వదులుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మిగిలేది పది నియోజకవర్గాలే. అందులో రిజర్వుడు నియోజకవర్గాలు ఉన్నాయి . మిగిలిన కొద్దిపాటి నియోజకవర్గాల్లో కీలక నేతలు మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వారు గత ఐదు సంవత్సరాలుగా పనిచేసుకుపోతున్నారు. అందుకే ఈసారి గంటాను విశాఖ నుంచి సర్దుబాటు చేయడం కష్టంగా తేలుతోంది. అయితే తరచూ నియోజకవర్గాలను మారే గంటాకు ఎక్కడైతే ఏమవుతుందని చంద్రబాబు భావించినట్టు ఉన్నారు. అందుకే విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గాన్ని కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది.

చీపురుపల్లి నియోజకవర్గం నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకవేళ గంటా పోటీ చేస్తే అక్కడ గట్టి ఫైట్ ఉంటుంది. కానీ గెలుపు పై నమ్మకం లేదు. అందుకే గంటా శ్రీనివాసరావు పునరాలోచనలో పడ్డారు. చీపురుపల్లి నుంచి పోటీ చేసే ఉద్దేశం లేదని తేల్చి చెప్పారు. విశాఖకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న నియోజకవర్గంలో తనను పోటీ చేయమని చెప్పడం ఏమిటని గంటా గోల చేస్తున్నారు. కానీ ఖచ్చితమైన నియోజకవర్గంలో నుంచి పోటీ చేస్తానని మాత్రం చెప్పలేకపోతున్నారు. అటు చంద్రబాబు సైతం వ్యూహాత్మకంగా గంటాను ఇరుకున పెడుతున్నట్లు తెలుస్తోంది. అయితే గంటా సైతం తాను చీపురుపల్లి నుంచి పోటీ చేయలేనని ధిక్కారస్వరం వినిపిస్తున్నారు.

మరోవైపు గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆయన భీమిలి నియోజకవర్గాన్ని కోరుకుంటున్నారు. భీమిలికి వైసీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు వ్యతిరేకత ఉన్నట్టు సర్వేలో తేలింది. గతంలో గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి వస్తామంటే అడ్డుకున్నది ముత్తం శెట్టి శ్రీనివాస రావే. ఒకవేళ కానీ వైసీపీ ప్రయత్నిస్తే గంటా శ్రీనివాసరావు ఆలోచన చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇటీవల గంటా శ్రీనివాసరావు టిడిపిలో యాక్టివ్ గా పని చేస్తున్నారు. ఈ సమయంలో ఆయన పార్టీ మారే సాహసం చేయరని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.