Homeఆంధ్రప్రదేశ్‌Kotla Suryaprakash Reddy  : వైసీపీవి అరాచకం అన్నారు.. ఇప్పుడు మీరు చేస్తుందేమిటి? ఇద్దరు యువకులను...

Kotla Suryaprakash Reddy  : వైసీపీవి అరాచకం అన్నారు.. ఇప్పుడు మీరు చేస్తుందేమిటి? ఇద్దరు యువకులను చితకబాదిన ఎమ్మెల్యే.. వీడియో వైరల్!

Kotla Suryaprakash Reddy : ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనకు రెండు నెలలు సమీపిస్తోంది.అయితే చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీలో శాంతిభద్రతలకు క్షీణించాయంటూ వైసిపి ఆరోపిస్తోంది. జాతీయస్థాయిలో ఆ పార్టీ ఆందోళన కూడా చేసింది. ఈ తరుణంలో సోషల్ మీడియాలో తరచూ ప్రభుత్వంపై వ్యతిరేక పోస్టులు వెలుస్తున్నాయి.భట్టిప్రోలు ఎస్సై పై టిడిపి నేతలు చేయి చేసుకున్నారని ప్రచారం జరిగింది. అది మరవక ముందే కర్నూలు జిల్లా డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి వ్యవహార శైలి హైలెట్ అవుతోంది. ఇద్దరు యువకులను చితకబాదుతూ ఆయన కనిపించారు. పంచాయితీ పేరుతో చుట్టూ జనం ఉండగా..ఎదురుగా కుర్చీలో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కూర్చున్నారు.ఆయనకు సమీపంలో ఇద్దరు యువకులు ఉన్నారు. వారిపై కర్రతో విచక్షణ రహితంగా కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి కొడుతున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏపీలో అరాచక పర్వం కొనసాగుతోందని.. కర్ర పెత్తనంతో వైసిపి ప్రజాప్రతినిధులు రెచ్చిపోతున్నారంటూ ఆ పార్టీ అనుకూల మీడియా ప్రచారం చేస్తోంది.దీనిపై సాక్షిలో ప్రత్యేక కథనం కూడా వచ్చింది.ఈ వీడియోతో వైసీపీ సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది. ఇదో వైరల్ అంశంగా మారింది. వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నాయి. బలహీన వర్గాలకు చెందిన ఇద్దరు యువకులను.. పంచాయితీ పేరుతో తీసుకొచ్చి.. ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి చట్టాన్ని తన చేతిలోకి తీసుకున్నారని.. విచక్షణ రహితంగా కొట్టి హింసకు పాల్పడ్డారంటూ అజ్ఞాత వ్యక్తులు పెట్టిన పోస్టులను సాక్షి బయట పెట్టింది. అప్పటినుంచి వివాదం ప్రారంభమైంది. తెగ ప్రచారం నడుస్తోంది.

*:అనూహ్యంగా డోన్ తెరపైకి
కోడుమూరు నియోజకవర్గం నుంచి సుదీర్ఘకాలం రాజకీయాలు నడిపారు కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి. ఆయన దివంగత ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమారుడు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పని చేశారు. కర్నూలు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. అయితే అనూహ్య పరిస్థితుల్లో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ ఎన్నికల్లో కర్నూలు ఎంపీ సీటును ఆశించారు. కానీ చంద్రబాబు వ్యూహాత్మకంగా డోన్ నియోజకవర్గాన్ని కేటాయించారు. అయిష్టంగానే అక్కడకు వెళ్లారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి. సిట్టింగ్ మంత్రిగా ఉన్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ని ఓడించి రికార్డు సృష్టించారు.

* ఫామ్ హౌస్ లో పంచాయితీ
అయితే తాజాగా ఓ వివాదానికి సంబంధించి పంచాయితీ నిర్వహించినట్లు తెలుస్తోంది. తన ఫామ్ హౌస్ కు ఇద్దరు యువకులను పిలిచి పంచాయతీ చేసినట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది. ఆ ఇద్దరు యువకులు తప్పు చేశారని తెలియడంతో.. తీవ్ర ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే కోట్ల విజయభాస్కర్ రెడ్డి వారిపై చేయి చేసుకున్నారు. కర్రతో విచక్షణ రహితంగా కొట్టారు. బాధిత యువకులు వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన వారని..ఆ వర్గంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోందని.. ఒక ఎమ్మెల్యే చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం ఏమిటని.. ఇలా రకరకాలుగా ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అయితే ఆ పంచాయితీ ఎందుకు చేశారు? వారు చేసిన తప్పేంటి? వారు నిజంగానే వాల్మీకి కులస్తులా? కాదా అని మాత్రం చెప్పలేకపోతున్నారు. కేవలం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని సాక్షి హైలెట్ చేస్తూ కథనం ప్రచురించింది. వైసీపీ శ్రేణులు దానినే ట్రోల్ చేస్తున్నాయి.

* ఘాటుగా స్పందిస్తున్న నెటిజెన్లు
ఇదేమి రాజ్యం అంటూ సోషల్ మీడియాలో వెలుస్తున్న పోస్టులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. దీనిపై నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. వైసీపీ చేసిన అరాచకాలకు గుణపాఠం నేర్పామని.. ఇప్పుడు అదే బాటలో కూటమి పాలకులు నడవడంపై నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. అయితే దీనిపై టిడిపి ఇంతవరకు స్పందించలేదు. ఫ్యాక్ట్ చెక్ పేరిట వివరణ ఇచ్చే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది.

 

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular