TV9 Rajinikanth – YCP : టీవీ9 రజినీ లెక్కలు : ఏపీలో అధికారం వీరిదేనట?

అంటే గురు శిష్యులు పార్టీలుగా విడిపోయారన్నమాట.. ఇంతకీ గురు శిష్యులు చెప్పిన జోస్యం లో ఎవరికి అధికారం దక్కుతుందో, ఎవరికి ప్రతిపక్ష స్థానం లభిస్తుందో జూన్ 4న తేలనుంది.

Written By: NARESH, Updated On : May 16, 2024 9:19 am

TV9 Rajinikanth Analysis

Follow us on

TV9 Rajinikanth – YCP : ఏపీలో ఎన్నికలు ముగిశాయి. జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇప్పటివరకయితే అధికారంలోకి వస్తామని అటు కూటమి, ఇటు వైసిపి పోటాపోటీగా ప్రకటనలు చేస్తున్నాయి. ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆర్టీవీ అధినేత రవి ప్రకాష్ ముందుగానే సర్వే పేరుతో సంచలమైన విషయాలను వెల్లడించారు. ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో కూటమి పార్టీ అధికారాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రకటించారు.. రవి ప్రకాష్ సర్వే పట్ల టిడిపి నాయకులు సంతృప్తి వ్యక్తం చేస్తే.. వైసిపి నాయకులు విమర్శలు మొదలు పెట్టారు.. సరే జర్నలిజం అనేది అందర్నీ సంతృప్తి పరచదు కాబట్టి.. రవి ప్రకాష్ సర్వేను అలా వదిలేస్తే.. ఏపీలో ఎన్నికలు జరిగిన తర్వాత టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ తెరపైకి సంచలనమైన విషయాన్ని వెల్లడించారు. ఇంతకీ ఆయన ఏం చెప్పారంటే..

ఏపీలో పోలింగ్ సరళి రాజకీయ పార్టీలకే కాదు పెద్ద పెద్ద విశ్లేషకులకు కూడా అంతుపట్టలేదు. ఒకానొక సందర్భంలో పోలింగ్ శాతం తగ్గుతుందని అందరికీ అంచనాలు ఉండేవి. ఆ తర్వాత ఊహించని స్థాయిలో పోలింగ్ శాతం పెరిగింది. ఓట్లు వేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి భారీగా ఓటర్లు వచ్చారు. స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొన్ని ప్రాంతాలలో వివాదాలు, ఘర్షణలు, దాడులు, ప్రతి దాడులు, ఈవీఎం ల ధ్వంసం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. అయినప్పటికీ ఎక్కడ కూడా రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం రాలేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అయితే పెరిగిన ఈ పోలింగ్ శాతం అటు అధికార పార్టీని, ఇటు ప్రతిపక్ష పార్టీని ఆలోచనలో పడేసింది. పైకి ఎవరికివారు అధికారంలోకి వస్తామని చెప్తున్నారు గానీ.. కచ్చితంగా మేమే వస్తామని మాత్రం అనలేకపోతున్నారు..

ఏపీలో పెరిగిన పోలింగ్ అధికార పార్టీకి అనుకూలంగా మారిందట. కచ్చితంగా వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందట. గతంలో మాదిరి బంపర్ మెజారిటీ కాకపోయినప్పటికీ.. దరిదాపు 100కు పైగా సీట్లను వైసీపీ గెలుచుకుంటుందట. ఈ మాట అన్నది ఎవరో కాదు.. టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్. “ఆంధ్రప్రదేశ్లో ఈసారి పోలింగ్ శాతం పెరిగింది. గ్రామీణ ప్రాంత ఓటర్లు వైసిపికి అనుకూలంగా ఉన్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం 100కు పైగా సీట్లల్లో వైసిపి గెలుస్తుంది. జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారని” రజనీకాంత్ వ్యాఖ్యానించారు. రజనీకాంత్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో.. విమర్శలు వ్యక్తమవుతున్నాయి.. జగన్ ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత ప్రజల్లో ఉందని.. దాన్ని పక్కన పెట్టేందుకే రజనీకాంత్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. “పట్టణ ఓటర్లలో జగన్ పై వ్యతిరేకత ఉంది. కానీ గ్రామీణ ప్రాంత ఓటర్లు వైసీపీకి జై కొట్టారు. కచ్చితంగా ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని” రజనీకాంత్ వ్యాఖ్యలు చేయడం విశేషం.

అయితే తన ఆర్ టీవీ ద్వారా రవి ప్రకాష్ చేసిన సర్వేలో కూటమికి అధికారంలోకి వస్తుందని చెబితే.. పోలింగ్ ముగిసిన తర్వాత అదే రవి ప్రకాష్ శిష్యుడు రజనీకాంత్ ఏకంగా వైసిపి అధికారంలోకి వస్తుందని ప్రకటించాడు. అంటే గురు శిష్యులు పార్టీలుగా విడిపోయారన్నమాట.. ఇంతకీ గురు శిష్యులు చెప్పిన జోస్యం లో ఎవరికి అధికారం దక్కుతుందో, ఎవరికి ప్రతిపక్ష స్థానం లభిస్తుందో జూన్ 4న తేలనుంది.