Homeఆంధ్రప్రదేశ్‌Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట.. తప్పు వారిదేనా?

Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట.. తప్పు వారిదేనా?

Tirupati Stampede: తిరుపతిలో( Tirupati) ఊహకందని విషాదం జరిగింది. స్వామి వారి దర్శన టోకెన్ల జారీ ప్రక్రియలో అపశృతి( accident) చోటుచేసుకుంది. తొక్కిసలాటలో ఏకంగా ఆరుగురు మృతి చెందారు. పదుల సంఖ్యలో క్షతగాత్రులు అయ్యారు. ఈ ఘటన యావత్ రాష్ట్రాన్ని కలచివేసింది. తిరుమల ప్రతిష్టను మసకబార్చింది. అయితే ఇది ప్రమాదమా? విద్రోహ చర్య? మానవ తప్పిదమా? అన్నది తెలియాల్సి ఉంది. దీనిపై లోతైన దర్యాప్తు జరుగుతోంది. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత.. టీటీడీ భద్రతపై అనేక ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ఘటన వెనుక అసలు ఏం జరిగింది? తప్పు ఎవరిది? అన్నది బలమైన చర్చ నడుస్తోంది. ఉదయం టీటీడీ పటిష్ట చర్యలు చేపట్టడంపై భక్తుల నుంచి ప్రశంసలు వచ్చాయి. కానీ సాయంత్రానికి సీన్ మారిపోయింది. కేవలం టిటిడి తప్పిదం వల్లే ఈ ఘటన జరిగిందని ఆక్షేపణలు ప్రారంభమయ్యాయి.

* భక్తులది తప్పిదమే
ఈ నెల 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించడానికి టీటీడీ( Tirumala Tirupati Devasthanam) నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్లో టోకెన్ల జారీ ప్రక్రియ కూడా పూర్తయింది. ఆఫ్లైన్ టోకెన్ల జారీకి సంబంధించి ఈరోజు నుంచి ప్రారంభించాలని టిటిడి నిర్ణయం తీసుకుంది. అదే విషయాన్ని ముందుగానే చెప్పుకొచ్చింది టీటీడీ. అయితే తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన భక్తులు బుధవారం ఉదయం నాటికే తిరుపతికి చేరుకున్నారు. ఉత్తర ద్వార దర్శనం తో పాటు స్వామివారికి మొక్కుబడులు చెల్లించాలనుకున్నవారు సైతం ఒకేసారి రావడం తిరుపతి రద్దీగా మారింది. పైగా టోకెన్లు దక్కుతావో లేదో.. లేకుంటే స్వామివారి దర్శనం లేకుండా వెనక్కి తిరగాల్సి వస్తుందేమోనని చాలామంది భక్తులు ఆందోళన చెందారు. భారీ క్యూ లైన్ లో ఉండడం చూసి గాబరాపడ్డారు. దాని ఫలితంగానే క్యూలైన్లలో తొక్కిసలాట దారి తీసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇందులో భక్తుల తప్పిదం కూడా కనిపిస్తోంది.

* పోలీస్ శాఖ పనితీరుపై అనుమానాలు
మరోవైపు పోలీస్ శాఖ( police department) పనితీరుపై కూడా అనేక రకాల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో తిరుపతి జిల్లా పోలీస్ యంత్రాంగం పై అసహనం వ్యక్తం అవుతుంది. అన్నింటికీ మించి ఈ ఘటనకు ఓ డిఎస్పి వైఖరి కారణమని పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. రెండు లక్షల 50 వేల టోకెన్లు అందించేందుకు వీలుగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. అంటే వేలాదిమంది జనాలు చొచ్చుకొస్తారని తెలుసు కదా. అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం పోలీస్ శాఖపై ఉంది కదా. కానీ చాలా తేలిగ్గా తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఎస్పీ సుబ్బారాయుడు( SP Subba Rayudu ) ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న.. కిందిస్థాయిలో పోలీస్ సిబ్బంది మాత్రం అనుకున్న స్థాయిలో పని చేయలేదన్న విమర్శ ఉంది. పైగా ఉన్నపలంగా గేటు తీయాల్సిన పరిస్థితి పోలీసులకు ఎందుకు వచ్చింది. గురువారం ఉదయం తెరవాల్సిన గేటు.. బుధవారం రాత్రి ఎందుకు తెరిచినట్టు? పోలీసుల చుట్టూ వివాదం అల్లుకోవడానికి అదే కారణం.

* టిటిడి పై విమర్శలు
ఇక తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు( TTD trust board ), అధికారుల పనితీరుపై కూడా అనేక రకాల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఉత్తర ద్వార దర్శనం పై పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆన్లైన్ టికెట్ల జారీ ప్రక్రియ సక్సెస్ గా పూర్తి చేశారు. మరి ఆఫ్లైన్లో టికెట్ల విషయంలో సైతం జాగ్రత్తలు తీసుకోవాలి కదా. లక్షలాదిమంది భక్తులు వస్తారని అంచనా వేశారు. కానీ అందుకు తగ్గ ఏర్పాట్లు చేయలేదు. టోకెన్ల జారీకి సంబంధించి కౌంటర్లను పెంచలేదు. ఆ ప్రభావం నిన్న తిరుపతిలో స్పష్టంగా కనిపించింది. టీటీడీకి ప్రతి జిల్లాలో కళ్యాణ మండపాలు ఉన్నాయి. అనుబంధ సంస్థలు ఉన్నాయి. పైగా పేరు మోసిన దేవస్థానాలు ఉన్నాయి. అక్కడే ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించి టోకెన్లు జారీ చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా.. అని ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీస్, టీటీడీ వర్గాలపై ఆక్షేపణలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో భక్తుల వ్యవహార శైలి సైతం చర్చకు వస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version