TTD Ghee Adulteration Case: టీటీడీ లడ్డు తయారీకి సంబంధించి.. నెయ్యి కల్తీ వ్యవహారంలో గత కొద్దిరోజులుగా ఏకసభ్య కమిషన్ విచారణ కొనసాగింది. అయితే ఈ విచారణకు గడువు సమీపించిన నేపథ్యంలో.. ఏకసభ్య కమిషన్ దర్యాప్తు నివేదిక ప్రభుత్వానికి అందింది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో అప్పటి టీటీడీ ఈవో ధర్మారెడ్డి అసలు సూత్రధారి అని తేల్చింది. ఆయనతోపాటు అప్పటి మరో అధికారి సింఘాల్, ఆర్థిక సలహాదారుడు, చీఫ్ అకౌంటింగ్ ఆఫీసర్ బాలాజీ, ప్రాక్యుమెంటర్ ఆఫీసర్లు జగదీశ్వర్ రెడ్డి, సుబ్రహ్మణ్యం, నెయ్యి నిపుణుడు సురేంద్రనాథ్, డైరీ నిపుణుడు విజయ భాస్కర్ రెడ్డి ప్రధాన పాత్రధారులుగా తేల్చింది ఏకసభ్య కమిషన్. కొద్ది రోజుల కిందట రాష్ట్ర ప్రభుత్వం విశ్రాంత ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ గత కొద్దిరోజులుగా విచారణ చేపట్టి ప్రభుత్వానికి తుది నివేదిక ఇచ్చింది. సంచలన అంశాలను బయటపెట్టింది. ప్రధానంగా ఈ తప్పు జరగడానికి కారణం అప్పటి ఈవో ధర్మారెడ్డిగా తేల్చింది.
* రాజశేఖర్ రెడ్డి నుంచి..
వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబ అధికారిగా ధర్మారెడ్డికి పేరు ఉంది. ఎక్కడో ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఈ అధికారిని డిప్యూటేషన్ పై తెచ్చి టీటీడీలో నియమించారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా టీటీడీ ఈవోగా ధర్మారెడ్డి ఉండేవారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయనను ప్రత్యేకంగా తెప్పించుకున్నారు. ఇప్పుడు అదే అధికారి టిటిడి లడ్డు కల్తీ వ్యవహారంలో అడ్డంగా బుక్కయ్యారు. ఆయన తీసుకున్న నిర్ణయాలు, పర్యవేక్షణ లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం.. వంటి కారణాలతోనే నెయ్యిలో కల్తీ జరిగిందని తేల్చేసింది ఏకసభ్య కమిషన్.
* వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 2019 జూన్ లో అధికారంలోకి వచ్చింది. జూలైలో అదనపు ఈవోగా బాధ్యతలు స్వీకరించారు ధర్మారెడ్డి. 2022 మే వరకు అదే హోదాలో కొనసాగారు. అప్పటినుంచి ఈవోగా కొనసాగారు. ధర్మారెడ్డి ఈవోగా బాధ్యతలు తీసుకున్న అనంతరం నెయ్యి సరఫరాకు సంబంధించి కొన్ని రకాల నిబంధనలు సడలించారు. నెయ్యి సరఫరాదారుల అర్హతలు, విశ్వసనీయత, అనుభవం, సమర్థత, నాణ్యత హామీలు నిలబెట్టుకోవడం, పర్యవేక్షణ, తనిఖీలు వంటి వాటిని గాలికి వదిలేసారు. దాని ఫలితంగానే కల్తీ అయిన నెయ్యి టీటీడీలో ప్రవేశించింది అనేది ఏకసభ్య కమిషన్ విచారణలో తేలిన అంశం. అయితే ఈ విషయంలో అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలను పాటించారా? లేదా? అనే అంశాన్ని పక్కన పెడితే.. టీటీడీ పాలకమండలి దృష్టికి సడలించిన నిబంధనలను తీసుకెళ్లలేదని తెలుస్తోంది. అయితే అప్పట్లో ఈవో గా సింఘాల్ సైతం బుక్కయ్యారు. అయితే ప్రస్తుతం ఏకసభ్య కమిషన్ తప్పిదాల్లో ఉన్న అధికారులంతా వైసీపీ అస్మదీయులే అనేది స్పష్టమవుతోంది. మరి ఈ విషయంలో ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి. ధర్మారెడ్డి, సింఘాల్ తో పాటు అప్పటి ఉన్నతాధికారుల చుట్టూ ఉచ్చు బిగిస్తోంది.