Tirumala Special Entry Darshan Tickets: నిత్య కళ్యాణం.. పచ్చ తోరణం.. ఇలా ప్రతిరోజు భాసిల్లుతూ ఉంటుంది తిరుమల క్షేత్రం.. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ప్రతిరోజు వేలాదిమంది భక్తులు స్వామివారి వద్దకు వస్తూ ఉంటారు. ఇందులో దర్శన భాగ్యం కొంతమందికి మాత్రమే లభిస్తూ ఉంటుంది. విపరీతంగా రద్దీ ఉంటుంది కాబట్టి దేవస్థానం ఎప్పటికప్పుడు భక్తులకు స్వామివారిని దర్శించుకోవడానికి ఏర్పాట్లు చేస్తూనే ఉంటుంది..
తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్లైన్లో రెండు నెలలకు ముందుగానే దర్శనం టికెట్లను విడుదల చేస్తూ ఉంటుంది. వీటిని స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లు అంటూ ఉంటారు. ఒక టికెట్ ధర 300 వరకు ఉంటుంది. అయితే ఈ టికెట్లు కొంతమందికి మాత్రమే లభిస్తూ ఉంటాయి. చూస్తుండగానే టికెట్లు అయిపోతుంటాయి. టికెట్లు దొరికిన వారు దర్శనానికి వెళ్తుంటారు. టికెట్ లభించని వారు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే ముందస్తు టికెట్ ఉంటే తిరుమల లో దర్శనం అనేది సులభంగా జరిగిపోతూ ఉంటుంది. టికెట్ లేకుండా వెళ్తే ఎస్ ఎస్ డి టోకెన్లు ఒకరోజు ముందుగానే తీసుకోవాలి. సర్వదర్శనానికి వెళ్తే గంటల తరబడి ఎదురు చూడాలి. ఈ ప్రయాస లేకుండా.. 300 టికెట్ లభించకపోయినప్పటికీ భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారిని దర్శించుకునే భాగ్యాన్ని కల్పిస్తోంది.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస దివ్య అనుగ్రహ విశేష హోమం నిర్వహిస్తుంటారు. ఈ హోమానికి సంబంధించిన టికెట్ ధర 1600 వరకు ఉంటుంది. ఇది గనక తీసుకుంటే ఇద్దరు వ్యక్తులు హోమంలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. హోమం పూర్తయిన తర్వాత 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి ఉచితంగా వెళ్లడానికి అవకాశం ఉంటుంది. ప్రతినెల ఈ హోమానికి సంబంధించిన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్లైన్లో విడుదల చేస్తూ ఉంటుంది. ఏప్రిల్ నెల టికెట్లను మార్చి 25న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ టికెట్ లు బుక్ చేసుకున్నవారు హోమం లో పాల్గొనవచ్చు. అంతేకాకుండా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం పొందవచ్చు. హోమం పూర్తయిన తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుంచి స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తుంటారు.
ఒకవేళ హోమం టికెట్లు ఆన్లైన్ లో లభించకపోతే అలిపిరి లో తిరుమల తిరుపతి దేవస్థానం టికెట్ కౌంటర్లలో కొనుగోలు చేయవచ్చు. ఈ హోమం అరిపిరిలోని సప్త గో ప్రదక్షిణ శాలలో నిర్వహిస్తూ ఉంటారు. ఈ అవకాశం ఒకటి ఉందని.. దీని ద్వారా స్వామివారిని దర్శించుకోవచ్చని చాలామందికి తెలియదు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు సూచిస్తోంది.
తిరుమలలో ప్రస్తుతం భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. ప్రతిరోజు స్వామివారిని నలభై వేలకు మందికిపైగా భక్తులు దర్శించుకుంటున్నారు. హుండీ ఆదాయం కూడా మూడు కోట్లకు పైగానే వస్తోంది. దీనికి తోడు ఏప్రిల్ నెల 1వ తేదీన ఒంటిమిట్ట ప్రాంతంలో సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేసింది. స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లను పూర్తి చేసింది.. ఎండాకాలం కావడంతో భక్తులు దాహార్తితో ఇబ్బంది పడకుండా ఉండడానికి తిరుమల తిరుపతి దేవస్థానం తాగునీటి సౌకర్యాన్ని మరింత విస్తృతంగా కల్పిస్తోంది. భక్తుల కోసం పాలు.. అల్పాహారం.. భోజనం.. తాగునీటి వసతి కల్పిస్తోంది.
